తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ “తెలుగు వెలుగు "ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం..! " తెలుగు " ను కొత్త " వెలుగు " లో ప్రపంచానికి చూపిద్దాం!

Friday, November 18, 2011

మనకు తెలియని మన త్యాగరాజు - !




త్యాగరాజు చిత్రపటం
(విలియం జాక్సన్ పుస్తకం నుండి)

తెలుగు భాషా, సంస్కృతీ దేదీప్యమానంగా విరాజిల్లిన విజయనగర సామ్రాజ్యం 17 వ శతాబ్దం మధ్య లో విచ్ఛిన్నమయ్యింది. అరవీడు వంశంలో ఆఖరి రాజు శ్రీరంగంతో విజయ నగర రాజుల పాలన అంతమయ్యింది. అంతవరకూ విజయనగర సామ్రాజ్య పాలకుల ఆధీనంలో ఉన్న మధురై, తంజావూరు, కలాడి, మైసూరు, చిత్రదుర్గ సంస్థానాలు స్వయం పరిపాలిత రాజ్యాలయ్యాయి. సరిగ్గా అప్పుడే దక్షిణాన బ్రిటిషు వారి ఆక్రమణ మెల్ల మెల్లగా మొదలయ్యింది. ఉత్తరాది నుండి ముస్లిం రాజుల దాడులతో రాజ్యాలాన్నీ ముక్కలయిపోయాయి. ప్రజల జీవితాలు కకావికలయ్యాయి. రాజకీయ అస్థిరత ప్రజల్లో భయం రేపింది. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితిల్లో, సుస్థిర ప్రాంతాల వైపు వలసలు మొదలయ్యాయి. దక్షిణాది నున్న రాజ్యాలలో తంజావూరు కాస్త నయంగా ఉండేది. అంతేకాకుండా తంజావూరు రాజులు సాహిత్యాన్నీ, కళల్నీ పోషించండంతో తెలుగునాట పండితులందరూ వలసలు మొదలుపెట్టారు.

తంజావూరు రాజ్యాన్ని 1675 నుండీ మరాఠా రాజులు పాలించారు. తంజావూరుని నాయక రాజులే సింహ భాగం పాలించినా, చివర్లో మరాఠా రాజుల ఆక్రమణతో వారి వశమయ్యింది. తెలుగు, తమిళం తంజావూరు రాజ భాషలు గా చెలామణీ అయ్యేవి. 1758 వ సంవత్సరంలో ఫ్రెంచి వాళ్ళు తంజావూరు పై దండెత్తి, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. 1793 లో బ్రిటీషు వాళ్ళ ఆధీనంలోకి తంజావూరు వచ్చింది. పేరుకు తంజావూరు మరాఠా రాజుల పాలనలో ఉన్నా బ్రిటిషు వాళ్ళ చేతుల్లోనే పరిపాలన జరిగేది. ఒక రకంగా తంజావూరు రాజులు బ్రిటీషు వారి చేతిలో కీలుబొమ్మలు. బ్రిటిషు వారి కనుసన్నల్లో మరాఠా రాజుల వేలిముద్ర పాలన సాగింది. అ ప్పటి వరకూ తమిళ భాష రాజభాషల్లో ఒకటిగా ఉన్నా, మరాఠా రాజులు సంస్కృతానికీ, తెలుగుకే పెద్ద పీట వేసారు. ఈ మరాఠా రాజుల హయాంలో తెలుగు, సంస్కృత భాషలు విలసిల్లాయి. సాహిత్యమూ, లలిత కళలూ విరాజిల్లాయి. ఏ మూల చూసినా ఆ సమయంలో, భారతదేశంలో స్థిరత్వం లేదు. ఒక పక్క బ్రిటీషు వాళ్ళూ, ఫ్రెంచి వాళ్ళూ, మరో పక్క ముస్లిం నవాబులూ, ఇంకోపక్క సామరస్యం లేని హిందూ రాజులూ, ఇలా అనేక మంది ప్రజాజీవనాన్ని నిర్దేశించేవారు. సరిగ్గా అప్పుడే తంజావూరు రాజ్య సంగీత ప్రపంచంలో ఓ మహాద్భుతం జరిగింది. కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ఓ మలుపు తిప్పింది ఓ మహా వ్యక్తి జననం. ఆ మహామనీషి శ్రీ త్యాగరాజు. ఆ మహానుభావుడి పుట్టుక కర్ణాటక శాస్త్రీయ సంగీతానికొక ఒరవడీ, ప్రత్యేకతా తీసుకొచ్చింది.

