తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ “తెలుగు వెలుగు "ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం..! " తెలుగు " ను కొత్త " వెలుగు " లో ప్రపంచానికి చూపిద్దాం!

Thursday, November 17, 2011

మనకు తెలియని మన త్యాగరాజు - !!

త్యాగరాజుకి సంగీతంపై ఉన్న శ్రద్ధా, ప్రజ్ఞా ఆయన చిన్నవయసులోనే తండ్రి
రామబ్రహ్మం గ్రహించాడు. సంగీత విద్వాంసుల కుటుంబం కావడంవల్ల అతి పిన్న
వయసులో త్యాగరాజు చూపించిన ప్రతిభ సులభంగానే తెలిసింది. పదిహేనేళ్ళ
వయసులో త్యాగరాజు మొట్టమొదట రాసిన “నమో నమో రాఘవాయ” కృతిని ఇంటి గోడలపై సున్నపు కణికలతో రాస్తే, అది చూసి రామ బ్రహ్మం స్నేహితులు అతన్ని తంజావూరులో ఉన్న ప్రసిద్ధ సంగీత విద్వాంసుల వద్దకు పంపమని చెప్పారు. రామబ్రహ్మం తంజావూరు ఆస్థానంలో రామాయణ వ్యాఖ్యానం చేసేవాడు. త్యాగరాజు కూడా చిన్నతనంలో తండ్రితో వెళ్ళేవాడు. తంజావూరు రాజ్యాధిపతి తుల్జాజీ ఆస్థానంలో శొంఠి వేంకటరమణయ్య అనే సంగీత విద్వాసుడుండేవాడు.
రామబ్రహ్మం త్యాగరాజుని శొంఠి వేంకటరమణయ్య దగ్గర శిష్యుడిగా చేర్పించాడు. త్యాగరాజు కొంతకాలం గురువు వద్దుండి, తంజావూరులోనే సంగీత విద్య నభ్యసించాడు. ఇది 1782లో, పదిహేనేళ్ళ వయసులో ఉండగా జరిగింది. అప్పటికింకా త్యాగరాజుకి వివాహం కాలేదు. గురువు వద్ద సంగీత శాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. అతి తక్కువ కాలంలోనే అందులో ప్రావీణ్యం సంపాదించాడు. శొంఠి వేంకటరమణయ్య త్యాగరాజు ప్రతిభని మెచ్చుకొని తన వద్దనున్న “తాన” పుస్తకం బహుకరించాడు. ఇందులో వివిధ రకాల తాళాల గురించీ, వాటి ఉప జాతుల గురించీ వివరంగా వుంది. దీన్ని వాలాజపేట శిష్యులు భద్రపరిచారు. అది ఇప్పటికీ మదురై సంగీత సౌరాష్ట్ర సభలో ఉంది. ఇది వారి చేతికెలా వచ్చిందో తెలీదు.
తిరువయ్యూర్ తంజావూరుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరువయ్యూర్ చేరాలంటే పడవల్లో కావేరీ నది దాటి వెళ్ళాల్సిందే! త్యాగరాజు గురువు వద్ద ఎక్కువకాలం సంగీతం నేర్చుకున్నట్లాధారాలు లేవు. మాతామహుల మరణమూ, ఆ తరువాత కొంతకాలానికి త్యాగరాజు వివాహమూ ఒక దాని తరువాత ఒకటి జరగడంతో త్యాగరాజు వేంకట రమణయ్య వద్దకు తిరిగి వెళ్ళలేదు. కానీ గురువు గారంటే అమితమైన భక్తీ, గౌరవమూ ఉన్నాయి. త్యాగరాజుకు వివాహం అయిన తరువాత తండ్రి రామబ్రహ్మానికి సుస్తీ చేసింది. అనారోగ్యంతో ఉన్న తండ్రిని వదిలి వెళ్ళ లేకపోయాడు. తాతగారి ఇంట్లో దొరికిన తాళ పత్ర గ్రంధాల్లో ఉన్న సంగీత రత్నాకరంలో విషయాలు కొన్ని బోధపడలేదు. గురువు గార్ని కలుద్దామని ఎంత ప్రయత్నించినా కుటుంబ బాధ్యతల వల్ల కుదర్లేదు. ఈ లోగా రామ బ్రహ్మం మరణించాడు.
రామబ్రహ్మం అనారోగ్యం వల్ల మంచం పట్టినప్పుడు, అతని భార్య సీతమ్మ తనూ భర్తతో సహగమనం చేస్తానని చెప్పినట్లుగా ప్రొఫెసర్ సాంబమూర్తి “ది గ్రేట్ కంపోజర్స్” పుస్తకంలో రాసారు. సహగమనం వద్దనీ, త్యాగరాజుని దగ్గరుండి చూసుకోమనీ, అతని సంగీత వైభవాన్ని కళ్ళారా చూడమనీ రామబ్రహ్మం ఆమెను వారింఛాడు. ఆయన కోరికను మన్నించి సీతమ్మ తన నిర్ణయం మార్చుకుందనీ రాసారు. దీని ఆధారాలు తెలీవు. ఈ కథనం మాత్రం సాంబమూర్తి గారి రచనలోనే కనిపించింది. దక్షిణాది బ్రాహ్మణ కుటుంబాల్లో సహగమనం ఆచారం అంతగా కనబడదు. మిగతా ఎవరూ దీని ప్రస్తావనే తీసుకు రాలేదు.
రామబ్రహ్మం 1787 లో చనిపోయాడు. అప్పటికి త్యాగరాజుకి సరిగ్గా ఇరవై ఏళ్ళు. ఈ విషయం వెంకటరమణ భాగవతార్ రాసిన చరిత్రలో ఉంది ( పేజీ 60 – Tyagaraja and the Renewal of Tradition, William. J. Jackson). ఇది జరిగిన కొంత కాలానికి, ఉపనయన సమయంలో నారదోపాసక మంత్రోపదేశం చేసిన రామకృష్ణానంద స్వామి ఆశీర్వాద ప్రభావం వల్ల, త్యాగరాజుకి స్వరార్ణవంలో అంశాలు అతి సులభంగా బోధపడ్డాయన్నట్లుగా ప్రొఫెసర్ సాంబమూర్తి రాసారు. సాక్షాత్తూ నారదుడే వచ్చి “నారదీయం” అనే గ్రంధాన్ని బహుకరించాడన్న ఇంకో కథ ఉంది. నారదుడే రామకృష్ణానంద స్వామి రూపంలో వచ్చారని హరికథ భాగవతులు అనుకొనుండచ్చు. త్యాగరాజు చూపించిన సంగీత ప్రతిభా, సృజనా మానవ మాత్రులకి సాధ్య పడదనుకొని, కేవలం దైవకృప వల్లే ఇది సంక్రమించిందని భావించే అవకాశముంది.









గురువు శొంఠి వేంకటరమణయ్య, త్యాగరాజు
త్యాగరాజు సంగీత ప్రాభవం రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. ఆనోటా, ఈనోటా త్యాగరాజు కృతులు ప్రచారం కావడంతో ఈ విషయం గురువుగారైన శొంఠి వేంకటరమణయ్య వరకూ ప్రాకింది. ప్రతీ ఏడూ ఉగాది పర్వదినాన తంజావూరు దర్బారు హాలులో సంగీత కచేరీలు జరిగేవి. వీలుని బట్టి రాజులు కూడా విచ్చేసేవారు. కేవలం ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసులకే అందులో పాడే అవకాశం లభించేది. ఒక ఉగాది సంగీత కచేరీకి గురువుగారి నుండి త్యాగరాజుకి ఆహ్వానమొచ్చింది. త్యాగరాజుకి గురువంటే ఉన్న భక్తి వలన కచేరీ చెయ్యడానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో రాగ విస్తారణకీ, ఆలాపనకీ ఎంతో ప్రాముఖ్యతిచ్చేవారు. ఆ సభలో త్యాగరాజు చూపించిన సంగీత విన్యాసం చూసి ఆశ్చర్యపోయారందరూ. ఈ సంగీత సభలో రాగాలాపన, నెరవులు లాంటి మనోధర్మ ప్రక్రియలను ప్రకటిస్తూ, “జానకీ రమణా”, “దొరకునా ఇటువంటి సేవ” (బిలహరి రాగం) కృతుల్నీ పాడాడు. త్యాగరాజు ప్రతిభ చూసి అమితానందభరితుడైన శొంఠి వేంకటరమణయ్య, పండితులందరి ముందూ అతన్ని సత్కరించినట్టు వెంకట రమణ భాగవతార్ రాసిన చరిత్రలో ఉంది.

