తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ “తెలుగు వెలుగు "ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం..! " తెలుగు " ను కొత్త " వెలుగు " లో ప్రపంచానికి చూపిద్దాం!

Friday, November 25, 2011

దేశ భాషలందు తెలుగు లెస్స

ఆది ద్రావిడం అరవల సొమ్మా?


రాయీ, మన్నూ పుట్టకముందే పుట్టిన ప్రపంచపు తొలిభాష తమిళ్‌. ఇది ప్రపంచ భాషలన్నింటిలోకీ అత్యంత ప్రాచీనమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి నిస్సంకోచంగా ప్రభుత్వ ఉత్తర్వులలో ప్రకటించారు. అదే మాటను ప్రపంచ తమిళ మహాసభల సందర్భంగా ఉద్ఘోషించి చెప్పారు. ఇది తమిళ తంబిల భేషజానికి ఎన్ని తరాలు మారినా మారని వారి అలవి మీరిన అహంకారానికి నిదర్శనంగా కనబడుతోంది. ద్రవిడ భాష అతి ప్రాచీనమైనదే ఎవ్వరూ కాదనరు. దానికి సంస్కృత భాషకున్నంత చరిత్ర ఉన్న మాట కూడా సత్యమే! దాన్ని కూడా ఎవ్వరూ కాదనరు. అయితే అవన్నీ అన్వయించాల్సింది ఆది ద్రవిడానికే కాని తమిళానికి కాదు. ఆది ద్రావిడం అనేక భాషలకు తల్లి లాంటిది. అంత మాత్రాన దాన్ని ప్రపంచ భాషలకు తల్లిలాంటిది అనడం అతిశయోక్తి! తమిళం వేరు ఆది ద్రవిడం అని పిలువబడే మూల ద్రవిడం వేరు అన్న విషయం అంతా గుర్తించాలి. సంస్కృతం ఆర్యుల భాష అయితే ద్రవిడం పూర్తిగా స్థానిక భాష. సంస్కృతం ఆర్యులతోపాటే మన దేశానికి వలస వచ్చిన భాష. శతాబ్దాలుగా ఇక్కడే ఉండి, ఈ దేశానికే సొంతమైనట్టుగా స్థిరపడిపోయింది. భారతీయతకు కీర్తి పతాకగా, మన సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, వేద, పురాణేతిహాసాది భారతీయ సాహితీ సంపదకు అది ఆటపట్టు అన్న వాస్తవాన్ని కూడా ఎవ్వరూ కాదనరు. దాని చరిత్రను, దానికి గల గౌరవాన్ని ఎవ్వరూ శంకించరు. స్థానికంగా ఉన్న ప్రాకృత, పాళి వంటి భాషలను అణగదొక్కి అది రాజభాషగా ఎలా చెలామణి అయిందో అలాగే ఆది ద్రవిడం దక్షిణాదిని ఆవరించి బలమైన స్థానిక భాషగా తలయెత్తి నిలిచింది. ఈ మూల ద్రవిడ భాష ప్రాంతానికి ఒక రకంగా ఉండి అనేక జాతులకు మాతృభాషను అందించింది. అలా మూల మధ్య ద్రవిడ భాష నుంచి పుట్టినది తెలుగుభాష. అనంతమైన ధ్వనిసంపదను, సాహితీ సంపదను కలిగి ఉన్న తెలుగుకు సవర, గొండి, కుయి, కోయ, కొలిమి భాషలు కూడా ఇలాగే పుట్టి తెలుగుకు ఉపభాషలుగా మారిపోయాయి. తెలుగు భాషలో ఉన్నన్ని భాషాధ్వనులు మరే భాషలో లేవంటే అతిశయోక్తికాదు. ఆది ద్రవిడం కుటుంబంలో పుట్టి ఆ భాషామతల్లి పాలు తాగిన భాషలు 26 ఉన్నాయి. అందులో తమిళం ఒకటి మాత్రమే! ఈ విషయం ఆ భాష అంటే ప్రాణాలు వదిలేవాళ్లు గుర్తించాలి. సంస్కృత భాషా సాంగత్యం వల్లే తెలుగు తన ధ్వని సంపదను అనంతంగా విస్తరించుకోగలిగింది. అందువల్ల స్పష్టత, మార్దవం, మాధుర్యం పెంచుకోగలిగింది. అందుకే తెలుగుతేట అని కీర్తి పొందింది. 15వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్‌ యాత్రికుడు నికోలొ డా కాంటి తెలుగును ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అని కీర్తించాడు. తెలుగు భాషా సౌందర్యాన్ని మాధుర్యాన్ని సంపూర్ణంగా గమినించిన వాడు కనుకనే దక్షిణాది భాషలు కరతలామలకం చేసుకున్న శ్రీకృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స అని కితాబు ఇచ్చాడు. దేశభాషలు ప్రాంతీయ భాషలు అని అర్థం. దక్షిణాన ఉన్న ప్రధాన ప్రాంతాలేమిటి తమిళసీమ, కర్నాటక సీమ, మళయాళ సీమ, తెలుగు సీమ. ఈ ప్రాంతాలలో వ్యవహారంలో ఉన్న అన్ని భాషల కంటే తెలుగు చాలా గొప్పది అని గొంతెత్తి చాటాడు. అంటే ద్రవిడ భాషలలో కెల్లా అమిత మధురమైన భాష తెలుగు అని తేటతెల్లమైంది కదా అక్కడితో ఆగలేదు. తనను తెలుగు వల్లభుడనని, ఆంధ్రభోజుడనని చాటుకున్నాడు.