సంగీతం అంటే కొంచెం తెలుసున్న వారెవరైనా, కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్నీ, త్యాగరాజునీ వేరు చేసి చూడ లేరు. ఎందుకంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఆయన చేసిన అసమానమైన కృషి అలాంటిది. కర్ణాటక సంగీతానికీ, త్యాగరాజుకీ విడదీయరాని బంధం ఉంది. లాగుడు పీకుడు రాగాలతో శాస్త్రీయ సంగీతం అంటే ఆమడ దూరం పరిగెత్తే జనాలకి, అందులో ఉండే మాధుర్యం, మత్తూ చూపించీ, సంగీతం అంటే మరింత ఆసక్తిని కలిగించిన వాడు త్యాగరాజు. ప్రస్తుతమున్న కచేరీ పద్ధతికి ప్రాణం పోసిన వాళ్ళల్లో ఆద్యుడు. సరళమైన భాషలో వినసొంపైన శాస్తీయ సంగీతాన్ని అజరామరం చేసాడు. రామ భక్తుడిగా తనదైన ప్రత్యేకమైన ముద్రతో సంగీతాన్ని భక్తి వాహకంగా వాడుకొన్న వ్యక్తి.

కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి తనవంతుగా అందించిన అనితర సాధ్యమైన సృజనాత్మక కృషిని చూసి, త్యాగరాజుని దేవుడి అవతారంగా మార్చేసారు ఆయన శిష్యులు. ఆయన జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలకి దైవత్వం ఆపాదిస్తూ, భక్తి పురాణ గాధగా త్యాగరాజు జీవిత కథని మార్చేసారు. రాముణ్ణీ ఆయన ఇంటికి పంపించేసారు. ఆయన్ని దేవుని అంశగా తీర్చి దిద్దారు. నేను దేముణ్ణి కాదంటూ, గొంతు చించుకొని ఎంత చెప్పినా వినని భక్తులు, వందేళ్ళ క్రితం నాటి సాయిబాబానీ దేముడి అవతారంగా మలిచి, వీధికో గుడి కట్టి, అభిషేకాలతో, పూజలతో ఊపిరి సలపనివ్వకపోవడం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. ఇంతలా కాకున్నా, త్యాగరాజుకీ సుమారుగా జరిగిందిదే. ఈ ఫక్కీలోనే అనేక రచనలూ, వ్యాసాలూ వచ్చాయి. హరికథలూ, నాటకాలూ, సినిమాలూ తయారయ్యాయి. మనందరికీ తెలుసున్న త్యాగరాజు ఈయనే!

సరిగ్గా చరిత్ర చూస్తే త్యాగరాజు రెండు వందల ఏళ్ళ క్రితం వాడు. అప్పటికే ముస్లిం రాజుల పాలన మొదలయ్యి వందల సంవత్సరాలయ్యింది. బ్రిటిషు వాళ్ళూ, ఫ్రెంచి వాళ్ళూ, డచ్చి వాళ్ళూ, ఇలా ఎందరో భారతదేశంలో పీఠం వేసారు. చరిత్రకారులు ఈ సంఘటనలన్నీ తేదీలతో సహా నిక్షిప్తం చేసారు. ప్రతీ దానికీ ఆధారాలున్నాయి. కాకపోతే ఇందులో త్యాగరాజు జీవితం గురించి ప్రస్తావన మాత్రం అతి తక్కువగా ఉంది. ఆయన కృతులు తప్ప ఆయన గురించి ఎక్కడా ప్రస్తావించ బడలేదు. అవి కూడా త్యాగరాజు శిష్యులు పొందుపరిచినవే! “శ్రీ త్యాగరాజ పరబ్రహ్మణేనమః” అని శ్రీకారంతో మొదలుపెట్టి రాసిన అనేక కృతుల వ్రాత ప్రతులు వీణ కుప్పయ్యర్ అనే శిష్యుడి దగ్గర లభించాయి. ఈ ప్రతులపై 1826 సంవత్సరం అని రాసుంది. అప్పట్లో ఈ వ్రాత ప్రతులు టి. ఎస్ పార్థసారధి అనే విద్వాంసుడి ఆధీనంలో ఉండేవి. ప్రస్తుతం ఇవి తంజావూరు సరస్వతీ మహల్లో ఉన్నాయి. ఈ ప్రతుల్లో కూడా త్యాగరాజు కృతులే ఉన్నాయి తప్ప ఆయన జీవిత విశేషాలు రాసి లేవు.