శొంఠి వేంకటరమణయ్య వద్ద త్యాగరాజు సంగీత విద్యని ప్రదర్శించిన సంఘటన 1792లో త్యాగరాజు 25వ ఏట జరిగింది. దీనికాధారం కృష్ణ భాగవతార్ రాసిన జీవిత చరిత్ర. “గురువు శొంఠి వేంకట రమణయ్య గారి పైనున్న భక్తీ, గౌరవంతో త్యాగరాజు తన 25వ ఏట స్వీయ కృతులని విద్వాంసులందరి ముందూ పాడాడు. తమ రాజవిధుల్ని విస్మరించి మరీ ఆ సంగీతంలో లీనమైపోయారందరూ. పండితులందరి ముందూ గురువుగారు త్యాగరాజుని సత్కరించాడు. తనకి రాజు బహూకరించిన కంఠాభరణాన్నీ, రాజ పతకాన్నీ ఇచ్చి గౌరవించాడు. “త్యాగరాజు సంగీత జ్ఞానం ఒక వనమైతే అందులో తన సంగీతం ఒక చిన్న మొలకనీ అభివర్ణించాడు…” అంటూ (Tyagaraja and Renewal of Tradition, William J. Jackson) రాసారు. ఈ సంఘటన గురించి వెంకటరమణ భాగవతార్ రాసిన జీవిత చరిత్రలో, “జానకీ రమణా”, “దొరకునా ఇటువంటి సేవా ” వంటి కీర్తనలు పాడారని చెబుతూ విపులంగా ఉంది. ఇంత విపులంగా కృష్ణ భాగవతార్ రాసిన జీవిత చరిత్రలో లేదు.
ఈ సందర్భంగా గురువుగారు తనకు బహుకరించిన బహుమానాల్ని త్యాగరాజు గురువుగారికే తిరిగి ఇచ్చేశాడు. గురువుగారి కూతురి పెళ్ళి సందర్భంలో త్యాగరాజు ఆభరణాలు తిరిగిచ్చేసాడని వెంకటరమణ భాగవతార్ రాస్తే, తన పెళ్ళికే విచ్చేసిన గురువుకి కానుకగా ఇచ్చాడంటూ కృష్ణభాగవతార్ రాసాడు. గురువు వద్ద మొదటి కచేరీ చేసిన సంఘటన, 1792 లో త్యాగరాజుకి ఇరవై అయిదు సంవత్సరాలప్పుడు జరిగింది. కానీ త్యాగరాజు మొదటి వివాహం పద్దెనిమిదో ఏటే జరిగింది. కాబట్టి ఇక్కడ 25 వ ఏట జరిగిన వివాహం బహుశా త్యాగరాజుకి కమలాంబతో జరిగిన రెండో వివాహ సందర్భమయి ఉండాలి.

ఈ సభలోనే “ఎందరో మహానుభావులు” అనే ఘన రాగ పంచరత్న కృతి పాడినట్లుగా ఇంకో ప్రచారం ఉంది. ఎవరూ అంతగా ఉపయోగించని జన్య రాగమైన శ్రీ రాగంలో స్వరపరిచాడా కృతిని. ఆ కృతిలో ఎంతో మందిని స్మరించినందువల్లా, ఆ సందర్భానికది కుదిరినందువల్లా ఎందరో మహానుభావులు కృతే పాడుండచ్చనీ చాలా మంది ఊహాగానం చేసారు (త్యాగరాజు సినిమాలో, కొన్ని పుస్తకాల్లో కూడా). కాకపోతే ఇది మాత్రం సరి కాదని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే త్యాగరాజు ఘన రాగ పంచరత్న కీర్తనలు నలభై ఏళ్ళు దాటిన తరువాతే రచించాడు. త్యాగరాజుకి తంజావూరు రామారావు అనే ఓ బాల్య మిత్రుడూ, శిష్యుడూ ఉండేవాడు. ఈయన ప్రోద్బలం తోనే త్యాగరాజు పంచరత్న కీర్తనలు రాసాడని ఉంది. వెంకటరమణ భాగవతార్ తో కలిసి త్యాగరాజు జీవిత చరిత్ర రాయడానికి మొట్ట మొదటసారి సంకల్పించింది ఈ తంజావూరు రామారావే!
రాజాహ్వానం

త్యాగరాజుకి రెండుసార్లు రాజాస్థానం నుండి పిలుపొచ్చింది. శొంఠి వేంకటరమణయ్య ఆహ్వానంపై మొదట సారి తంజావూరు దర్బారు హాల్లో కచేరీ చేసిన జరిగిన వెంటనే రాజుగారు పిలిచారు. అప్పుడు త్యాగరాజుకి పాతికేళ్ళు. రెండో సారి 30 ఏళ్ళు దాటాక వచ్చింది. త్యాగరాజు జీవిత చరిత్ర రాసిన చాలామంది ఈ రెండు ఆహ్వానాలు ఒకటేనని భావించారు. అప్పటి కాలాన్ని బట్టీ, ఆ సమయంలో తంజావూరు రాజెవరన్న దాన్ననుసరించీ, ఇవి వేర్వేరు సంఘటనలన్న విషయం నిర్థారణ చేయచ్చు. మొదటి సారి పిలిచినపుడు రాజు పేరు తుల్జాజీ. రెండోసారి పిలుపొచ్చినప్పుడు రాజు పేరు శరభోజి. ఆ రెండు సంఘటనలూ ఏమిటో చూద్దాం.

శొంఠి వెంకట రమణయ్య ద్వారా త్యాగరాజు సంగీత ప్రతిభ తెలుసుకున్న తుల్జాజీ రాజు, తన వద్దకొచ్చి రాజదర్బారులో కచేరీ ఇవ్వవలసిందిగా కోరుతూ ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తాననీ కబురు పంపాడు. తుల్జాజీ ఆస్థాన విద్వాంసుల్లో ఒకడిగా ఉండడం త్యాగరాజు ఇష్టపడలేదు. రాజాస్థానం అతనికి కొత్తకాదు. తండ్రితో వెళ్ళేవాడు. అక్కడ ఎదురయ్యే పరిస్థితులూ, ఇబ్బందులూ, మొహమాటాలూ తెలుసు. అక్కడికెళితే తన సంగీతాన్ని పంజరంలో బంధించినట్లేనని భావించాడు. సంగీతాన్నీ, సాహిత్యాన్ని వెల కట్టకూడదన్న ఒక అభిప్రాయం దృఢంగా వచ్చేసింది. రాజుగారు పంపిన రెండు మూడాహ్వానాలనీ, ఏదో ఒక కుంటిసాకు చూపించి తిరస్కరించాడు. తుల్జాజీ ఈ విషయంపై స్పందించే లోపల తంజావూరు పై ముస్లిం నవాబులు యుద్ధానికొచ్చారు. ఆ గొడవలో ఇది కాస్తా వెనక్కి వెళ్ళింది. ఇది జరిగేనాటికి త్యాగరాజుకి పాతికేళ్ళు.

కృష్ణస్వామి భాగవతార్ రాసిన జీవిత చరిత్రలో ఈ సంఘటన గురించి ఇలా ఉంది. “త్యాగరాజు సంగీత ప్రతిభ విని, ఆయన్ని సత్కరించాలని తంజావూరు రాజు చాలా సార్లు ప్రయత్నించాడు. కానీ త్యాగరాజు రాజాస్థానానికి వెళ్ళడానికి అంగీకరించ లేదు. ఆ తరువాత రామ బ్రహ్మం అనారోగ్యం వల్ల మరణించాడు…” (పేజీ 64. Tyagaraja and the Renewal of Tradition, William J Jackson) అని రాసారు. అంటే ఈ సంఘటన రామబ్రహ్మం బ్రతికుండగానే జరిగుండాలి. కానీ రామబ్రహ్మం త్యాగరాజు ఇరవయ్యో ఏట పోయాడు. ఇది అందరూ ఒకే విధంగా రాసారు. కాబట్టి రాజు గారు ఆహ్వానం పంపించిన కాలం సుమారుగా త్యాగరాజు ఇరవయ్యో ఏట కానీ, ముందు కానీ అయ్యుండాలి.