సాహిత్య సంపదలో తమిళంతో అన్నిటా ముందుండగల భాష తెలుగు. ఇందులో ఉర్దూ, పర్షియన్‌, ఇంగ్లీషు పదాలు సంగమించి ఉన్నాయి. నదులన్నీ సంగమించడం వల్లే సాగరం అంతుపట్టనంతగా విస్తరించింది. అలాగే ఇన్ని భాషలు తమంత తాముగా వచ్చి తెలుగుతో సంగమించబట్టే ఎలాంటి భావాన్నయినా, ఎంతటి క్లిష్టమైన వాఖ్యాన్నయినా అలవోకగా అక్షరబద్ధం చేయగల సత్తా తెలుగుకు ఉంది. ఇక్కడ ఇంగ్లీషులో ఉన్నట్టుగా సైలెంట్‌ అక్షరాలు ఉండవు. ఎలా మాట్లాడతావెూ అలా రాయగలుగుతాము. ఎలా రాయగలుగుతావెూ అలాగే ఉచ్ఛరించగలుగుతాము. అందుకే మనది జీవద్భాషగా వాసికెక్కింది. అందుకే ప్రముఖ జన్యు శాస్త్రవేత్త జెబిఎన్‌ హాల్డెన్‌ తెలుగుకు ఇండియాకు జాతీయ భాషగా నిలువగల అన్ని రకాల అర్హతలు ఉన్నాయని అన్నారు. రెండు పదాలను కలిపి మూడో అర్థం ఇవ్వగల పదాన్ని సృష్టించగల విలక్షణ లక్షణం తెలుగుకు మాత్రమే ఉంది. సౌందర్యాన్ని సంగ్రామ భూమిని సమానంగా ప్రేమించగలవాళ్లు తెలుగువారు అని ఉద్యోతనుడు తన ప్రాకృత గ్రంథం కువలయమాలలో ప్రశంసించాడు. తెలుగు వారు అందమైన వారని, అందాన్ని అమితంగా ఆరాధించేవారని, అందమైన భోజనాన్ని ఆనందంగా ఆరగించే వారని కూడా అన్నాడు. ఈ రోజున ఇండియా మొత్తంలో అత్యధిక ప్రజలు మాట్లాడే రెండవ భాషగా తెలుగు స్థానం దక్కించుకుంది. హిందీని జాతీయ భాషగా చెప్పే వాళ్ళ లెక్క ప్రకారం తెలుగు రెండవ అతిపెద్ద భాషగా ఉంది. దాన్ని ప్రాంతీయ భాషగా లెక్కకట్టి చూస్తే తెలుగే అతి పెద్ద ప్రాంతీయ భాషగా నెంబర్‌ వన్‌ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్ల మంది తెలుగుమాట్లాడే వారున్నారు. తమిళభాషను తోసిరాజనగల తెలుగు భాషకు, తెలుగు జాతికి 2,500 సంవత్సరాల చరిత్ర ఉందని నిర్ద్వద్వంగా నిగ్గుతేలితే దాన్ని పడనివ్వకుండా కోర్టుకెక్కి ప్రాచీన భాషా హౌదా దక్కనివ్వకుండా అడ్డుకున్న సంస్కారవంతులు తమిళులు.