ఆయన అనుంగు శిష్యులిద్దరు రాసిన రచనల ఆధారంగానే ఆయన జీవిత విశేషాలు తెలిసాయి. త్యాగరాజు చూపించిన అపారమైన సంగీత జ్ఞానానికి ముగ్ధులైన ఆ శిష్యులిద్దరూ స్వతహాగా హరికథకులవడంతో ఆయన్ని దేవుని అంశగా భావిస్తూ రాసారు. అక్కడక్కడి సంగతులు తప్ప క్రమబద్దంగా రాసినవేవీ లేవు. పోనీ త్యాగరాజ వంశీకులెవరైనా ఉన్నారా అంటే అదీ లేదు. ఆయనకొక్కత్తే కూతురు. ఆ కూతురికీ ఒక కొడుకు పుట్టి, అర్థాంతరంగా మరణించాడు. అందువల్ల ఆయన ప్రత్యక్ష వంశీకులెవరూ ఉన్న ఆధారాలు లేవు. ఏవో చిన్నా చితకా ఆధారాలు తప్ప, వివరంగా ఎక్కడా పొందుపర్చిన దాఖలాలు లేవు. ఇది మాత్రం అంతుబట్టని విషయం.

త్యాగరాజు అడిగిన వాళ్ళకి కాదనకుండా సంగీతం నేర్పాడు. ఆయనకి దాదాపు పాతిక మంది పైగా ప్రధాన శిష్యులున్నారన్న ఆధారాలున్నాయి. ఇది మాత్రం విచిత్రమో, యాదృచ్ఛికమో తెలీదు. పైన చెప్పిన ఇద్దరు తప్ప ఎవ్వరూ ఆయన జీవిత చరిత్ర రాయడానికి పూనుకోలేదు. వీరు రాసిన జీవితచరిత్ర ఆధారం తోనే కొత్త కొత్త సంఘటనలూ, విశేషాలూ అతికించబడి అనేక కథలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత చాలా మంది త్యాగరాజు జీవిత చరిత్ర రాసారు. కొన్ని సంఘటనలకీ, విశేషాలకీ ఆధారాలెక్కడవి అనే ప్రశ్న ఉదయించకుండా, అవన్నీ రాముని లీలలుగా అభివర్ణించేసి, ఆయన జీవిత చరిత్రని ప్రజల కందించారు.

1859 వ సంవత్సరంలో మద్రాసు (ప్రస్తుతం చెన్నై) లో సంగీతానికి సంబంధించీ, “సంగీత సర్వార్థ సార సంగ్రహము” అనే ఒక పుస్తకం ప్రచురించారు. అందులో 20 పైగా త్యాగరాజ కృతులు (స్వరాలు లేకుండా) ప్రచురించారు. ఇందులో కూడా త్యాగరాజు పేరు మాత్రం ఉంది కానీ, ఆయన గురించి ఒక్క వాక్యమూ లేదు.

1893 లో చిన్నస్వామి ముదలియార్ అనే క్రిష్టియన్ మతస్థుడు “దక్షిణ భారత సంగీత పరంపర” [South Indian Musical Tradition] అనే గ్రంధ ప్రచురణ నిమిత్తమై, అనేక కర్ణాటక సంగీత కృతులు సమీకరించాడు. త్యాగరాజుకి ముఖ్య శిష్యుల్లో ఒకరైన కృష్ణ స్వామి భాగవతార్ అనే ఆయన సహకారంతో “ఓరియంటల్ మ్యూజిక్ ఇన్ స్టాఫ్ నొటేషన్” [Oriental Music In Staff Notation] గ్రంధం ప్రచురించాడు. అందులో “శాస్త్రీయత మరియు శ్రావ్యత లోనూ, సృజనాత్మకతలోనూ, వెలువడిన పలు త్యాగరాజ కృతులకి సాటి కర్ణాటక సంగీతంలో ఎక్కడా లేదు” (by far the most scientific, charming, voluminous and variegated in all Dravidian Music…) అని ప్రస్తావించబడింది. త్యాగరాజ కృతుల గొప్పదనం వివరించబడింది తప్ప ఆయన జీవిత విశేషాలు మాత్రం ప్రచురించ లేదు.