త్యాగరాజు 25వ ఏటనే గురువు వద్ద కచేరీ చేసాడని విశ్వసిస్తే, కృష్ణ భాగవతారు పేర్కొన్నట్లుగా రాజాహ్వాన సంఘటన దాని తరువాత జరిగిందేనా అయ్యుండాలి. లేదా త్యాగరాజు ఇరవయ్యో ఏటికి ముందే రాజుగారి ఆహ్వనం అందుండాలి. ఎందుకంటే ఆ సంఘటనలో రాజు పేరు శరభోజీ అని అందరూ రాసారు. అందువల్ల ఆ రాజు శరభోజీ రాజేని విశ్వసిస్తే, కృష్ణ భాగవతార్ పైన రాసిన సంఘటనలో రాజు మాత్రం ఖచ్చితంగా శరభోజి కాదు. ఆప్పటి రాజు తుల్జాజీ. ఎందుకంటే శరభోజి తంజావూరు గద్దెనెక్కింది 1798 లో. అప్పటికి త్యాగరాజుకి సుమారుగా 31 యేళ్ళు. తుల్జాజీ హయాంలో చాలామంది సంగీత విద్వాంసులూ, కవులూ, కళాకారులూ బాగా పోషింపబడ్డారు. అదీకాక “రాజు” అనే సంబోధనే ఉండడం వల్ల శరభోజీనే అయ్యుండచ్చని గ్రహించుంటారు. దీన్నిబట్టి చూస్తే త్యాగరాజుకి రెండు సార్లు రాజుల వద్దనుండి పిలుపొచ్చింది. మొదటి సారి తుల్జాజీ నుండి. రెండోసారి శరభోజి నుండి. ఏది సరైంది? ఏది కాదు? తెలియాలంటే అప్పటి తంజావూరు రాజకీయ పరిస్థితి ఎలావుందో తెలియాలి.
తంజావూరు రాజకీయ పరిస్థితి

తూర్పు భారత దేశంలో వ్యాపార నిమిత్తమై ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో అడుగుపెట్టిన బ్రిటీషు వాళ్ళు దక్షిణాన మద్రాసు వరకూ వచ్చేసారు. అప్పటికే ఫ్రెంచి వాళ్ళూ, డచ్చి వాళ్ళూ దక్షిణాదిన మకాం వేసారు. తుల్జాజీ బ్రిటీషు వాళ్ళతో 1767 నుండీ దాదాపు రెండేళ్ళ పైగా యుద్ధం చేసాడు. అప్పుడే కరువొచ్చి పడింది. ఈ కరువు బ్రిటీషు వారి పాలిట వరమయ్యింది. చిన్న చిన్న రాజుల్ని తమ వైపుకి తిప్పుకొని వారికి సాయం చేస్తున్నట్లుగా భ్రమ కల్పిస్తూ, మెల్ల మెల్లగా ఆ రాజ్యాలు ఆక్రమించుకున్నారు ముస్లిం నవాబులతో చేతులు కలిపి 1773 నుండి 1776 వరకూ తంజావూరుని ఉమ్మడిగా పాలించారు. తంజావూరు పై నవాబులది పై చేయి కాకుండా ఉమ్మడి రాజ్యంగా మార్చి, బ్రిటీషు వాళ్ళు తిరిగి తుల్జాజీని గద్దెక్కించారు. హిందూ రాజయితే తమ కాలి క్రింద చెప్పులా ఉంటాడనీ, అంతే కాకుండా ప్రజలనుండి ఎటువంటి నిరసనా ఉండదన్నది బ్రిటీషు వాళ్ళ ఎత్తుగడ. ఆ రకంగా తంజావూరు రాజుని తమ చేతుల్లో కీలుబొమ్మగా మార్చుకున్నారు. బ్రిటీషు వాళ్ళు తప్ప వేరెవరైనా తంజావూరు గద్దెనెక్కడం నవాబులకీ అభ్యంతరం లేదు. పేరుకు తుల్జాజీ రాజే కానీ మొత్తం వ్యవహారమంతా అమర సింహుడనే ఓ సైన్యాధికారి చేతుల్లోనే ఉండేది.
తుల్జాజీ మరలా గద్దెనెక్కే ఉదంతమంతా ఎంతో తెలివిగా చక్రం తిప్పి చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధుల్లో ఒకడైన ఫ్రెడరిక్ ష్వార్ట్జ్ అనే క్రైస్తవ మత ప్రచారకుడు. సౌమ్యుడూ, శాంత స్వభావుడు అవడంవల్ల అటు బ్రిటీషు వాళ్ళ మెప్పూ, ఇటు హిందువుల మన్ననలూ అతి సులభంగా పొందాడు. ముస్లిం నవాబుల చేతా మెచ్చుకోబడ్డాడు. ష్వార్ట్జ్ అప్పటి సంఘటనలన్నీ లిఖిత పూర్వకంగా పొందుపరిచి చరిత్రకెక్కించాడు. కాకపోతే అతను రాసిన చరిత్ర తంజావూరు కోట దాటి బయటకు వెళ్ళలేదు. కరువును ఆయుధంగా మార్చుకొని ష్వార్ట్జ్ అనేకమంది మత మార్పిడికి కారకుడయ్యాడు. కరువు ప్రభావం వల్ల మానసిక స్థైర్యాన్ని కోల్పోయిన వాళ్ళని చర్చి వైపు మళ్ళించగలిగాడు.

ఇతనే తుల్జాజీ కొడుకు శరభోజికి ఇంగ్లీషు బోధకుడిగా ఉండేవాడు. తుల్జాజీ 1787 లో ఆనారోగ్యంతో మరణించాడు. వెంటనే అమరసింహుడు తంజావూరు గద్దెనెక్కాడు. ష్వార్ట్జ్ కి అమరసింహుడు రాజవ్వడం సుతరామూ ఇష్టం లేదు. ఎలాగైనా శరభోజిని రాజుని చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఎంత తెలివిగా రాజకీయం నడిపినా కుదర్లేదు. అది ఫలించడానికి సుమారు పదేళ్ళు పట్టింది. శరభోజిని 1798లో రాజుగా దగ్గరుండి గద్దెనెక్కించాడు. కాకపోతే అతని అదృష్టం అంతగా కలిసి రాలేదు. రెండేళ్ళు తిరక్కుండానే ష్వార్ట్జ్ అస్వస్థతతో పోయాడు.
అంతవరకూ ప్రతీ చిన్న విషయానికీ ష్వార్ట్జ్ మీద ఆథారపడ్డ శరభోజి తంజావూరు రాజ్యాన్ని ఈస్ట్ ఇండియా వాళ్ళకి ధారాదత్తం చేసి, తన శేష జీవితం వెళ్ళబుచ్చడానికి పెద్ద మొత్తంలో ధనాన్ని తీసుకున్నాడు. ఇతనికి సాహిత్యమన్నా, సంగీతమన్నా అభిరుచెక్కువ. ప్రప్రంచంలో ఉన్న ప్రతీ చోట నుండీ వందలకొద్దీ పుస్తకాలు సంపాదించాడు. ప్రస్తుతమున్న తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయం ఇతని భిక్షే! కవుల్నీ, కళాకారుల్నీ పోషించాడు. శరభోజీ మహారాజుకే శర్ఫోజీ అనే పేరు కూడా ఉంది. ఈయన పాలరాతి విగ్రహం తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయం లో ఇప్పటికీ చూడచ్చు. ఈ చరిత్ర ప్రకారం చూస్తే త్యాగరాజు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కాలం తెలుస్తుంది. కాకపోతే ఆయన జీవిత చరిత్ర రాసినిద్దరూ సంవత్సరాల చరిత్ర జోలికి పోలేదు. సమయానికి సంబంధించి ప్రస్తావించిన రెండు మూడు విషయాలూ సందేహాస్పదంగానే చెప్పారు.

నిధి చాలా సుఖమా?

[శరభోజి మహారాజు]
శరభోజి మహారాజు

బ్రిటీషు వారి పుణ్యమాని శరభోజి మహారాజుకి పాలనా బాధ్యతలు లేకపోవడంతో ఎప్పుడూ సంగీత సాహిత్యాలతోనే కాలం గడిపేవాడు. ఇతని కాలంలో ఎన్నో నాటకాలూ, యక్షగానాలూ వచ్చాయి. ఆ రోజుల్లో తమని కీర్తిస్తూ రాసే సాహిత్యానికి పెద్ద పీట వేసే వ్యసనమొకటి రాజులకుండేది. శరభోజి మహారాజు ఇందుకేమీ భిన్నం కాదు. శరభోజి గౌరవార్థం “శరభేంద్ర భూపాల కురవంజి” అనే నృత్య రూపకాన్ని శివకొలందు దేశికార్ అనే ఆయన రాసాడు. పల్లవి గోపాలయ్యర్ అనే సంగీత విద్వాంసుడు శరభోజి మహారాజు పై తోడి రాగంలో “కనకాంగి” అనే ఒక వర్ణం రాసి అర్పించాడు.