మూల ద్రవిడానికి దగ్గరి భాష మాదే కనుక అసలు ద్రవిడ భాష మాదే అని గడుసుతనంతో నోరేసుకుని అరిచి ప్రచారాలు చేసుకుని వాస్తవాలను చెరిపేసినంత మాత్రాన చరిత్ర చెరిగిపోదు. చింపేస్తే చిరిగిపోదు. తమిళ ప్రభువుల అధికార పీఠాలు వేసుకుని కూచున్న చెన్నై ఎక్కడిది తెలుగువారి ఓడరేవు చెన్నపట్నం కాదా వాళ్ళు గొప్పగా చెపðకునే చాళుక్యులు ఆంధ్ర ఇక్ష్వాకుల సంతతి వారు కారా వారిని తెలుగు రాజులుగా చెపðకోడానికి వారు ఇబ్బంది పడ్డా చరిత్ర సాక్ష్యం పలకడం మానేస్తుందా పల్లవులు పరిపాలించిన తెలుగునేల పల్నాడుగా కీర్తిగాంచలేదా వారి రాజధాని నగరం కాంచీపురంలో కొలువున్న వరదరాజు అచ్చతెలుగు దేవుడు. వరదరాజు, వరదయ్య, వరం వంటి పేర్లు తెలుగు ప్రజలలో విరివిగా కనబడతాయి. శ్రీరంగనాథుడు కొలువున్న కావేరీ తీరం పూర్తిగా తెలుగునేల. కస్తూరి రంగడిగా, కావేటి రంగడిగా ఆ దేవుడు తెలుగు వారి జీవితంలో భాగంగా ఉండిపోయాడు. రంగారావులు, రంగారెడ్డి, రంగయ్య, రంగరాజు, రంగబాబు, రంగనాయకుడు, రంగనాథ్‌లు ఇక్కడ ఉన్నంతగా తమిళనాట లేరు. 'కస్తూరి రంగ రంగ..మాయన్న కావేటి రంగ రంగ' అని పాడని తెలుగు తల్లి ఉందా ఇలా పాడని తమిళ తల్లులు మాత్రం కోకొల్లలుగా ఉన్నారు. తెలుగువాడికే సొంతమైన చిదంబర రహస్యం మరిచిపోయారా సర్వేపల్లి రాథాకృష్ణన్‌ పుట్టినపుడు తిరుత్తణి తెలుగునాడులో ఉందా తమిళనాడులో ఉందా సర్వేపల్లి తమిళనాడు వాడని చంకలు గుద్దుకునే పెద్దలు ఆయన చిననాడు రేణిగుంటలోనూ, తిరుపతిలోనూ ఎందుకు చదువుకున్నాడు తెలుగు మీడియాలో చదువుకుంటే తమిళనాడులో చెల్లుబాటు కాదని తెలియకే చదువుకున్నాడా అన్నది చెప్పాలి. కంచి కామాక్షి, మధుర మీనాక్షి కూడా అచ్చతెలుగు ఆడపడుచులు. మధురనేలిన నాయకరాజులు అచ్చతెలుగు నాయకులు. క్షీణాంధ్ర సాహితీయుగంలో స్వర్ణయుగాన్ని స్థాపించిన వారు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కట్టించింది తెలుగు రాజులుకాదా సరస్వతీమహల్‌ కట్టింది తెలుగువారు కాదా తెలుగు అంటే చిరాకు పడే, మండిపడే పెద్దలు ఇప్పటికీ తమ రాజకీయాలకు పెద్దదిక్కు అని కొలుచుకునే జయలలిత తెలుగు అమ్మాయి కాదా తెలుగుగంగ పారితేగాని గొంతైనా తడుపుకోలేని వీళ్ళు ప్రపంచమంతా నాదేనని మాట్లాడడం శోచనీయం. విడ్డూరం.