1896 లో సురేంద్ర మోహన్ టాగూర్ అనే ఆయన “యూనివర్సల్ హిస్టరీ ఆఫ్ మ్యూజిక్” అనే పుస్తకం ప్రచురించాడు. అందులో భారత దేశంలోనున్న 10 మంది అత్యంత ప్రముఖ సంగీత విద్వాంసుల్లో త్యాగరాజు పేరూ ప్రస్తావించబడింది.

“Among the renowned musicians of the present century in Southern India might be named Tigya Raj, who was a native of TiruDi (Tiruvaayoor)…” [ Universal History of Music, 1896, Surendra Mohan Tagore]

వెంకటరమణ భాగవతార్ తెలుగులో రాసిన తాళ పత్ర గ్రంధమే త్యాగరాజ జీవిత చరిత్ర గురించి వచ్చిన మొట్ట మొదటి రచన. కానీ అదీ అసంపూర్తిగానే ఉంది. కొంతవరకూ సాఫీగా సాగిన ఆ రచన మధ్యలో ఆగిపోయింది. కారణాలు ఎవరికీ తెలియవు. ఇది టి.ఎస్.రామారావు గారి సహకారంతో కలసి చేసిన రచన. ఈ రామారావు త్యాగరాజు కి ప్రియ శిష్యుడు. త్యాగరాజు కుటుంబ వ్యవహారాలన్నీ ఈయనే చూసేవాడని చెబుతారు.

ఆ తరువాత కృష్ణ స్వామి భాగవతార్ రాసినది రెండవ రచన. దీనికీ మొదటి రచనే ఆధారంగా కనిపిస్తుంది. ఇందులోనూ కొన్ని సంఘటనలకి రాముని లీలలు అతికించబడినట్లుగా అనిపిస్తుంది. ఈ రెండూ 1900 ముందే వచ్చాయి. 1900 తరువాత వచ్చిన అనేక రచనల్లో పలు విశేషాలూ చొప్పించబడ్డాయి. వాటికి ఆధారాలేమిటన్నది ఎవరికీ తెలియదు.

సంగీతానికి ఇంతగా సేవలు అందించిన తెలుగువాడైన త్యాగరాజు గురించి రాసిన తెలుగు వాళ్ళూ చాలా తక్కువమందే! ఎన్ సి పార్థ సారధి రాసిన రచనలూ, బాలాంత్రపు రజనీకాంత రావు గారి “వాగ్గేయ కారుల జీవిత చరిత్ర” తప్ప, త్యాగరాజు జీవితానికి సంబంధించిన రచనలు అతి తక్కువగా వచ్చాయనే చెప్పచ్చు. ఆయన సంగీతమ్మీదా, కృతుల మీదా విశ్లేషణలు వచ్చాయి. జీవితం గురించి రాసిన పుస్తకాలు తక్కువే. టి.ఎస్.సుందరేశ్వర శర్మ గారి “త్యాగరాజ చరిత్ర” సంస్కృత రచనా, ఇదే పేరుతో తెలుగులో రాసిన వింజమూరి వరాహ నరసింహాచార్యుల రచనా చెప్పుకోదగ్గవి. వీటికీ హరికథా భాగవతార్ల కథే మూలం. కాకపోతే ఎవరికి తగ్గ భక్తి భావం చొప్పించి వారిదైన శైలిలో చూపించారు. మంచాళ జగన్నాధరావు గారి స్వర సంకలనంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు “త్యాగరాజ కీర్తనలు” పేరుతో ఏడు భాగాలుగా ప్రచురించారు. ఇందులో త్యాగరాజ జీవిత చరిత్ర కూడా ఉంది. ప్రత్యేకమైన విశేషాలు లేనప్పటికీ, ఇందులో రాసిందానికీ పైన చెప్పిన హరికథ భాగవ తారల కథే ప్రమాణంగా కనిపిస్తుంది.

