తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ “తెలుగు వెలుగు "ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం..! " తెలుగు " ను కొత్త " వెలుగు " లో ప్రపంచానికి చూపిద్దాం!

Saturday, October 20, 2012

తెలుగు భాష ఎప్పుడు పుట్టింది?

మొట్టమొదటి తెలుగు శాసనాలు :

తెలుగు మాట కనిపించే మొట్ట మొదటి శాసనం క్రీస్తు శకం 200కి చెందినది. బ్రహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనం గుంటూరు‌ జిల్లా అమరావతిలో దొరికింది. అంతకు పూర్వం అశోకుడు, బౌద్ధ మత ప్రచారానికి తన దూతలను ఆంధ్రదేశానికి పంపినట్లు అశోకుడి కాలం నాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. పూర్తిగా తెలుగు భాషలో రాసిన శాసనాలు మనకు క్రీస్తు శకం ఆరవ శతాబ్దినుండి దొరుకుతున్నాయి. వీటిలో కడప జిల్లా ఎర్రగుడిపాడు (క్రీశ 575-600), కలమళ్ళ (క్రీశ 576-600) లో దొరికిన శాసనాలు మొట్ట మొదటివి. ఆరో శతాబ్దికి ముందు ఆంధ్ర ప్రాంతంలో శాసనాలు సంస్కృత ప్రాకృత భాషలలో వేసేవారు కానీ వాటిలో ఉన్న ఊళ్ళ పేర్లు, మనుష్యుల పేర్లు తెలుగువే. ఈ శాసనాలలో ఉన్న ఏళూరు, తాన్ఱికొన్ఱ (తాటికొండ) మొదలైన ఊళ్ళ పేర్లు ఆ రోజులలో సామాన్య ప్రజలు తెలుగే మాట్లాడే వారని నిరూపిస్తుంది.

ప్రాచీన కావ్యాలలో ఆంధ్ర/తెలుగు ప్రస్తావన :

రామాయణంలో సుగ్రీవుడు సీతాదేవి ఉనికిని గూర్చి వెతుకవలసిన స్థలాలను పేర్కొనే సందర్భంలో వరుసగా దండకారణ్యం, గోదావరీ నది, తరువాత, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య దేశాలున్నట్టు చెప్పాడు. ధర్మరాజు రాజసూయం చేసే ముందు దక్షిణ దిగ్విజయ యాత్రకు సహదేవుని పంపినట్లు అతడు పాండ్యులు, ద్రవిడులతో పాటు ఆంధ్రులను, కళింగులను, ఓఢ్రులను జయించినట్లు భారతంలో ఉంది. బౌద్ధ సారస్వతంలో చోళరఠ్ఠం, కళింగరఠ్ఠం, ద్రమిళరఠ్ఠం తో పాటు గోదావరినదికి ఇరు వైపుల అళక, ముళక దేశాలున్నట్లు, ఇవి రెండు అంధక రాష్ట్రాలని “సుత్తనిపాత” గ్రంథంలో ఉంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో మన దేశానికి వచ్చిన గ్రీక్‌ రాయబారి మెగస్తనీస్‌ మౌర్యుల తరువాత ఎన్నదగిన జాతి ఆంధ్ర జాతియని, వారి రాజు మిక్కిలి బలవంతుడని అతనికి 32కోటలున్నాయని పేర్కొన్నాడు.

ఆంధ్ర జాతి ప్రస్తావన మొట్టమొదటి సారి క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి చెందిన భరతుని నాట్యశాస్త్రంలో కూడా ఆంధ్ర భాషా ప్రస్తావన మనకు కనిపిస్తుంది. నాటకాలలో సంస్కృత ప్రాకృతాలే కాక సామాన్య ప్రజలు మాట్లాడే భాషలను వాడవచ్చని చెబుతూ, శకార, ఆభీర, చండాల, శబర, ద్రమిళ, ఆంధ్ర జాతుల భాషలను కూడా వాడవచ్చని ఇందులో ఉంది. ఐతే ఆంధ్ర రాజులు, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర జాతి అన్న పదాలలో ఆంధ్ర శబ్దం తెలుగుకు పర్యాయపదంగా తీసుకుంటే క్రీస్తు పూర్వం 7వ శతాబ్దికి ముందుగానే ఆంధ్ర/తెలుగు ప్రత్యేక జాతిగా గుర్తింపబడిందని చెప్పవచ్చు.
 