తెలుగును తెనుంగు అని పిలిచే వారు తమిళులు. తెన్‌ అంటే దక్షిణాది అని అర్థం. తెనుంగు అనడం ద్వారా అది దక్షిణాది భాష అని అనడానికే తప్ప దాని పూర్తి వికాసరూపమైన తెలుగు పదాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. ద్రవిడ భాషా కుటుంబాలలో అతి ప్రాచీనమైన చరిత్ర కలిగిన జాతి తెలుగుజాతి. తమిళులతో అన్ని విధాల పోటీపడి పోరాటాలు చేయగల నేర్పు, ప్రతిభ గలవారు తెలుగువారు. కనుకనే వారికి తెలుగువారు అంటే సహజమైన మంట ఉంటుంది. అందుకే దాన్ని ఎలాగైనా తొక్కిపట్టాలని, ఇక్కడికి ఎలాంటి ప్రయోజనాలు రాకుండా చూడాలని శక్తి వంచనలేకుండా ప్రయత్నిస్తుంటారు. వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించి వేరుపడిన వారు తెలుగువారు. ఆ తరువాతే కన్నడ, మళయాళ సీమల వారు వేరుపడ్డారు. తెలుగువారు సంఖ్యాపరంగా చాలా ఎక్కువ. ప్రపంచం మొత్తం మీద తమిళం మాట్లాడే వారు ద్రవిడం అనేది ఒక ప్రత్యేకమైన భాషా కుటుంబం. ఇందులో ప్రధానంగా తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం ఉన్నాయి. మళ్ళీ వేటికి వాటికే ఉపభాషలు ఉన్నాయి. మా భాషే శుద్ధమైంది. మిగిలిన భాషలు సంస్కృతాన్ని ఆహ్వానించడం ద్వారా సంకరజాతి భాషలుగా మారిపోయాయి అని వారు అంటుంటారు. ముగ్గదీసుకుని బతకడంలో సంకుచితత్వం ఉంటుంది. అందరినీ ఆదరించగలగడంలో విశాల హృదయం ఉంటుంది. మిగిలిన భాషలు ఆ పని చేయగలిగాయంటే అది అక్కడి సార్వజనీన ధోరణికి నిదర్శనం. శాంతియుతంగా సహజీవనం చేయాలన్నా, సమాన స్థాయినిచ్చి గౌరవించాలన్నా విశాల దృక్పథం, విశాల హృదయం కావాలి. మూల ద్రావిడం తనదే అయినట్టు చెపðకుంటున్న తమిళుల వాదన ఏ రకంగా చూసినా నిజం కాదు. మూల ద్రావిడం అందరిదీ! అది దాక్షిణాత్య భాషలకు అమ్మగారి ఇల్లులాంటిది. ఆ ఉగ్గుపాలు తాగి, ఆ చేతి ముద్ద తిని పెరిగిన భాషలన్నీ ఆ గూటి పాటనే పాడతాయనే విషయం వారు గుర్తుంచుకోవాలి. తమిళభాష మీద మాకు ఉన్న గౌరవం అపారం. ఆ భాష మీద మాకెలాంటి ద్వేషం లేదు. శత్రుత్వం అంతకన్నా లేదు. కానీ ఆ భాష మాట్లాడేవారు చూపించే అతి సంకుచిత మనస్తత్వానికి, ఇరుకైన వారి ఆలోచనా ధోరణిని మాత్రం హర్షించలేం. సరిసమానులను గౌరవించడం ఎవరికైనా మంచిది. అది మర్యాదస్తుల లక్షణం.

ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు


ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు

ఇతరమతాల బారినుండి హిందూ మత సంరక్షణకు కన్యాకుమారి నుండి కటకము వరకు రాయలసీమలో తెలుగుజాతి వీరులను నిల్పిన విజయనగర సామ్రాజ్యపు పట్టుకొమ్మలు కంచి, చంద్రగిరి, పెనుగొండ, గుత్తి రాయదుర్గము, పంపానగర విజయనగరము. ''కంచి'' ఐక్యమత్య విధానంతో శివకంచి విష్ణు కంచి, వేగవతీ నది తీరాన నిల్పిన పుణ్య భూమి.

శ్రీ కృష్ణదేవరాయలు తాత ఈశ్వరరాయలు, తండ్రి నరసరాయలు, తిమ్మరుసు గోవింద రాజులు చంద్రగిరిలో జన్మించారు. శ్రీకృష్ణ దేవరాయలు జన్మస్థానము పెనుగొండ. అన్ని విద్యలూ పెనుగొండ, చంద్రగిరి, విజయనగరాలలో అభ్యసించారు.

శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసు పూర్వీకులు తెలుగుగడ్డలో పుట్టి తెలుగుతల్లి పాలు తాగిన వీరులు. తిమ్మరుసు, తండ్రి రాచిరాజు. తాత వేమరాజు. వీరు కొండవీడు, ఉదయగిరి సామంతరాజు. బహమనీ సుల్తాన్లు గజపతులు తాల్రాజును హతమార్చి నందువలన తిమ్మరుసు తండ్రి రాచిరాజు 1460లో చంద్రగిరి చేరారు. అందుకే తిమ్మరుసు పగపట్టిన కొండవీటి సింహం. గజపతులతో 7 సంవత్సరాలు యుద్ధం జరిపి పగతీర్చుకొన్నాడు. శ్రీకృష్ణ దేవరాయలను గజపతుల అల్లునిగా జేసారు. కాని గజపతులు వ్లుెచ్ఛాబ్ధి కుంభోద్బవులు. తిమ్మరుసు, శ్రీకృష్ణదేవరాయల అంత్య దశలో కుట్రలు పన్నారు. కాని తిమ్మరుసు, శ్రీకృష్ణదేవరాయల అనుబంధము విడదీయరానిది. వారు చివరి వరకూ ఆత్మీయులే. శ్రీకృష్ణదేవరాయలుకు, తిమ్మరుసు 67 సంవత్సరముల వయస్సులో సాధారణ మరణము సంభవించినది. (వసుంధరా పిహ్లెట్‌-ఫ్రాన్స్‌ -విజయనగర్‌-నేషన్‌ బుక్‌ ట్రస్ట్‌).

వరాహపురాణములో తెలుగు ఆది జంటకవులు ఘంటసింగయ్య, నంది మల్లయ్య, శ్రీకృష్ణ దేవరాయల పూర్వీకులు కంచి, అరణి దగ్గర దేవకీపుర దుర్గాధీశులు అని వివరించారు. ఆనాటికి ఈనాటికి కంచి పరిసర ప్రాంతాలలో తెలుగు మాతృభాషగా గల బ్రాహ్మణులు, వైశ్య, కాపు బలిజలు, చేనేత వర్గాలు, బలహీనవర్గాలు, దళితులు, ముస్లిములు ఎక్కువగా యున్నారు. ఆనాటి రాయలకొలువులో రాజకీయ ప్రాబల్యము వీరిదే.

తిమ్మరాజు శ్రీకృష్ణ దేవరాయలు ముత్తాత. భార్య దేవకి పేరున కంచి దగ్గర దేవకీపురము నిర్మించారు. తిమ్మరాజు కుమారుడు ఈశ్వరాయలు, భార్య బుక్కాంబ. క్రీ.శ. 1456 సంవత్సరము నాటికే ఈశ్వరరాయలు విజయనగర రాజప్రతినిధిగా సాళ్వనరసింహరాయలు సేనాధిపతిగా చంద్రగిరి నారాయణ వనములో ఉన్నారు. ఈశ్వరరాయలు సాళ్వనరసింహరాయలు కుడి భుజంగా కన్నడ ప్రాంతాలైన ఉమ్మత్తూరు, శ్రీరంగపట్నము, పశ్చిమ తెలుగు ప్రాంతాలు జయించారు. 1481 మార్చినెలలో బహమనీ సుల్తాన్‌ మహమ్మద్‌ షా కంచి దేవాలయము దోపిడీ సొమ్మును కందుకూరు వద్ద అడ్డగించిసొమ్ముతో సహా శిబిరము దోచుకొన్నాడు. శ్రీకృష్ణ దేవరాయల తండ్రి నరసరాయలు సాళ్వనరసింహరాయల సేనాధిపతిగా, బహమనీ సైన్యాధ్యక్షుడు ఆదిఖాన్‌ ఫకాషి ఉల్ముల్కును పెనుకొండ వద్ద ఓడించాడు.