త్యాగరాజు ప్రతిభ విని, అతని చేత కూడా తనపై కొన్ని కీర్తనలూ, కృతులూ కట్టించుకొనే ఉద్దేశ్యంతో రాజాస్థానానికి ఆహ్వానిస్తూ కబురు పంపాడు. ఇది 1802 సంవత్సరంలో జరిగింది. ఈ సంఘటన జరిగే కాలానికి త్యాగరాజుకి సుమారుగా ముప్పై అయిదేళ్ళు. అప్పటికే త్యాగరాజు అనేక మంది ఆహ్వానం మీద ధనాన్నికానీ, కానుకలు కానీ ఆశించకుండా కచేరీలు ఇచ్చాడు. కానీ, తనపై ఒక కృతి రాసి పాడమని రాజు ఆదేశించడం త్యాగరాజుకి నచ్చలేదు. ఆ సందర్భంలోనే “నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా? నిజముగ పల్కు మనసా” అనే కృతి రాసుండచ్చనీ సాంబమూర్తి రాసారు. మొదట త్యాగరాజు చరిత్ర రాసిన వెంకటరమణ భాగవతార్ కానీ, ఆయన కొడుకు కృష్ణ భాగవతార్ కానీ ఈ కృతి ప్రస్తావనే చేయలేదు. కాకపోతే కృష్ణ భాగవతార్ శరభోజి మహారాజు పేరు ఎత్తకుండా రాజుగా సంబోధిస్తూ ఇదే సంఘటన్ని రాసాడు.

“దమ శమమను గంగా స్నానము సుఖమా?
కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా?
మమత బంధన యుత నర స్తుతి సుఖమా?
సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా?”

మూడో వాక్యంలో నర స్తుతి సుఖమా అని రాయడంతో బహుశా ఈ కృతే చెప్పి ఉండచ్చనీ అనుకోవచ్చు. కాకపోతే ప్రతీ కృతికీ కాలాన్నీ, సందర్భాన్నీ సూచించే లిఖిత పూర్వకమైన చరిత్రయితే ఎక్కడా లేదు.

ఇది జరగడానికి ముందు వేరొక సంఘటన శరభోజికి త్యాగరాజు గొప్పతనం తెలియడానికి దోహదపడింది. ఈ సంఘటన కూడా సాంబమూర్తి గారి రచన ద్వారానే తెలిసింది. ఇది త్యాగరాజు ఇతర శిష్యుల ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చుండచ్చనీ అనుకోవాలి. ఒకసారి శొంఠి వెంకటరమణయ్య ఆహ్వానం మేరకు ఓ సాయంత్రం తంజావూరు దర్బారు హాలులో పాడడానికి వెళ్ళాడు త్యాగరాజు. అదే రోజు రాత్రి శరభోజి రాజు సమక్షంలో కవుల, విద్వాంసుల గోష్ఠుంది. కేవలం తంజావూరు సంస్థాన విద్వాంసులే దానికాహ్వానితులు. ఇక్కడ త్యాగరాజు సంగీత కచేరీ మొదలయ్యాక ఎవరికీ కాలమే తెలీలేదు. కాంభోజి రాగంతో కచేరీ ప్రారంభమయ్యింది. ఇందులో “మరి మరి నిన్నే” అనే కీర్తనలో త్యాగరాజు చేసిన స్వరకల్పన చూసి, అందరూ మంత్ర ముగ్ధులయ్యారు. రెండు గంటల పాటు జరగాల్సిన కచేరీ దాదాపు ఎనిమిది గంటల వరకూ జరిగింది.

త్యాగరాజు సంగీతంలో మునిగి పోయి శరభోజి మహారాజు గోష్ఠి గురించి అందరూ మర్చిపోయారు. ఆ మర్నాడు శరభోజి ఆగ్రహానికి గురి కావల్సొస్తుందని అందరూ భయపడుతూ వెళ్ళారు. అనుకున్నట్టే రాజు క్రితం రాత్రి గోష్ఠి కెవరూ ఎందుకు రాలేదని నిలదీసాడు. అప్పుడే శొంఠి వెంకటరమణయ్య కల్పించుకొని తనే స్వయంగా తన శిష్యుడు త్యాగరాజు కచేరీ ఏర్పాటు చేసాననీ చెప్పాడు. త్యాగరాజు సంగీత కచేరీ విని తీరాల్సిందేనని శరభోజి ముందు వేనోళ్ళా పొగిడాడు. ఈ విధంగా శరభోజి మహారాజుకి త్యాగరాజు గురించి తెలిసింది. ఈ సంఘటన గురించి కేవలం సాంబమూర్తి మాత్రమే రాసారు. దీని తరువాత వచ్చిన త్యాగరాజు జీవిత చరిత్రలన్నీ ఈ సంఘటనని యథేఛ్ఛగా ఉటంకించారు. సాంబమూర్తి ప్రస్తావించిన ఈ సంఘటన జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే శరభోజి మహారాజు త్యాగరాజుకి ఆహ్వానం పంపడం మాత్రం అందరూ రాసారు. సంఘటన వరకూ నమ్మశక్యంగా ఉంది కానీ, సాంబమూర్తి రాసినట్లుగా “మరి మరి నిన్నే” కీర్తనే అక్కడ పాడారన్న ఆధారాలు లేవు.
చీలికలు తెచ్చిన తిరస్కారం

తండ్రి పోయిన తరువాత త్యాగరాజు కుటుంబమూ, తల్లీ, అన్నగారు పంచనదయ్య కుటుంబమూ అందరూ ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంలా ఉండేవారు. పైన చెప్పిన సంఘటన జరిగిన తరువాతే శరభోజి కానుకలిచ్చి సేవకుల్ని త్యాగరాజింటికి పంపాడు. అవి వద్దని అన్నగారి ఎదుటనే తిరస్కరించడంతో అన్నదమ్ములిద్దరి మధ్యా విబేధాలు తారాస్థాయి నందుకున్నాయి. ఇంటికొచ్చిన లక్ష్మిని చేతులారా వెనక్కినెట్టడం సహించలేకపోయాడు పంచనదయ్య. అన్నగారి కోపతాపాలకి చలించలేదు. తల్లికూడా త్యాగరాజునే సమర్థించడంతో, పంచనదయ్య భరించలేకపోయాడు. తను ఈ ఉమ్మడి కుటుంబభారం మోయలేననీ, ఆస్తిని భాగాలు చేయాలనీ మొండికేసాడు. పంచనదయ్య రాత్రికి రాత్రి త్యాగరాజునీ, భార్యనీ, కూతుర్నీ ఇంటినుండి వెళ్ళగొట్టాడు. రాత్రంతా వీధి అరుగు మీద జాగారం చేసాడు త్యాగరాజు. ఆ రాత్రి రాముడూ, సీతా, ఆంజనేయుడు త్యాగరాజు దగ్గరికి వచ్చి, ఆహారం ఇచ్చారనే ఒక కథుంది. అప్పుడే “భవనుత” కృతిని చెప్పినట్లుగా రాసారు. ఇది పురాణికులు అల్లిన కథ. అసలు జరిగింది వేరే ఉంది.

త్యాగరాజు రాత్రంతా వీధరుగు మీద గడిపాడని అతని స్నేహితుడు తంజావూరు రామారావుకి తెలిసింది. తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. తండ్రి ఇచ్చిన రామ పంచాయతనానికి రోజూ పూజ చేస్తానని మాటిచ్చాననీ, అది ఉల్లంఘించడం తనవల్ల కాదనీ త్యాగరాజు రామారావుతో అన్నాడు. రామారావు ఊరి పెద్దల్ని సంప్రదించాడు. పంచనదయ్యకి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. తండ్రి ఆస్తిలో త్యాగరాజుకి హక్కు ఉందని వాదిస్తూ, బయటకు నెట్టే హక్కు పంచనదయ్యకు లేదని పెద్దలచేత పంచాయితీ పెట్టించాడు. అప్పటి వరకూ ఉమ్మడిగా ఉంటున్న ఇల్లుని వాటాలు వేయాలని తీర్మానించాడు. త్యాగరాజు ఈ విషయంలో మౌనంగానే ఉన్నాడు. ఇదంతా రామారావే చూసుకున్నాడు. ఆ రకంగా రామబ్రహ్మానికి తుల్జాజీ కానుకగా ఇచ్చినిల్లు రెండు వాటాలుగా చీలిపోయింది. ఈ తంజావూరు రామారావే కల్పించుకోకపోతే త్యాగరాజు ఉండడానికా ఇల్లు కూడా దక్కేది కాదు. ఈ వాటాలు వేయడం తంజావూరు మేజిస్ట్రేట్ సమక్షంలో జరిగింది. (తిరువయ్యారు తహశీల్దారు రాసిన పత్రాలు తంజావూరు సరస్వతి మహల్ గ్రంథాలయంలో ఉన్నాయని విన్నాను. ప్రత్యక్షంగా చూడలేదు).

ఈ ఉమ్మడి కుటుంబం చీలిపోయిన సందర్భంలోనే “నాదుపై పలికేరు నరులు” అనే కీర్తన రాసినట్లుగా చెబుతారు. త్యాగరాజు కాలంలో తంజావూరు రాజ్య పరిస్థితి ఎంతో దుర్భరంగా ఉండేది. ఒక వైపు ప్రకృతి వైపరీత్యాలూ, మరో వైపు యుద్ధాలూ, ఆక్రమణలూ, ఆకలి చావులూ, దాడులూ, దోపిడీలతో భయంకరంగా ఉండేది. రామభక్తి తత్వంలో ఇవేమీ తనకు పట్టనట్లుగానే త్యాగరాజు కృతులు కూర్చాడు. కానీ ఈ కీర్తనలో మాత్రం తన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు. తన జీవితానికి సంబంధించిన విషయాలని కొన్నిటిని స్పష్టంగా చెప్పాడు. ఆ కీర్తన చరణాలు చూస్తే తెలుస్తందది.