భాషా శాస్త్ర పరంగా తెలుగు కాలనిర్ణయం

తమిళంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండీ సాహిత్యం లభిస్తోంది. తమిళం లోనూ కన్నడలోనూ తాలవ్యీకరణ (palatalization) లో వ్యత్యాసం కనబడుతోంది కాబట్టి, అవి రెండు కనీసం మూడు నాలుగు వందల యేండ్ల ముందుగా విడివడి ఉండాలి. ఆ రకంగా పూర్వ-తమిళం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ప్రత్యేక భాషగా ఏర్పడి ఉండవచ్చు. కానీ దక్షిణ ద్రావిడ భాషలకూ, దక్షిణ-మధ్య ద్రావిడ భాషలకూ శబ్ద నిర్మాణంలోనూ, వాక్య నిర్మాణంలోనూ అనేక వ్యత్యాసాలు కనిపిస్తాయి. దక్షిణ ద్రావిడ భాషలైన తమిళ‌-కన్నడ లతో పోలిస్తే తెలుగు-కువి-గోండీ లలో కనిపించే వ్యత్యాసాలో కొన్ని:

    వర్ణవ్యత్యయం (metathesis): తెలుగు-కువి-గోండి భాషలలో మూల ద్రావిడ ధాతువులోని అచ్చు తరువాతి హల్లు పరస్పరం స్థానం మార్చుకుంటాయి. (ఉదా: వాడు < *అవన్ఱు, వీడు <*ఇవన్ఱు, రోలు < ఒరళ్ <*ఉరళ్)
    తెలుగులో బహువచన ప్రత్యయం- లు. తమిళాది దక్షిణ భాషల్లో ఇది -కళ్‌, -గళు.
    క్త్వార్థక క్రియలు తమిళాదుల్లో -తు -ఇ చేరటం వల్ల ఏర్పడుతాయి. తెలుగు-కువి-గోండి భాషలలో -చి, -సి చేరటం వల్ల ఏర్పడుతాయి. ఉదా: వచ్చి, చేసి, తెచ్చి, నిలిచి వరుసగా తమిళంలో వన్దు , కెయ్దు, తన్దు, నిన్ఱు.

పైన పేర్కొన్న లక్షణాలన్నీ దక్షిణ మధ్య ద్రావిడ భాషలన్నిటిలో ఉండి దక్షిణ ద్రావిడ భాషలో లేనివి. అంటే ఈ మార్పులన్నీ తెలుగు-కువి-గోండి ఒకే భాషగా కలిసి ఉన్న రోజులలో మూల దక్షిణ ద్రావిడ భాషనుండి విడిపోయిన తరువాత వచ్చిన మార్పులన్న మాట. అన్ని ముఖ్యమైన మార్పులు రావటానికి కనీసం 400-500 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే తెలుగు-కువి-గోండి భాషలు దక్షిణ మధ్య ద్రావిడ ఉప శాఖగా క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో మూల దక్షిణ ద్రావిడం నుండి విడిపోవచ్చు. ఇదే నిజమైతే క్రీస్తు పూర్వం 700-600 వరకే తెలుగు ఒక ప్రత్యేక భాషగా స్వయంప్రతిపత్తిని కలిగి ఉండవచ్చునని మనం ఊహించవచ్చు. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్ర జాతిని ప్రత్యేక జాతిగా పేర్కొనడం ఈ లెక్కతో సరిపోతుంది కూడా!

ఈ రకమైన కాలనిర్ణయం సాపేక్ష కాలమానాల (relative chronology) మీద ఆధారపడ్డదే కానీ పద, ధాతు వ్యాప్తి గణాంకాల (lexicostatistics) మీద ఆధారపడ్డది కాదు. ద్రావిడ భాషల పూర్వచరిత్ర పై ఇంకా పరిశోధనలు ఇతోధికంగా జరిగితే గాని తెలుగు భాషా జనన కాలనిర్ణయాన్ని నిష్కర్షగా చెప్పలేం.