చివరి సంగమరాజు ప్రౌఢదేవరాయలు బలహీనుడు. ఈ సమయంలో నరసరాయలు పెనుకొండ నుండి సైన్యము సమీకరించుకొని విజయనగరము ప్రవేశించాడు. విజయనగరము అవలీలగా స్వాధీనమైనది. సాళ్వనరసింహరాజు సింహాసనము అధిష్టించాడు (1485).

శ్రీకృష్ణ దేవరాయల తాత ఈశ్వరరాయలు, తండ్రి నరసరాయలు యిరువురూ సాళ్వనరసింగరాయలు వద్ద చంద్రగిరి నారాయణవనములో సేనాధిపతులు, కార్యకర్తలు, విశ్వాసపాత్రులుగా వున్నారు. చంద్రగిరి నారాయణ వనములో జన్మించిన నరసరాయలు చంద్రగిరి , పెనుకొండ, గుత్తి ప్రాంత విజయనగర రాజప్రతినిధిగా ఎక్కువ కాలమున్నాడు.

ఈ కాలములో తిమ్మరుసు చంద్రగిరి నారాయణవనంలో ఉంటూ తమ్ముడు గోవిందరాజులు, నరసరాయలు పెనుకొండ యందు ఎక్కువ కాలము (1485 నుండి 1490) ఉండేవిధంగా ప్రయత్నించారు. ఈ సమయములో 1489లో శ్రీకృష్ణ దేవరాయలు సాగివంశపు రాజకుమారి నాగులాదేవికి పెనుకొండ యందు జన్మించినాడు.

''తిప్పాజీ నాగలాదేవ్యో: కౌసల్య సుమిత్రాయో'' వీరనరసింహ రాయల శాసనము ప్రకారము నాగలాదేవి నరసరాయకుని కుల వధువని దేలుచున్నది. (డా|| నేలటూరి వెంకటరమణయ్య) శ్రీకృష్ణ దేవరాయల తల్లి సాగివంశపు రాజకుమారి అని-శ్రీరాజాదాట్ల వేంకట సింహాద్రి జగపతిరాజు సమర్పించిన తామ్రశాసనము వివరించింది. విజయనగర చరిత్ర-నూతలపాటి పేరరాజు) శ్రీకృష్ణదేవరాయలు జన్మస్థానము చంద్రగిరి నారాయణవనము అనడానికి తక్కువ ఆధారాలు వున్నాయి. అచ్యుత దేవరాయలు, శ్రీరంగరాయలు జన్మస్థానాలు పెనుకొండ. పెనుకొండ సమీపాన స్మార్తసమన్వయ శివకేశవుల దేవాలయాలు 32 ప్రాకారాలు గల చోళ సముద్రం లేపాక్షి శిల్ప, చిత్ర, సంగీత, నాట్య కళల విశిష్ఠ దేవాలయము విరుపన్న నాయకుని సోదరుడు విరుపన్న చేత అచ్యుత దేవరాయలు నిర్మింపజేశాడు. అచ్యుతాపురము, తల్లి ఓ బుళాపురము, తమ్ముడు శ్రీరంగనాయకులు పేరున ఉక్కడం శ్రీరంగాపురం నిర్మించారు.

శ్రీకృష్ణ దేవరాయలు యింటి పేరు సంపెటవారు అని పెద్దన వల్ల తెలుస్తోంది. పెద్దన గారి చాటువు- ''సంపెట నరపాల సార్వభౌముడు''

రాయరావుతుగండ రాచయేనుగు వచ్చి- యార్లకోట గోరాడునాడు- ''సంపెట నరపాల సార్వభౌముడు'' వచ్చి సింహాద్రి జయశిల జేర్చునాడు.

సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణా చార్యులు- మా పెనుకొండ గ్రంథము- పేజీ నెం.59.