త్యాగయ్య సినిమా గురించి అందరికీ తెలుసున్నదే! దానికీ పైన పేర్కొన్న వారి హరికధ పురాణమే ఆధారం. రామ భక్తునిగా త్యాగరాజుని ఆవిష్కరించారే తప్ప, సంగీత పరంగా వాగ్గేయకారునిగా ఆయన జీవితాన్ని చూపలేదు. రామదాసూ, మీరాబాయి, పోతన లాంటి భక్తుల పక్కనే ఈయన్నీ కూర్చో బెట్టారు. తమిళంలోనూ, ఇంగ్లీషులోనే చాలానే పుస్తకాలు వచ్చాయి. రెండో మూడో రచనలు తప్ప మిగతావన్నీ కూడా భక్తి వాహకంగా రాసినవే!

భమిడిపాటి కామేశ్వర రావు గారు “త్యాగరాజ ఆత్మ విచారము” అనే పుస్తకం రాసారు. ఇది మాత్రం పైన చెప్పిన రచనలకి భిన్నంగా ఉంటుంది. త్యాగరాజుని వాగ్గేయ కారుడిగా చూపడానికే ప్రయత్నించారు. పుక్కిట పురాణ కథలు కనిపించవు. తత్వ, అధ్యాత్మిక విశ్లేషణ లతో త్యాగరాజ సంగీతమ్మీదొచ్చిన పుస్తకం ఇదొక్కటే. కాస్త చరిత్రకి దగ్గరగా తెలుగులో వచ్చిన రచన.

“వివాదాత్మక అంశాలపై శ్రద్ధతో కూడిన సమతుల్యత పాటిస్తూ - విజయాలకీ, ఉపద్రవాలకీ ఒక ఉనికిని చూపిస్తూ -విశ్వ చరిత్ర లో సమ సమాజ సారూప్యాన్నీ, భిన్నత్వంలో సంక్లిష్టతనీ చూపించడానికి ప్రయత్నించే వాడే చరిత్రకారుడు” [ William H McNiell – “Mythistory, or Truth, Myth, History and Historians ] అని విలియం మెక్ నీల్ అనే చరిత్రకారుడు చెప్పినట్లుగా, వీలైనన్ని చారిత్రిక ఆధారాలు చూపిస్తూ, ఒక వాగ్గేయకారునిగా త్యాగరాజునీ, ఆయన జీవితాన్నీ అందించాలన్నదే ఈ చిన్న ప్రయత్నం.

గురు దక్షిణ

దక్షిణాదిన ఆధునిక చరిత్ర ప్రారంభమైన తొలి రోజుల్లో, 1767 లో త్యాగరాజు జన్మించాడు. బ్రిటిషు వాళ్ళు మెల్ల మెల్లగా దక్షిణాదిన చొచ్చుకుపోతున్న కాలం అది. యుద్ధాలూ, ఆక్రమణలూ, దోపిడీలూ, భయాలూ, సామాజిక మార్పులూ, సాంస్కృతిక పరిణామాలూ, అన్నీ తలోదారినా ప్రజల మీదొచ్చి పడ్డాయి. 1847 లో త్యాగరాజు పరమపదించే సమయానికే టిప్పు సుల్తాన్ బ్రిటిషు వారి చేతుల్లో పరాజయం పొందాడు. అనిశ్చిత జీవితానికి ప్రజలు అలవాటు పడిపోయారు. తమ కళ్ళముందే ఈ చరిత్ర సాగిపోడం త్యాగరాజూ, ఆయన అనుంగు శిష్యులూ చూసారు.

త్యాగరాజు జీవితం గురించి పూర్తిగా తెలీకపోయినా ఆయన శిష్యుల ద్వారా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఇద్దరు తండ్రీ కొడుకులు ఆయన శిష్యులుగా ఉండేవారు. వాళ్ళిద్దరూ వెంకట రమణ భాగవతార్ (తండ్రి) మరియు కృష్ణ స్వామి భాగవతార్ (కొడుకు). వెంకట రమణ భాగవతార్ 1781 లో జన్మించాడు. త్యాగరాజు తో ఎక్కువ కాలం గడిపిన వాళ్ళల్లో ఆయనొకరు. చివర్లో ఆయన మద్రాసు వాలాజ పేటకి వెళిపోయాడు. ఆయన కొడుకు, కృష్ణ స్వామి, త్యాగరాజు అంత్య దశలో ఆయనతో రెండేళ్ళు పైనే గడిపాడు. వీళ్ళిద్దరూ త్యాగరాజ చరిత్రను రాసారు.