నాదుపై పలికేరు నరులు
వేద సన్నుత, భవము వేరు జేసితిననుచు (నా)

పంచ శర జనక, ప్రపంచమున గల సుఖము
మంచు వలె ననుచు మదినెంచితి గాని
పంచుకొని ధనము లార్జించు కొని సరియెవ్వ
రంచు మరి గతియు లేదంచు పల్కితినా (నా)

దినము నిత్యోత్సవమున కాస జెందితి
నా మనసున ఇల్లు ఒకటియనియుంటి గాని
అనుదినము నొరుల మేలును జూచి తాళ
లేకను రెండు సేయవలె ననుచు పల్కితినా (నా)

ప్రాణమే పాటియని మానమే మేలంటి
గాని శ్రీరామ పరమానంద జలధి
శ్రీనాథ కులములో లేని దారిని పట్టి
జానెడుదరము నింప నొరుల పొగడితినా ( నా)

ఆజానుబాహు యుగ, శ్రీజానకీ పతి,
పయోజాక్ష, శ్రీత్యాగరాజ నుత చరణ,
ఈ జగతిలో నిన్ను పూజించు వారి
నవ్యాజమున బ్రోచు సురాజ, నీవాడైన (నా)

ఇదొక్క కీర్తనే త్యాగరాజు తన లౌకిక జీవితానికి సంబంధించిన సంఘటనపై రాసిందని రూఢిగా చెప్పచ్చు. మిగతా కొన్ని కీర్తనల్లో సూచన ప్రాయంగా ఉంటుంది. ఇందులో మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ ఇల్లు వాటాల విషయం త్యాగరాజు జీవిత చరిత్ర రాసినందరూ ప్రస్తావించారు. ఇది జరిగిన కాలం విషయంలోనే తేడాలు కనిపించాయి. శరభోజి కానుకలు తిరస్కరించిన ఘట్టం 1802 ప్రాంతంలో జరిగిందని సాంబమూర్తి చెప్పారు. చరిత్ర తేదీలని బట్టి చూస్తే ఇది సరి అయినదే అని చెప్పచ్చు. ఈ ఇల్లు వాటా వేసిన సమయం మాత్రం సరిగ్గా చెప్పలేదు. తల్లి సీతమ్మ మరణానంతరమే జరిగిందని రాసారు. కానీ సీతమ్మ 1804 లో పోయింది. అంటే రెండేళ్ళ వరకూ త్యాగరాజూ, పంచనదయ్య కలిసే ఉన్నారా? అయితే తంజావూరు మేజిస్ట్రేట్ ముందు జరిగిన పంచాయితీ 1802 లోనే జరిగిందని రాసారు కదా? కాబట్టి 1802లోనే ఇల్లు వాటాలు జరిగుండాలి.

[త్యాగరాజు నివసించిన ఇల్లు]
త్యాగరాజు నివసించిన ఇల్లు

కాకపోతే మరి కొంతమంది ఈ సంఘటన రామబ్రహ్మం పోయిన వెంటనే జరిగిందని రాసారు. అందరికంటే విరుద్ధంగా విలియం జాక్సన్ రాసిన పుస్తకంలో కనిపించింది. “త్యాగరాజు ఇరవయ్యో ఏట తండ్రి రామబ్రహ్మం మరణించినప్పుడు వారుండే ఇల్లుని రెండుగా వాటాలు వేసారు. తనకి కేటాయించిన వాటాలోనే రామ భక్తి పారవశ్యంతో త్యాగరాజు జీవితాన్ని గడిపాడు” అంటూ రాసారు (Tyagaraja: Life & Lyrics, page 4). పైన చూపించిన సంవత్సరాల వివరాలు చూస్తే ఇది ఖచ్చితంగా సరైనది కాదని చెప్పగలం. జాక్సన్ ఇలా రాయడానికి ఆధారాలేమిటో తెలీదు. ఇప్పటికీ తిరువయ్యార్ లో తిరుమంజన వీధిలో త్యాగరాజు నివసించిన ఇల్లుంది. ప్రస్తుతం దాన్ని ఒక చారిత్రాత్మక నివాసంగా మార్చడానికి కొంతమంది సంగీత ప్రియులు ప్రయత్నిస్తున్నారు.
ఉంఛవృత్తి

పంచనదయ్య తిరువయ్యార్ మేజిస్ట్రేట్ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసేవాడు. త్యాగరాజు ఎక్కడా ఉద్యోగం చేసినట్లుగా లేదు. అతనికీ త్యాగరాజుకీ వయసు బేధం ఎక్కువే. మధ్యలో చిన్నతనంలోనే పోయిన ఒక అన్న పంచాపకేశ బ్రహ్మం ఉన్నాడు. పంచాపకేశ బ్రహ్మానికీ త్యాగరాజుకీ వయసు అంతరం తక్కువ కావడంతో త్యాగరాజుకి ఈ అన్నతో చాలా చనువెక్కువ. త్యాగరాజు తన మనవడికి అదే పేరు పెట్టాడు. తండ్రిపోయిన మూడేళ్ళకి త్యాగరాజు మొదటి భార్య పార్వతి అనారోగ్యంతో హఠాత్తుగా మరణించింది. ఇంతకుమించి ఈమె గురించి వివరాలు ఎవరూ చెప్పలేదు. మొదటి భార్యతో త్యాగరాజుకి పిల్లలు లేరు. ఆ తరువాత కమలాంబతో త్యాగరాజుకి రెండో వివాహం జరిగింది.

త్యాగరాజుతో పెళ్ళైన ఏడాదికి అంటే త్యాగరాజు 27వ ఏట (1894 లో) కమలాంబకి ఒక కూతురు జన్మించింది. ఆ అమ్మాయికి సీతాలక్ష్మి అని పేరు పెట్టారు. వేరుపడ్డాక త్యాగరాజు రోజు వారీ జీవితం గడపడానికి కష్టమయ్యింది. ఆ సమయంలో అతని స్నేహితుడు తంజావూరు రామారావే అతన్ని ఆదుకున్నాడు. ధన సహాయమంటూ ప్రత్యేకించి చేయకపోయినా త్యాగరాజు కుటుంబం గడవడానికొక ఆధారం చూపించాడు. తెలుసున్న వాళ్ళింట్లో త్యాగరాజు కచేరీ ఏర్పాటు చేసేవాడు. అదైన తరువాత వారికి తోచిన ఆహార సంబంధిత వస్తువులు తీసుకునే వారు. అదీ వారానికి సరిపడా మాత్రమే ఇమ్మనమని చెప్పేవారు. ధనరూపేణా కానీ, వస్తురూపేణా కానీ త్యాగరాజు ఎప్పుడూ ఎవరి వద్దా తీసుకోలేదు. పూర్వం హరిదాసుల ఇళ్ళల్లో “ఉంఛవృత్తి” అనే ఒక సంప్రదాయం ఉండేది. అది ఏమిటంటే - ప్రతీ రోజూ అపరాహ్నవేళ హరిదాసులు హరినామ సంకీర్తనతో వీధుల గుండా వస్తారు. ఎవర్నీ బిచ్చం అడగరు. ఎవరకు తోచిన ఆహార వస్తువులు వారు హరిదాసుల వద్దకు పోయి ఇవ్వాలి. ఆ రోజుకి సరిపడా మాత్రమే హరిదాసులు స్వీకరించాలి. మొదట్లో త్యాగరాజు ఎవరి వద్దా ధన సహాయం, ముఖ్యంగా తన సంగీతం ద్వారా సంపాదించడం ఇష్టం లేకపోతే, ఈ ఉంఛవృత్తి సారాన్ని చెప్పి త్యాగరాజుని రామారావే సమాధానపరిచాడు. ఈ వృత్తిని స్వీకరించడానికి త్యాగరాజుకి కొంతకాలం పట్టింది. “ఎన్నాళ్ళు తిరిగేది యెన్నాళ్ళు” కీర్తన ఈ ఉంఛవృత్తి పై రాసిందే!
తంజావూరు రామారావు

తిరువయ్యారు చేరిన కొత్తల్లో దాదాపు మూడేళ్ళు పైగా త్యాగరాజు అక్కడి సంస్కృత పాఠశాలలో విద్య నభ్యసించాడు. ఆ సంస్కృత విద్యాలయంలో త్యాగరాజుకొక మిత్రుడు దొరికాడు. వారిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. అతనే తంజావూరు రామారావు. అసలు పేరు తంగిరాల ఎస్. రామారావు. తెలుగువాడు. అందరూ తంజావూరు ఎస్. రామారావు అని పిలిచేవారు. ఇతను త్యాగరాజు కంటే వయసులో రెండేళ్ళు చిన్న. ఈ రామారావు మృదంగం నేర్చుకున్నాడు. ఇద్దరికీ సంగీతమే స్నేహాన్ని కలిపింది. అలా కలిసిన ఈ ఇద్దరి స్నేహమూ, త్యాగరాజు సమాధి చెందే వరకూ ఉంది. సొంత కుటుంబీకుల తరువాత త్యాగరాజుకి అత్యంత సన్నిహితుడు ఈ రామారావే!