పొరపాట్లు చరిత్రలో అనేకం జరుగుతుంటాయి. ''రాయల సీమలో ఒక వింత అలవాటుంది. వంశం పేరు వేరుగా ఉంటుంది. రాయలవంశం తుళువంశం వారి యింటి పేరు సంపెట వారు. నేటికీ అనంతపురం జిల్లాలో సంపెట అని యింటిపేరు గల బలిజలు చాలామంది ఉన్నారు. పెనుకొండలో అనేక యుద్ధాలు జరిగాయి. విజయనగర ప్రారంభదినాల్లో పెనుకొండ ప్రధాననగరము. తర్వాత రాజధానిగా మారింది. పెనుకొండ శాపం వల్ల శిలగా మారిన ఒక అప్సరస.

అల్లసాని పెద్దన మనుచరిత్రలో చంద్రవంశపు యయాతి రాజు కుమారుడు తుర్వసుని కీర్తి స్ఫూర్తి వలన రాజవంశము పేరు తుళువాన్వయ మైయ్యిందని (పద్యము 21-22 యందు) వివరించారు. తెలుగు వ్యాకరణం ప్రకారము ''ర'' ''ళ''గా వ్యవహరింపబడి తుర్వసులు-తుళువసులుగా మారింది.

కర్ణాటకము భాషాపదము కాదు. విశాల దక్షిణాపథములో ఒక భాగం, ఒక రాగం, ఒక కర్నాటక సంగీతం. విజయనగర సామ్రాజ్యము దక్షిణాపథ సామ్రాజ్యము. కన్యాకుమారి నుండి కటకము వరకు గల రాయల సామ్రాజ్యము రాయలసీమ.

విజయనగరము పంపానగరమని, అనాది నుండీ పేరుగల తెలుగు తల్లి పార్వతీ పరమేశ్వురుల పుణ్యస్థలము. తెలుగువారు ఆదిశివగణము నాగులయక్షుల ప్రతిబింబాలు. అందరూ నేడు చాళుక్యుల ప్రాంతము హిరణ్యరాష్ట్రమని అంగీకరిస్తున్నారు. చాళుక్య నందరాజు వారసుడు విజయద్వజుడు క్రీ.శ.1150లో విజయనగరము నిర్మించినారు. ఆ పుణ్యఫలము చేత చాళుక్యుల వారసుడు ఆరవీటి సోమదేవ రాజు కుంజరకోన (ఆనెగొంది)లో మాలిక్‌ నెబిని ఓడించాడు (క్రీ.శ.1334). ఆనెగొంది స్వాధీనం చేసుకొన్నాడు. ఆర్వీటి పిన్నమరాజు, రాఘవుడు కంపిలి రాయలను ఓడించారు. ఆనాడే తెలుగు తేజము కాకతీయుల రాజ్యం శంఖం పూరించి ''తేషాం శిరోభూషణమేవ దేశ త్రిలింగ నామా జగదేక సీమా'' అని తెలుగువారి యందు ఏకతా భావం కలిగించారు. విశాల విజయనగర సామ్రాజ్యానికి తెలుగు రాజులు పునాదులు వేశారు. ముస్లిములు ఆనాడే విభజించి పాలించే విధానాలు ప్రారంభించారు. హరహరరాయులు, బుక్కరాయలు తెలుగువారు కాకతీయుల బంధువులు. విధివశాన ముస్లిము రాజుల చేతిలో బందీలైనారు. ముస్లిము సుల్తాన్‌ పంటపండింది. ముస్లింల సైన్యసహకారంతో ఆనెగొంది, కంపిలి ప్రాంతాల స్వాధీనానికి సహకరించినారు. ప్రారంభంలో హరిహరరాయలు, బుక్కరాయలు ఆరవీటి వారిని వీరబల్లాలుని ఎదురించలేక గుత్తి, పెనుకొండ ప్రాంతాలలో మొదట స్థావరాలు ఏర్పరచుకొని క్రమంగా ఆనెగొంది స్వాధీనపరచుకొన్నారు. కావున విజయనగర స్థపనకు ఆదిస్థానం తెలుగు నేల స్మార్తసమన్వయ బ్రాహ్మణ మత విద్యారణ్య స్వామి అండదండలతో విజయనగర సామ్రాజ్యము అభివృద్ధి చెందింది. విద్యారణ్యస్వామి వారు తెలుగువారు. ఆనాటికి ఈనాటికి విజయనగర సామ్రాజ్యము తెలుగువారి సామ్రాజ్యము. విజయనగర సామ్రాజ్యము కుంజరకోన (ఆనెగొంది) పంపానగరము (హంపి) నేడు కన్నడ రాష్ట్రములో వున్నా తెలుగు వారే ఎక్కువగా ఉన్నారు. విజయనగర సామ్రాజ్యములో మొదటి నుండి చివర వరకు తెలుగు, తమిళ, మళయాళ భాషా ప్రాంతాలు 80 శాతము కన్నడ ప్రాంతాలు కేవలము 20 శాతము! కన్నడ ప్రాంత రాజులు ఉమ్మత్తూరు, శ్రీరంగ పట్నం నిరంతరం స్వతంత్రించేవారు.