Wednesday, September 12, 2012

తెలుగు పదానికి జన్మదినం

తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి ఙానపదం
ఏడు స్వరాలే ఏడుకొండలై
వెలసిన కలియుగ విష్ణుపదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

అరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినది
శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో భవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతీగానపు మహిమలు తెలిసి
శితహిమకందర యతిరాట్సభలో తపః ఫలమ్ముగ తళుకుమని
తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో ప్రవేశించే ఆ నందకము
నందనానందకారకము

పద్మావతియే పురుడుపోయగా
పద్మాసనుడే ఉసురుపోయగా
విష్ణుతేజమై నాదబీజమై ఆంధ్రసాహితీ అమరకోశమై
అవతరించెను అన్నమయ
అసతోమా సద్గమయా

పాపడుగా నట్టింటపాకుతూ భాగవతము చేపట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగుభారతికి వెలుగుభారతై ఎదలయలో పదకవితలు కలయా
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ
తమసోమా జ్యోతిర్గమయా

Thursday, July 19, 2012

ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది

http://www.teluglobe.com/wp-content/uploads/2010/06/Annamacharya.jpg








ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది |
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||
చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము |
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ ||
మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము |
మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||
చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు |
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును |
విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||
చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల |
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై |
నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||

Monday, July 9, 2012

తొలి సంస్కర్త బసవేశ్వరుడు

ధనవంతులు నిర్మింతురు నీకై
ధగద్ధ గోజ్వల గోపురాదులను
ధనములేని బడుగును నేనెట్టుల
తమకై కట్టుదు శివాలయంబును..?

ఈ ప్రశ్న మనకు ఎంతోమంది వాగ్గేయకారుల్ని,తాత్వికుల్ని,భక్త శిఖామణుల్ని గుర్తు చేస్తుంది.నేను పేద వాడిని కదా...నీకు ఆలయమెలా కట్టగలను?నీకు నిత్య నైవేద్యాలెలా ఇవ్వగలను?నీకు రాజుల తోటల్లోని తాజాపువ్వులెలా సమర్పించగలను?అంటూ...ఈ ప్రశ్నలన్నిటికీ మూలాధారమైన ప్రశ్న బసవేశ్వరుడిదేనంటారు విజ్ఞులు.పన్నెండో శతాబ్దికి చెందిన బసవేశ్వరుడు కన్నడంలో సాహిత్యాన్ని ఎంతగా ప్రభావితం చేశాడో తెలుగులోనూ అంత కన్నా ఎక్కువే చేశాడు.పాల్కురికి సోమనాథుదు తెలుగులో బసవపురాణం రాశాడంటే "బసవేశ్వరుడు" ఎంతగా ఆ కాలాన్ని ప్రభావితం చేశాడో ఊహించవచ్చు.ఇప్పటికీ కర్ణాటక,ఆంధ్ర రాష్ట్రాల్లో బసవేశ్వరుడి అనుచరులు కోట్లల్లో ఉంటారు ! ఆయన వచనాల సారాంశమేమిటో చూద్దాం.

ఉత్తమకులమున కధమ కులమ్ముకు
ఉత్తజన్మమే కారణమెట్లగు?
హింసాత్మకుడగువాడే మాదిగ
నీచు భుజించెడి వాడే మాలడు
సర్వ జీవహితమెవడు కోరునో
సంగమ దేవ కులస్థుండాతడు

"జన్మనా జాయతే శూద్రా" అన్న స్లోకార్థం ఈ వచనంలో ప్రతిధ్వనిస్తోందంటే బసవేశ్వరుడు ఎంత జ్ఞానో,సంస్కరణాభిలాషో అర్థంచేసుకోవచ్చు.పన్నెండో శతాబ్దంలో కర్ణాటకని బిజ్జలుడు పాలిస్తోన్న రోజుల్లో కల్యాణనగరంలో రాజు ఆస్థానంలో గణికులు ఆదాయ వ్యయాలు లెక్కిస్తున్నారు.అప్పట్లో కంప్యూటర్లు,కాలిక్యులేటర్లు లేవు కాబట్టి లెక్కలో తేడా రావడం సహజమే.వారి గణనలో చిన్న పొరపాటు దొర్లనే దొర్లింది.కొంచెం దూరం నుంచి వారిని గమనిస్తోన్న ఓ యువకుడు వారిని సమీపించి అసలు విషయం వివరించాడు.ఆ యువకుని నిర్భీతికి,ధైర్యానికి మెచ్చుకున్న సిద్ధ దండాధీశుడు ఆ యువకుడిని బిజ్జలుని దగ్గరకు తీసుకెళ్లి విషయం చెప్పాడు.రాజు ప్రసన్నుడై తన భాండాగారంలో ఉద్యోగమిచ్చారు.అలా తన కాళ్ల పై నిల్చున్న బసవేశ్వరుడు సంగమ దేవుడి పట్ల ఆకర్షితుడయ్యాడు.అసలు బసవేశ్వరుడు కల్యాణనగరం ఎందుకు వచ్చాడన్నది పెద్ద కథ.బసవేశ్వరుడు "బాగేవాడి"లో మాదిరాజు,మాదాంబలకు జన్మించాడు.వైదిక కర్మలంటే చిన్నతనం నుంచీ బసవేశ్వరుడికి పడేదికాదు.ఉపనయనం చేయాలని తండ్రి ప్రయత్నిస్తే బసవేశ్వరుడు ఇంటి నుంచి పారిపోయాడు.అంటే పన్నెండో శతాబ్దంలోనే ఎంత విప్లవాత్మకంగా ప్రవర్తించాడో అర్థం చేసుకోవచ్చు.రోజూ శివుడిని పూజిస్తు శివుడి ధ్యానంలో గడిపే బసవడికి శివుడే కలలొ కనిపించి కల్యాణపురం వెళ్లమని చెప్పాడన్నది ఐతిహ్యం.ఎలాగైతేనేం తల్లిదండ్రులు సంకల్పించిన వైదిక కర్మల నుంచి పారిపోయిన బసవేశ్వరుడు కల్యాణపురం చేరుకున్న తర్వాత శివుడిని అర్చిస్తూ శివతత్వాన్ని జీర్ణం చేసుకున్నాడు.శివుడే సర్వేశ్వరుడు,శివుడిని మించిన వాడు లేడన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకున్నాడు.అలా వీరశైవమతానికి బీజాలు వేశాడు.బసవుడు తాను చూసిన సమాజాన్ని,గ్రహించిన శాస్త్రసారాన్ని సామన్యులకు అందించాలనుకున్నాడు.