త్యాగరాజు వద్ద ఈ రామారావు సంగీతం నేర్చుకునేవాడు. ఇతనే త్యాగరాజుకి ప్రథమ శిష్యుడని చెప్పచ్చు. ఇతను త్యాగరాజుకు అనుంగు శిష్యుడే కాడు, మిత్రుడు కూడా. ఇతనే త్యాగరాజుకి ప్రతీ చోటా కచేరీ ఏర్పాట్లు చూసేవాడు. రామనామ సంకీర్తన పేరుతో కొంతమంది ఇళ్ళల్లో సంగీత కచేరీలు పెట్టించాడు. ఆ కచేరీల్లో కూడా ఏయే కీర్తనలు పాడాలో ఇతనే ముందుగా చెప్పేవాడని అందరూ రాసారు. ఇతని ప్రోద్బలం వల్లే ఘనరాగ పంచరత్న కీర్తనలు త్యాగరాజు రచించాడని సాంబమూర్తి ది గ్రేట్ కంపోజర్స్ పుస్తకంలో రాసారు.
శిష్య పరంపర

త్యాగరాజు తన వద్ద వచ్చిన వారికి కాదనకుండా సంగీతం నేర్పాడు. గురుకుల వ్యవస్థలా తన వద్దే ఉండి నేర్చుకోవాలని నియమం పెట్టాడు. అంటే త్యాగరాజు ఇంట్లోనే వాళ్ళు కొంత కాలం, ఒకటో, రెండో ఏళ్ళుంటేనే సంగీతం నేర్పడానికి ఒప్పుకునేవాడు. శిష్యులందరికీ ఉచిత భోజనం వసతీ ఇచ్చాడు. దీనికి సిద్ధపడి ఒప్పుకున్న వారందరికీ వారి వారి స్థాయిని బట్టి సంగీతం నేర్పాడు.

సంగీతానికీ సాహిత్యానికీ ఎంతో అవినాభావ సంబంధం ఉందని త్యాగరాజు విశ్వసించేవాడు. భావావేశంతో పాడితేనే ఏ కృతైనా రక్తి కడుతుంది. అది కలగాలంటే భాష క్షుణ్ణంగా రావాలి. సాహిత్యం అర్థం కాకపోతే ఆత్మానందం కలగదు. ఆత్మానందం కలగకపోతే తాదాత్మ్యం రాదు. అది లేకపోతే సంగీతం రాణించదు. కాబట్టి సాహిత్యం అర్థంకాని సంగీతానికి విలువ లేదు. ఇదీ త్యాగరాజు నమ్మిన సిద్ధాంతం కాబట్టి త్యాగరాజు స్వరపరిచిన కృతులు నేర్చుకోవాలంటే ముందుగా తెలుగు భాష రావాలి. కానీ త్యాగరాజు వద్దకొచ్చిన చాలామంది శిష్యులకి తెలుగు రాదు. తెలుగు రాని శిష్యులకి ప్రతీ రోజూ రామారావు తెలుగు నేర్పేవాడని అంటారు. ఇదే విషయాన్ని వీణ కుప్పయ్యర్ అనే శిష్యుడు రాసినట్లుగా చెబుతారు (ఈ ప్రతి ఎంత కష్టపడినా లభించలేదు).

త్యాగరాజు శిష్యుల్లో ఒక ప్రముఖుడు వీణ కుప్పయ్యర్. సంగీతం విషయంలో ఇతనికి విశేష ప్రతిభుందనీ అందరూ అనుకునేవారు. త్యాగరాజు కూడా ఇతనికి ప్రత్యేకమైన శ్రద్ధతో, సంగీతంలో ఎన్నో లోతైన విషయాలు చెప్పాడని అతను రాసుకున్నాడు. ఈ వీణ కుప్పయ్యర్ తమిళ బ్రాహ్మణుడు. సంస్కృతమూ, తమిళమూ తప్ప తెలుగు రాదు. త్యాగరాజు వద్ద శిష్యరికం మొదలు పెట్టిన తరువాత ఈయన తెలుగు కూడా నేర్చుకున్నాడు. ఈ వీణ కుప్పయ్యర్ ఎన్నో కృతులూ, వర్ణాలూ తెలుగులోనే రచించాడు. ఇతను త్యాగరాజు వద్ద సుమారు అయిదేళ్ళు పైగా సంగీతం నేర్చుకున్నాడని సాంబమూర్తి రాసారు (ది గ్రేట్ కంపోజర్స్ 193 - 197 పేజీలు)

సంగీత శిక్షణలో సాధారణంగా గీతమైనా, వర్ణమైనా, కృతైనా స్వరాలతో నేర్పుతారు. స్వర స్థానాలు చక్కగా వచ్చిన తరువాతే సాహిత్యంతో నేర్పేవారు. త్యాగరాజు ఈ పద్ధతికి భిన్నంగా ఏ కృతైనా సాహిత్యంతో నేర్పి, అది భావయుక్తంగా పాడుతున్నారనిపిస్తేనే స్వరాలతో చెప్పేవాడు. అందుకే కొన్ని త్యాగరాజ కీర్తనలకి స్వరాలు దొరకలేదని అంటారు. దాదాపు 800 పైగా కీర్తనలు ఇప్పుడు మనకి ఉన్నాయి. వేలకొద్దీ రచించాడనీ, స్వరాలు తెలియక పోవడవల్ల కొన్ని అందుబాటులోకి రాలేదని కొందరు సంగీతజ్ఞుల అభిప్రాయం. కాబట్టి త్యాగరాజు అవలంబించిన పద్ధతి చూస్తే ఖచ్చితంగా సాహిత్యమర్థమవ్వాలి. అందుకే తెలుగు రాని వారికి తెలుగు నేర్పి మరీ సంగీతం నేర్పాడు. ఈ విషయాన్ని ది గ్రేట్ కంపోజర్స్ లో సాంబమూర్తీ, వాగ్గేయకారుల చరిత్రలో టి. పార్థసారథి ప్రస్తావించారు.

త్యాగరాజు వద్దకి ఎంతో మంది కేవలం సంగీతం నేర్చుకోవడానికే కాదు, కొంతమంది జ్యోతిశ్శాస్త్రం నేర్చుకోడానికీ, మరి కొంతమంది తెలుగు భాష నేర్చుకోడానికీ వచ్చే వారని ది గ్రేట్ కంపోజర్స్ లో రాసారు. ఈ తంజావూరు రామారావే తెలుగు చెప్పినట్లుగా వెంకటరమణ భాగవతార్ (త్యాగరాజు జీవిత చరిత్ర ఈయన, తంజావూరు రామారావు కలిసి రాసారు) గారి మనవడు రాసిన జీవిత చరిత్ర పుస్తకంలో ఈ విషయం ఉంది. ఇవన్నీ క్రోడీకరించి పై విధంగా జరిగుండచ్చనీ భావించి, ఈ నిర్థారణకు రావడం జరిగింది. ఏదైతేనే త్యాగరాజు ధర్మమాని తమిళ నాటా, నోటా తెలుగు పదం సుందరంగా నిలిచింది. త్యాగరాజు వద్ద సంగీత శిష్యరికం చేసిన వాళ్ళల్లో ఇద్దరు మాత్రమే తెలుగు వాళ్ళు. వారిద్దరిలో ఒకరు ఈ తంజావూరు రామారావు. మరొకరు మనంబుచవాది వెంకట సుబ్బయ్యర్. మిగతా అందరూ తమిళులే!

