తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ “తెలుగు వెలుగు "ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం..! " తెలుగు " ను కొత్త " వెలుగు " లో ప్రపంచానికి చూపిద్దాం!

Thursday, July 5, 2012

తెలుగు వెలుగులు

తెలుగు జాతికి ఖ్యాతిని తెచ్చిన ఎందరో ప్రతిభావంతులు ఉన్నారు,అన్ని రంగాల్లోను ప్రతిభాముర్తులై వెలిగి జాతికి స్పూర్తిగా నిలిచిన అటువంటి మహనీయుల్లో కొందరి వివరాలను లేశమాత్రంగా తెలుసుకుందాం.


శంకరంబాడి సుందరాచారి : రాష్ట్ర గీతమైన "మా తెలుగు తల్లికి మల్లె పూ దండ" అన్న గేయాన్ని రచించి తెలుగు జాతికి అంకితమిచ్చిన మహాకవి.తిరుపతి వాస్తవ్యులైన వీరికి నిన్న  మొన్నటి దాక దక్కాల్సినంత పేరు దక్కలేదు.ఈ మధ్యనే తిరుపతిలో సుందరాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.


పొట్టి శ్రీరాములు(1901 - 1952) : ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణం చేసిన త్యాగధనుడు.సత్యము,అహింస,హరిజనోద్ధరణ ప్రదానాశయాలుగా గాంధీజీ అడుగుజాడల్లో నడచిన మహనీయుడు.తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరశన వ్రతం చేసి అసువులు బాసారు.తత్ఫలితంగానే నేటి ఆంధ్రప్రదేశ్ అవతరణ.


గిడుగు రామమూర్తి పంతులు(1863 - 1940) : ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషొధ్యమానికి మూలపురుషుడు.బహుభాషా శాస్త్రవేత్త,చరిత్రకారుడు,సంఘసంస్కర్త.గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందరికి అందుబాటులోకి వచ్చింది.పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతిఒక్కరికి వీలైంది.


కందుకూరి వీరేశలింగం(1848 - 1919) : గొప్ప సంఘసంస్కర్త,సాహీతివేత్త.కథ,నవల,వ్యాసం వంటి అనేక తెలుగు సాహిత్యశ్రీకారం చుట్టిన వాడు.స్త్రీ విద్యను,వితంతు వివాహాలను ప్రొత్సహించాడు.వివేకవర్ధిని పత్రికను స్తాపించి సమాజంలో అప్పటికే పేరుకుపోయిన మూఢాచారాలను దురాచారాలను తూర్పార పట్టారు.అధికారవర్గాల్లోని అవినీతిని , అక్రమాలను కలం బలంతో బట్టబయలు చేశారు .

 
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి(19వ శతాబ్దం పూర్వార్థం) : దేశ స్వాతంత్ర్యం కోసం ఆత్మార్పణ చేసిన త్యాగధనుడు.ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి పదేండ్లకు పూర్వమే ఆంగ్లేయుల నిరంకుశ పాలనను ఎదిరించి నిలిచిన ధీరుడు.


గురజాడ అప్పారావు(1862 - 1915) : "దేశమును ప్రేమించుమన్నా" అంటూ దేశభక్తి గీతాన్ని ప్రబోధించిన నవయుగ వైతాళికుడు.భాషా సాహిత్యాలు,కళలు దేశ హితానికి ఉపయోగపడాలని ఆకాంక్షించిన సమాజోద్ధరణాభిలాషి.గురజాడ సృష్టించిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ,కన్యక అనే కావ్యాలు తెలుగు వారి కంటతడి పెట్టిస్తూనే ఆయన కాలం నాటికి సమాజంలో పాతుకుపొయిన మూఢాచారాలపై ధ్వజమెత్తాయి.


రఘుపతివెంకటరత్నం నాయుడు(1862 - 1939) : సంఘసంస్కర్త,బ్రహ్మసమాజ ప్రచారకుడు.ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విధ్యార్థుల్లో రుజువర్తన,నైతిక శీలానికి ప్రాధాన్యమిచ్చినవాడు.మహామహులైన భోగరాజు పట్టాభి సీతారామయ్య,ముట్నూరి కృష్ణారావులు ఈయన శిష్యులే నంటే గురువుగా ఆయన ప్రభావమెంతటిదో అర్థమవుతుంది.


టంగుటూరి ప్రకాశం పంతులు(1872 - 1957) : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.తెలుగు వారి గుండెల్లో ఆంధ్రకేసరిగా ఈయన స్థానం పదిలం.బారిస్టరుగా ప్రాక్టీసు పెట్టి కోట్లు సంపాదించే అవకాశమున్నా గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర్యోద్యమంలో ప్రవేసించాడు.సైమన్ కమిషన్ వచ్చినప్పుడు పోలీసుల తుపాకీ గుండుకు తన గుండెను ఎదురొడ్డి నిలిచి ఆంధ్రజాతి గుండెను గెలుచుకున్నారు.


పింగళి వెంకయ్య(1878 - 1963) : భారత జాతీయ త్రివర్ణ పతాక నిర్మాత.స్వాతంత్ర్యసమరయోధుడు,వ్యవసాయ శాస్త్రవేత్త,గుండె నిండుగా దేశాభిమానమే కాదు,మెదడు నిండుగా విజ్ణానాన్ని ధరించినవాడు.కాంబోడియా పత్తి రకాన్ని పరిశోధించి,పండించి వ్యవసాయ శాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు అనేక బంగారు,వెండి పతకాలను గెలుపొంది రాయల్ ఎగ్రికల్చర్ సొసైటీకి సభ్యుడుగా ఎన్నికయ్యారు.


బండారు అచ్చమాంబ(1874-1905) : స్త్రీ విద్యకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న ఆ రోజుల్లోనే చదువుకోవడమే కాకుండా రచనలు సైతం చేసిన ప్రజ్ఞాశాలి.ఎన్నో గ్రంథాలను శోధించి వెయ్యి సంవత్సరాల స్త్రీల చరిత్రను "అబలా సచ్చరిత్ర రత్నమాల" పేరుతో ఒక్క చేతితో రాశారు.భర్త మాధవరావుతో కలిసి స్త్రీ జనాభ్యుదయానికి పాటుపడ్డారు.స్త్రీ సమాజాలను స్థాపించారు.


డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు(1895 - 1948) : ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త.ఆధునిక వైద్యంలో అనేక అద్భుత ఆవిష్కరణలు చేసిన వ్యక్తి.ముఖ్యంగా బోదకాలు వ్యాధి నివారణకు ఉపయోగించే డై ఈథైల్ కార్బామజీస్ అనే మందును కనుగొన్నారు.1945లో అరియోమైసిస్ అనే యాంటీబయొటిక్ మందును ఆవిష్కరించారు.పాండు రోగ నివారణకు పోలి కాంల,క్షయ రోగానికి పసోనికోటి నికాసిడ్ హైడ్రోజన్ లను కనుగొన్నారు.