విజయనగర సామ్రాజ్యము తల, మొండెము, కాళ్లు, చేతులు కంచి, చంద్రగిరి, పెనుకొండ, గుత్తి పంపానగరము విజయనగరము. విజయనగర సామ్రాజ్య స్థాపన కాలము నుండి చివరి వరకు -యువరాజులు లేక కాబోవు విజయనగర రాజులు ఈ ప్రాంతాల రాజప్రతినిధులుగా ఉన్నారు.

శ్రీకృష్ణ దేవరాయలు రెండవ రాజధాని విజయనగరం వలే ఏడు కోటలు గల పెనుకొండ, వేసవి విడిది, వసంతోత్సవాలు స్థావరంగా ఎక్కువ కాలము గడిపేవారు. వ్యాసరాయలు కృష్ణరాయలు ఏకాంతంగా రాజకీయాలు పెనుకొండలో చర్చించుకొనేవారు. నాగలాపురము, నాగసముద్రము గ్రామాలు పెనుకొండ సమీపంలో వున్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు జన్మస్థానమో? విద్యాస్థానమో? రణరంగ విద్యాబుద్ధులు అప్పాజీ, గోవిందరాజులు నేర్పించిన స్థానమో? చారిత్రక పరిశోదనలు అవసరము. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి, రాజకవి, కవిపోషకుడు. భువనవిజయంలో అశువుగా కవిత్వం చెప్పగల మేథావి. యాంధ్రులతో గుడిమాడి జీవనము సల్పియాంధ్రమున గ్రంథరచనము చేసి యాంధ్రకవుల నాదరించి పోషించి యాంధ్రవాజ్ఞయమును పెంపొందించిన తుళువరాజులు ఆంధ్రులనడంలో సందేహం లేదు. -డాక్టర్‌ నేలటూరి వెంకటరమణయ్య.

దేవకి, తిప్పాంబ, నగలాదేవి, ఓబాంబ, తిరుమలమ్మ, వరదరాజమ్మ తెలుగు రాజ పుత్రికలను వివాహమాడిన విజయనగర రాజులు తెలుగువారే.

శ్రీకృష్ణదేవరాయలు శ్రీవేంకటేశ్వరుని నిరంతర భక్తుడు. తిరుమలాంబ, చిన్నాదేవి విగ్రహాలు తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆలయప్రాంగణంలో ఆనాడు కొలువు తీరి వుండేవి. మరి ఈనాడో?

చివరికి మిగిలేది? శ్రీకృష్ణదేవరాయల అమరగాథ తెలుగువారి అందరి కథ. చిటికన వేలు కొనగోటితో దక్షణాపథము సంరక్షించిన తిమ్మరుసు తమ్ముడు గోవిందరాజు స్మృతి చిహ్నాలు పెనుకొండలో నిదిరిస్తున్నవి. ఆ స్మృతి చిహ్నాలను శ్రీకృష్ణదేవరాయలు రాయలసీమ రాజసం, తేజంతో ఉట్టి పడేలా నిర్మించారు. ఆనాడుబానిసలం. తిమ్మరుసు వర్దంతి ఉత్సవాలు సమాధుల వద్ద జరుపలేదు.

నేడు స్వంతంత్రులం. కాని ఈనాడో?