[సరస్వతీ మహల్ గ్రంథాలయం]
సరస్వతీ మహల్ గ్రంథాలయం

మరొక శిష్యుడైన వెంకటరమణ భాగవతారు దాదాపు ముఫ్ఫై ఏళ్ళు త్యాగరాజుతో గడిపాడు. ఇతనూ, రామారావూ త్యాగరాజు రాసిన కృతులన్నీ పొందుపరిచారు. కలసి జీవిత చరిత్ర రాయడానికి పూనుకున్నారు. వీరిద్దరి కృషివల్లే ఈ త్యాగరాజ కృతులు ముందుతరాలకి లభ్యమయ్యాయి. చాలా కాలం త్యాగరాజుతో గడపడం వల్ల వీరిద్దరికీ చాలా కృతులు తెలిసే అవకాశం ఉంది. చివర్లో ఈ వెంకటరమణ భాగవతార్ కూడా మద్రాసు వెళ్ళిపోయాడు. ఇతను త్యాగరాజు పేరు ప్రఖ్యాతులు విని సంగీతం మీద అభిలాషతో తిరువయ్యార్ వచ్చాడు. అలాగే వీణా కుప్పయ్యర్ కూడా త్యాగరాజ కృతులెన్నో తాళపత్రాలకెక్కించాడు. ఇవన్నీ మదురై సౌరాష్ట్రసభలో ఉన్నాయి. కొన్ని తంజావూరు సరస్వతీ మహల్ గ్రంధాలయంలో ఉన్నాయి.
యక్షగానాలు

త్యాగరాజు తన సంగీతాన్ని కేవలం కృతిరచనకే పరిమితం చెయ్యలేదు. త్యాగరాజుకి అత్యంత ప్రీతిపాత్రమైన నృత్యనాటికలు కూడా రాసాడు. ఈ నృత్యనాటికలకి మూలం, అప్పట్లో బహుళ ప్రచారంలో ఉన్న యక్షగానాలు. ఎన్నో యక్షగాన బృందాలు ఊరూరా తిరుగుతూ తరచు ప్రదర్శనలిచ్చేవారు. బహుశా త్యాగరాజు ఈ యక్షగానాలు చూసి ఆకర్షితుడయ్యుండచ్చు. అందుకే కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని యక్షగాన ప్రక్రియలో మిళితం చేసి మూడు నృత్య నాటికలు రాసాడు. అవి నౌకా చరిత్రం, ప్రహ్లాద భక్తి విజయం, సీతారామ విజయం. మొదటి రెండిటి ప్రతులూ ఇప్పుడు లభ్యమవుతున్నాయి. మూడోది దొరకలేదు. కానీ సీతారామ విజయం ఖచ్చితంగా రాసాడని సంగీత శాస్త్రజ్ఞలు విశ్వసిస్తారు. కాంభోజి రాగంలో “మా జానకీ చెట్టబట్టగా” అనే ప్రసిద్ధమైన కృతి ఈ సీతారామ విజయం లోనిదే అంటారు. అలాగే కేదార గౌళ రాగంలోని “వనజ నయనుడని వలచితివో” అనే కృతి కూడ ఇందులోదే అంటారు. ఈ కీర్తనలున్నాయి కానీ, ఈ నృత్య నాటిక ప్రతి మాత్రం లేదు. లోకనారాయణ శాస్త్రుల్లు అనే వ్యక్తి 1868 లో ఈ సీతారామ విజయాన్ని మొదటి సారి ప్రచురించారు. దురదృష్టవశాత్తూ ఒక్క ప్రతి కూడా ఇప్పుడు లేదు. ఈ సీతారామ విజయమే త్యాగరాజు రాసిన మొట్ట మొదటి నృత్య నాటికని అంటారు. కాదు, నౌకాచరిత్రమే మొదటి నృత్య నాటికని మరికొందరంటారు. ఏ కాలంలో ఏది రాసిందీ తెలీదు.

[నౌకాచరిత్రం]
నౌకాచరిత్రం

నౌకాచరిత్రమే ముందు రాసిఉండే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇది త్యాగరాజు రెండో వివాహం అయిన కొత్తల్లో రాసాడు. దాదాపు కృతులన్నీ భక్తి తత్వం మీదుగానే ఉన్నా కొన్ని చోట్ల శృంగారరసం మిళితమై కొన్ని కీర్తనలున్నాయి. ఏ కవీ తన వయసునీ, కాలాన్నీ దాటి పోలేడు. ఈ నిర్ధారణలు ఊహాజనితాలే - వీటికి ఆధారాల్లేవు. ఈ నౌకాచరిత్రం తాళపత్ర గ్రంధం తంజావూరు సరస్వతీ మహల్ గ్రంధాలయంలో ఉంది. ఈ ప్రతి తమిళలిపిలో ఉంటుంది. ఈ నౌకా చరిత్రాన్ని 1939 లో సాంబమూర్తి ప్రచురించారు. ఆయనకి దీని ప్రతి కృష్ణస్వామి భాగవతార్ (త్యాగరాజు శిష్యుడు) కొడుకు కె.కె. రామస్వామి భాగవతార్ ద్వారా లభించింది. వీళ్ళందర్నీ వాలాజపేట శిష్యులంటారు. ప్రతీఏటా వైకుంఠ ఏకాదశి నాడూ ఈ వాలాజపేట శిష్యులు నౌకా చరిత్రం పాడేవారని సాంబమూర్తి రాసారు.

దీనిలో కథ పూర్తిగా త్యాగరాజు కల్పన. శ్రీకృస్ణుడు గోపికల మధ్యన నౌకావిహారం అనే కొత్త సన్నివేశాన్ని కల్పించాడు. గోపికలతో కలసి యమునా నదిలో నౌకా విహారయాత్ర కెళితే గాలివానలో చిక్కుకున్న గోపికల్ని రక్షించే దైవంగా కృష్ణుణ్ణి చిత్రీకరిస్తూ - శృంగారాన్నీ, భక్తినీ, తత్వాన్నీ చూపించాడు. గోపికలు యమునా నదిలో నౌకా విహారానికి వెళదామని సిద్ధమవుతారు. వారితో బాలకృష్ణుని వెంట తీసుకెళ్ళాలా, వద్దా అని సంశయిస్తారు. బాలుణ్ణని శంకించ వద్దని చెబుతూ, కాళింది మడుగులో కాళీయుని మదమడచి గోపబాలుర్ని రక్షించలేదా అంటూ, కృష్ణుడు వాళ్ళని సమాధానపరిచి వారితో బయలదేరుతాడు. ఆనందంగా సాగే నౌకాక్రీడ మధ్యలో గాలివాన వస్తుంది. ఇంతలోనే ఓడకు చిన్న కంత ఏర్పడి నీరు వచ్చే ప్రమాదముందని కృష్ణుడు హెచ్చరిస్తాడు. గోపికలు వినరు. ఆ కంత కాస్తా పెద్దదయ్యి నౌక మునిగిపోయే పరిస్థితి వస్తుంది. చివరకి అందరూ చిన్నవాడైనా కృష్ణుణ్ణి ఆశ్రయిస్తారు. వారి భక్తికి మెచ్చి కృష్ణుడు నౌకను ఒడ్డుకు చేరుస్తాడు. నౌకా విహారం శుభప్రదంగా ముగుస్తుంది. స్థూలంగా ఇదీ కథ.

ఈ నృత్య నాటిక త్యాగరాజు అపారమైన ప్రతిభని చూపిస్తుంది. ఇందులో సుమారు 27 రాగాలు వాడారు. మొత్తం అయిదు అంకాలుగా ఈ నృత్య నాటిక నడుస్తుంది. ప్రసిద్ధి చెందిన “ఓడను జరిపే ముచ్చట కనరే”, “ఎవరు మనకు సమానమిలలో”, “ఏ నోము నోచితిమో”, “గంధము పూయరుగా” వంటి కీర్తనలు ఈ నౌకా చరిత్రం లోవే! ఇందులో వాడిన రాగాలూ, కీర్తనలూ అతి రమ్యంగా ఉంటాయి. ఈ నౌకా చరిత్రా రచనలో ఓ విశేషం ఉంది. ఇందులో కీర్తనలు నృత్య నాటికలో భాగంగా మాత్రమే కాదు విడిగా పాడినా కూడా ఏ కృతికాకృతి అర్థాన్నిస్తాయి. ఒక్కొక్కటీ వాటి సాహిత్యమ్మీదా, రాగమ్మీదా నిలబడతాయి. ఉదాహరణకి “గంధము పూయరుగా” కీర్తన విడిగా పాడుకోడానిక్కూడా చక్కగా ఉంటుంది. ఈ నాటికలో ఇంకో విశేషం కూడా ఉంది. మొదటి కీర్తన సురటి రాగంలో ఉంటుంది, చివర మంగళం కూడా ఇదే రాగంలో ఉంటుంది.

ప్రహ్లాద భక్తి విజయం నృత్య నాటిక కూడా గొప్ప సృజనతో రాసిందే! అందులో త్యాగరాజు కొన్ని ప్రయోగాలు చేసాడు. అందులో ఒకటి, అప్పట్లో నాటకాల్లోనైనా, నృత్య నాటికల్లోనైనా మంగళం ఖచ్చితంగా ఘంట, సురటి లేదా పంతువరాళి రాగాల్లోనే ఉండేది. ఇందులో మంగళం సౌరాష్ట్ర రాగంలో ఉంటుంది. ఇందులో వాడిన భాష శిష్టవ్యవహారికం. ఇందులో వాడే ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో దరువులూ, కందపద్యాలూ, సీసపద్యాలూ, ఇతర ఛందో పద్యాలూ, త్యాగరాజు తెలుగు సాహిత్య జ్ఞానానికి అద్దం పడతాయి. ఉదాహరణకి ప్రహ్లాద భక్తి విజయంలో ఈ కంద పద్యమూ, సీస పద్యమూ చూస్తే, త్యాగరాజుకి తెలుగు చందస్సుపై పట్టు తెలుస్తుంది.