శైవమతం విశేషమేమంటే -
* మనుషులందరూ ఒక్కటే.కులాలు,ఉపకులాలు లేవు.
* శివుడే సత్యం,నిత్యం.
* దేహమే దేవాలయం.
* స్త్రీ పురుష భేదంలేదు.
* శ్రమను మించిన సౌందర్యం లేదు.
* భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యం.

ఇటువంటి ఉపదేశాలతో బసవేశ్వరుడు 64 లక్షల వచనాలు కూర్చాడు.అన్నమయ్య కూర్చిన ముప్పై రెండువేల సంకీర్తనలున్న రాగి రేకుల్లో అక్కడి పూజారులు కరిగించినవి పోగా మనకిప్పుడు పన్నెండు వేలే లభ్యమవుతున్నాయి.అలాగే బసవేశ్వరుడి వచనాలలో కూడా కొన్ని వేలు మత్రమే లభ్యమవుతున్నాయి.
బసవేశ్వరుడు శివభక్తులందర్నీ పూజించి,వారు భోంచేశాకే చివర్లో మిగిలింది తినేవాడు.క్రమంగా వచనాల వ్యాప్తికి,వేదాంత గోష్టికి "అనుభవ మంటపం" నిర్మించి అందులో అన్ని కులాల వారిని నియమించారు.
ఆనాటి సమాజం బసవేశ్వరుడి సంఘసంస్కరణను ప్రశ్నించింది.బసవేశ్వరుడికి ఎన్నో ఆటంకాలు సృష్టించింది.అయినా ఆయన జంకలేదు.

"చెడును స్థావరమును జంగమమిదిగో
పాదములివి ఆలయ కంబములు
పసిడి కలశమగు నా శిరమిదిగో
నడిచెడి యీ దేవాలయమ్ములో
నివసింపుము శ్రీ సంగమేశ్వరా"

తన దేహంలోనే నివసించమని సంగమేశ్వరుడిని ఆహ్వానించిన బసవేశ్వరుడు సాహిత్యపరంగా కూడా ఎంతో విలువైన వచనాలు అందించాడు.

అగ్రజుడెవ్వరు?అంత్యజుడెవ్వడు
బ్రాహ్మణుడెవ్వరు?శ్వపచుండెవ్వరు?
భక్తులెల్ల శ్రీసంగమ కులజులు
కల్లయైన నా ముక్కును చెక్కుము

ఇది బసవేశ్వరుడి సవాలు.ధీమా.నిజమైన భక్తులందరూ శ్రీసంగమ కులజులే.ఇది తప్పయితే నా ముక్కుచెక్కి నాకు శిక్ష విధించమని సవాలు విసిరిన బసవేశ్వరుడు మానవ ప్రవర్తన ఎలా ఉండాలో కూడా స్పష్టం చేశారు.