కం: శ్రీ జానకీ మనోహర
రాజీవ భవాది సంధ్య రఘుకుల తిలకా
రాజీవ నయన మునిజన
పూజిత పద రామచంద్ర పుణ్యము చరితా

సీస పద్యం:
స్థితి లయోధృవముల శ్రీహరి వేడ్కగా
గావించి చూచితా గాసి దీర
నీ యందు బవళించి నిర్మలాత్ముడు యోగ
నిద్ర సల్పెను కదా నిత్యముగను

నృత్యనాటికలు ప్రదర్శించారో లేదో ఎక్కడా వివరాలు దొరకలేదు. ప్రదర్శించి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆనందభైరవి రాగం గురించి ప్రచారంలో ఉన్న ఒక కథలో ఆయన నృత్యనాటికలు ప్రదర్శించిన ప్రస్తావన ఉంది. ఎందుకంటే ఆనందభైరవి రాగంలో త్యాగరాజు కేవలం మూడంటే మూడు కీర్తనలు రాసాడు. నృత్యనాటికలకీ, యక్షగానాలకీ ఆనందభైరవి రాగం ప్రాణం. అలాంటిది కేవలం మూడు కీర్తనలతో సరిపెట్టుకున్నాడా త్యాగరాజనిపిస్తుంది. ఉన్న కృతుల సంఖ్య 800 పైగా ఉంది. ప్రతీ రాగంలో కనీసం అయిదారు కృతులైనా ఉన్నాయి. ఒక్క ఆనందభైరవి రాగం తప్ప. దీనికి సంబంధించిన ఓ చిన్న కథ కూడా ఉంది.
త్యాగానంద భైరవి

దక్షిణాదిన కుంభకోణం దగ్గర్లో తిరిభువనం అనే వూళ్ళో స్వామినాధ అయ్యర్ అనే అర్చకుడొకాయనుండే వాడు. ఆయన సంగీత విద్వాసుండు. మంచి నటుడు కూడా. ఆనంద భైరవి రాగంలో మంచి పట్టుందాయనకి. ఓసారి తిరిభువనం స్వామినాధ అయ్యర్ బృందం ఓ యక్షగాన ప్రదర్శన నిమిత్తమై తిరువయ్యార్ వచ్చారు. ప్రతీ రాత్రీ వీళ్ళు యక్షగానం చేసేవారు. జనాలు తండోపతండాలుగా విచ్చేసారు. ఆనోటా ఈనోటా ఈ యక్షగానం సంగతి త్యాగరాజు శిష్యులకి తెలిసింది. ఓ రాత్రి ప్రదర్శన కెళ్ళారు. అందులో ఆనందభైరవి రాగంలో స్వరపరిచిన ఓ పాట (“మధురానగరిలో చల్లలమ్మబోదు” పాట అని అంటారు. ఎంతరకూ ఇది నిజమో ధృవీకరించడం కష్టం) వారినత్తుకుంది. శిష్యుల ద్వారా తిరిభువనం స్వామినాధ అయ్యర్ గురించి త్యాగరాజుకి తెలిసింది. స్వతహాగా నృత్యనాటికలంటే ప్రియం కనుక ఆ యక్షగానం చూడాలనీ, ఆ అనందభైరవి రాగంలో పాట వినాలనీ కుతూహలం కలిగింది త్యాగరాజుకి. ఆ రోజు రాత్రి ప్రదర్శనకి శిష్యులతో బయల్దేరాడు. యక్షగానం జరుగుతోంది. నిజంగా ఆనంద భైరవి రాగంలో పాట విని మంత్రముగ్ధుడయ్యాడు. నాటకం ముగిసాక సంతోషం పట్ట లేక వేదిక వైపుగా వెళ్ళాడు. తోటి సంగీత విద్వాంసుణ్ణి మెచ్చుకొని ఆనందభైరవి రాగం ఇంత గొప్పగా పాడిన స్వామినాధ అయ్యర్ ని సభాముఖంగా అభినందించాడు. త్యాగరాజు మెచ్చుకోవడం అంటే సామాన్యమైన విషయంకాదు. ఆ స్వామినాధ అయ్యర్ ఆనందం పట్టలేకపోయాడు.

త్యాగరాజు వంటి విద్వాంసుడు తనలాంటి వీధి నాటకాలు వేసుకొనే కళాకారుణ్ణి ప్రశంసించడం తన అదృష్టమని చెబుతూ త్యాగరాజుని ఒక వరమడిగాడు. “అయ్యా, మీరు సంగీతంలో మహా విద్వాంసులు. మీ నృత్యనాటిక చూసేకే ఈ అనందభైరవి రాగాన్ని ఈ యక్షగానంలో ఉపయోగించాను. మీవంటి వారు నన్ను ప్రశంసించడం నా అదృష్టం. మీరు నా ప్రదర్శన చూసారనీ, మీరు ఆనందభైరవి రాగం పాటని మెచ్చుకున్నారనీ తరతరాలుగా తెలియాలి. అలా జరగాలంటే మీరు ఆనందభైరవి రాగాన్ని నాకు దానమిచ్చేయండి. కేవలం ఈ ఆనందభైరవి రాగంలో మీరు ఒక్క కీర్తనా కట్టకపోతే సంగీత ప్రియులు అడుగుతారు. అప్పుడు నా యక్షగానం సంగతి తెలుస్తుంది. ఆ రకంగా నేనూ చరిత్రలో మిగిలిపోతాను. దయచేసి ఈ ఒక్క ఆనందభైరవి రాగాన్నీ నాకొదిలేయండని” అడిగాడు. త్యాగరాజు సరే అన్నాడు. అప్పటికే మూడు కృతులు ఆనందభైరవి రాగంలో కట్టాడు. ఆ తరువాత త్యాగరాజు అనందభైరవి జోలికి పోలేదు. “రామ రామ నీ వారము” అనే దివ్యనామ కీర్తనా, “క్షీర సాగర విహార” అనే ఉత్సవ సంప్రదాయ కీర్తనా, “నీకే తెలియక” అనే కృతీ తప్ప ఆనందభైరవిలో త్యాగరాజు రాసిన వేరే కృతుల్లేవు. ఇవి కూడా శిష్యుల ద్వారానే అందరికీ అందుబాటులోకొచ్చాయి. బహుళ ప్రాచుర్యం పొందిన ఈ కథ సాంబమూర్తి ది గ్రేట్ కంపోజర్స్ ( page 164 -166 ) లో ఉంది.
బహు భాషా కోవిదుడు

త్యాగరాజు బహుభాషావేత్త. కేవలం తెలుగు లోనే కాదు. సంస్కృతం, తమిళ, కన్నడ, హిందీ మరియు మరాఠీ భాషల్లో ప్రావీణ్యముందని చెప్పే చాలా సంఘటనలున్నాయి. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆయన శిష్యులు చాలామంది తమిళులే! గోపాలకృష్ణ భారతి, మహారాజ స్వాతి తిరునాళ్ దూత, వడివేలు వచ్చినప్పుడూ తమిళం మాట్లాడినట్లుగా వారి వారి జీవిత చరిత్రల్లో రాసారు. కాశీ నుండి గోపీనాధ భట్టాచార్య అనే ఆయన త్యాగరాజుని అంత్య దశలో సందర్శించినప్పుడు, ఆయనతో హిందీలో మాట్లాడినట్లుగా ఆధారాలున్నాయి. అలాగే శరభోజి రాజు అల్లుడు మోతీరావుతో మరాఠీ సాహిత్య చర్చల్లో పాల్గొన్నట్లుగా రాసారు. ఇవన్నీ చూస్తే, త్యాగరాజుకి మిగతా భాషల్లోవున్న ప్రావీణ్యం తెలుస్తుంది. ఎన్ని భాషలొచ్చినా మాతృ భాష తెలుగుని మాత్రం ఆయన వదల్లేదు. అందులోనే సంగీతాన్ని నింపాడు. అందులోనే జీవించాడు. అందుకే త్యాగరాజు తెలుగువాడుగా పుట్టినందుకు తెలుగువారందరూ గర్వపడాలి.

తిరుమల నాటి చిత్రం

తిరుమల ప్రయాణం

తిరుమల విశేషాలు

తిరుమల స్వామి వారికి తీరొక్క ఆభరణం