"దోంగలింపకుము,హత్యల చేయకు
కల్ల లనాడకు,కోపగింపకుము
ఆత్మస్తుతి పరనిందల విడువుము
బాహ్యం తశ్శుద్దుల భావమ్మిదే"

పన్నెండో శతాబ్దంలోనే బసవేశ్వరుడు అన్ని కులాల వారికి తన 'అనుభవ మంటపం'లో ఆశ్రయమిచ్చి వారికి కొన్ని విధులు నిర్దేశించడమేకాక సాహసించి స్వయంగా వర్ణాంతర వివాహం జరిపించాడు.బసవేశ్వరుడి శైవమత విశ్వాసాలను,తీవ్రవాదాన్నీ దెబ్బతీయాలని ఎదురుచూస్తోన్న వారికి ఆ వివాహం బాగా కలసి వచ్చింది.దాంతో బసవేశ్వరుడిపై దొంగదెబ్బ తీయడానికి సాహసించారు.వర్ణాంతర వివాహం చేసుకున్న దంపతులు హత్యకు గురవ్వడంతో 'బసవేశ్వరుడు చలించిపోయాడు.కలచివే'తకు గురై తన ఉద్యోగం వదలి కూడలి సంగమేశ్వరుని సన్నిధిలో శేష జీవితం గడుపుతూ చివరికి ఆయనలో లీనమయ్యాడు.

"భక్తి వంద నమె భక్తి"యనంబడు
మృదువచనంబే 'మంత్ర ' జపంబగు
మృదువచనంబే 'మంత్ర ' తపంబడు
సద్వినియంబే శివప్రణయమగు
గుణహీనమ్మగు కొంగభక్తి నిల
కూడల సంగముడేడ వలచు మరి!

బసవేశ్వరుడి స్పూర్తితో అక్కమాదేవి వంటి భక్తి,తాత్వక కవులు ఎందరో వచ్చారు.అన్నమయ్య,వేమన,వీరబ్రహ్మం వీరందరి భావాల్లో విప్లవాత్మక మార్పులు రావడానికి పరోక్షంగా బసవేశ్వరుడే కారణం అనడంలో సందేహంలేదు.ఆయన వచనాలను ముదిగొండ శివప్రసాద్,దీవి సుబ్బారావు వంటి వారు తెలుగులో అందించారు.

Thursday, July 5, 2012

తెలుగు వెలుగులు

తెలుగు జాతికి ఖ్యాతిని తెచ్చిన ఎందరో ప్రతిభావంతులు ఉన్నారు,అన్ని రంగాల్లోను ప్రతిభాముర్తులై వెలిగి జాతికి స్పూర్తిగా నిలిచిన అటువంటి మహనీయుల్లో కొందరి వివరాలను లేశమాత్రంగా తెలుసుకుందాం.


శంకరంబాడి సుందరాచారి : రాష్ట్ర గీతమైన "మా తెలుగు తల్లికి మల్లె పూ దండ" అన్న గేయాన్ని రచించి తెలుగు జాతికి అంకితమిచ్చిన మహాకవి.తిరుపతి వాస్తవ్యులైన వీరికి నిన్న  మొన్నటి దాక దక్కాల్సినంత పేరు దక్కలేదు.ఈ మధ్యనే తిరుపతిలో సుందరాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.


పొట్టి శ్రీరాములు(1901 - 1952) : ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణం చేసిన త్యాగధనుడు.సత్యము,అహింస,హరిజనోద్ధరణ ప్రదానాశయాలుగా గాంధీజీ అడుగుజాడల్లో నడచిన మహనీయుడు.తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరశన వ్రతం చేసి అసువులు బాసారు.తత్ఫలితంగానే నేటి ఆంధ్రప్రదేశ్ అవతరణ.


గిడుగు రామమూర్తి పంతులు(1863 - 1940) : ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషొధ్యమానికి మూలపురుషుడు.బహుభాషా శాస్త్రవేత్త,చరిత్రకారుడు,సంఘసంస్కర్త.గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందరికి అందుబాటులోకి వచ్చింది.పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతిఒక్కరికి వీలైంది.


కందుకూరి వీరేశలింగం(1848 - 1919) : గొప్ప సంఘసంస్కర్త,సాహీతివేత్త.కథ,నవల,వ్యాసం వంటి అనేక తెలుగు సాహిత్యశ్రీకారం చుట్టిన వాడు.స్త్రీ విద్యను,వితంతు వివాహాలను ప్రొత్సహించాడు.వివేకవర్ధిని పత్రికను స్తాపించి సమాజంలో అప్పటికే పేరుకుపోయిన మూఢాచారాలను దురాచారాలను తూర్పార పట్టారు.అధికారవర్గాల్లోని అవినీతిని , అక్రమాలను కలం బలంతో బట్టబయలు చేశారు .

 
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి(19వ శతాబ్దం పూర్వార్థం) : దేశ స్వాతంత్ర్యం కోసం ఆత్మార్పణ చేసిన త్యాగధనుడు.ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి పదేండ్లకు పూర్వమే ఆంగ్లేయుల నిరంకుశ పాలనను ఎదిరించి నిలిచిన ధీరుడు.


గురజాడ అప్పారావు(1862 - 1915) : "దేశమును ప్రేమించుమన్నా" అంటూ దేశభక్తి గీతాన్ని ప్రబోధించిన నవయుగ వైతాళికుడు.భాషా సాహిత్యాలు,కళలు దేశ హితానికి ఉపయోగపడాలని ఆకాంక్షించిన సమాజోద్ధరణాభిలాషి.గురజాడ సృష్టించిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ,కన్యక అనే కావ్యాలు తెలుగు వారి కంటతడి పెట్టిస్తూనే ఆయన కాలం నాటికి సమాజంలో పాతుకుపొయిన మూఢాచారాలపై ధ్వజమెత్తాయి.


రఘుపతివెంకటరత్నం నాయుడు(1862 - 1939) : సంఘసంస్కర్త,బ్రహ్మసమాజ ప్రచారకుడు.ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విధ్యార్థుల్లో రుజువర్తన,నైతిక శీలానికి ప్రాధాన్యమిచ్చినవాడు.మహామహులైన భోగరాజు పట్టాభి సీతారామయ్య,ముట్నూరి కృష్ణారావులు ఈయన శిష్యులే నంటే గురువుగా ఆయన ప్రభావమెంతటిదో అర్థమవుతుంది.


టంగుటూరి ప్రకాశం పంతులు(1872 - 1957) : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.తెలుగు వారి గుండెల్లో ఆంధ్రకేసరిగా ఈయన స్థానం పదిలం.బారిస్టరుగా ప్రాక్టీసు పెట్టి కోట్లు సంపాదించే అవకాశమున్నా గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర్యోద్యమంలో ప్రవేసించాడు.సైమన్ కమిషన్ వచ్చినప్పుడు పోలీసుల తుపాకీ గుండుకు తన గుండెను ఎదురొడ్డి నిలిచి ఆంధ్రజాతి గుండెను గెలుచుకున్నారు.


పింగళి వెంకయ్య(1878 - 1963) : భారత జాతీయ త్రివర్ణ పతాక నిర్మాత.స్వాతంత్ర్యసమరయోధుడు,వ్యవసాయ శాస్త్రవేత్త,గుండె నిండుగా దేశాభిమానమే కాదు,మెదడు నిండుగా విజ్ణానాన్ని ధరించినవాడు.కాంబోడియా పత్తి రకాన్ని పరిశోధించి,పండించి వ్యవసాయ శాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు అనేక బంగారు,వెండి పతకాలను గెలుపొంది రాయల్ ఎగ్రికల్చర్ సొసైటీకి సభ్యుడుగా ఎన్నికయ్యారు.


బండారు అచ్చమాంబ(1874-1905) : స్త్రీ విద్యకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న ఆ రోజుల్లోనే చదువుకోవడమే కాకుండా రచనలు సైతం చేసిన ప్రజ్ఞాశాలి.ఎన్నో గ్రంథాలను శోధించి వెయ్యి సంవత్సరాల స్త్రీల చరిత్రను "అబలా సచ్చరిత్ర రత్నమాల" పేరుతో ఒక్క చేతితో రాశారు.భర్త మాధవరావుతో కలిసి స్త్రీ జనాభ్యుదయానికి పాటుపడ్డారు.స్త్రీ సమాజాలను స్థాపించారు.


డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు(1895 - 1948) : ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త.ఆధునిక వైద్యంలో అనేక అద్భుత ఆవిష్కరణలు చేసిన వ్యక్తి.ముఖ్యంగా బోదకాలు వ్యాధి నివారణకు ఉపయోగించే డై ఈథైల్ కార్బామజీస్ అనే మందును కనుగొన్నారు.1945లో అరియోమైసిస్ అనే యాంటీబయొటిక్ మందును ఆవిష్కరించారు.పాండు రోగ నివారణకు పోలి కాంల,క్షయ రోగానికి పసోనికోటి నికాసిడ్ హైడ్రోజన్ లను కనుగొన్నారు.