వెంకట రమణ భాగవతార్ రాసిన తాళపత్ర రచనా, కృష్ణ స్వామి భాగవతార్ రాసిన కాగిత ప్రతులూ ఇప్పటికీ మదురై “సౌరాష్ట్ర సభ” లో భద్రంగా ఉన్నాయి. వీళ్ళద్దరూ రాసిన జీవిత విశేషాలూ, మిగతా శిష్యగణం ద్వారా ఆనోటా, ఈనోటా విన్న సంఘటనలూ తప్ప, ప్రత్యేకమైన వివరాలు లభించలేదు. ఏమైతేనేం, ఆ శిష్యులిద్దరూ త్యాగరాజుకి వెలలేని గురుదక్షిణ ఇచ్చారు. ఉన్నంతలో, ఆయన జీవిత చరిత్రని సంగీత ప్రియులకి కానుకగా ఇచ్చారు.

స్వతహాగా వీళ్ళిద్దరూ హరికథ బాగవతార్లవ్వడం వల్ల, త్యాగరాజు జీవితాన్ని ఓ పురాణ గాథగా మలిచి రాసారు. ఆయనకి దైవత్వం ఆపాదించేసారు. ఆయన సంగీత సృజనకీ, రామ భక్తికీ మహత్యాలు అతికించారు. ఓ రామ భక్తుడిగా త్యాగరాజు జీవితాన్ని హరికధలుగా మలిచి చాలా ఊళ్ళల్లో ప్రచారం చేసారు. వాటికి త్యాగరాజందించిన సంగీతం తోడై, ఆ హరికథలు జనరంజకమయ్యాయి. ప్రజల మనసులకత్తుకోడం కోసం ఆయన జీవితంలోకి రాముడి లీలలూ, రక్షణలూ చొప్పించి ఆసక్తి కరంగా మలిచారు. రామ భక్తుడిగా పట్టాభిషేకం చేసేసి, చివరకి ఆయన్ని రాముడిలో లీనం చేసేసారు. ఆయన జీవితాన్ని పౌరాణిక గాధగా తీర్చి దిద్దారు.

త్యాగరాజు జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన సంఘటనలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, వ్యక్తిగా త్యాగరాజు ఎలా జీవించాడూ? అప్పట్లో ఉన్న యుద్ధాలూ, కల్లోలాలపై ఎలా స్పందించాడూ? ఆయన భార్యా, పిల్లలతో ఎలా గడిపాడూ?, శిష్యులకి ఎలా సంగీత బోధన చేసేవాడూ? ఇలా ఎన్నో వివరాలు ముందు తరాలకి అందకుండా పోయాయి. ఇది మాత్రం మన అందరి దురదృష్టం. యాదృచ్చికమో, కాకతాళీయమో తెలీదు. వీళ్ళందించిన కథలే అందరికీ అందాయి. ఇవీ, త్యాగరాజు అందించిన కృతులే - మనకి లభించిన ఆస్తి.

తంజావూరు చరిత్ర

త్యాగరాజు అచ్చమైన తెలుగువాడు. ఆయన సంగీత కృతి రచనలన్నీ తెలుగులోనే ఉన్నాయి. సంస్కృతం చదివినా, ఆయన మాతృ భాష మాత్రం తెలుగే. ఎక్కడో తెలుగు రాజ్యాలకి దూరంగా ఉన్న తంజావూరు రాజ్యంలో, కావేరీ నదీతీరానున్న తిరువైయ్యార్ లాంటి చిన్న ఊళ్ళో తెలుగు సౌరభాలు ఎలా పూసాయి? చుట్టూ తమిళ రాజ్యాలూ, ముస్లిం రాజ్యాలూ, ఫ్రెంచి, డచ్చి, ఆంగ్లేయుల రాజకీయ ప్రాబల్యాలూ అధికంగా ఉన్న తంజావూరులో ఓ తెలుగు వ్యక్తి ప్రభావం అంత గొప్పగా ఎలా ఉందీ? కారణాలు ఏవిటీ? ఈ వివరాలు తెలియాలంటే ముందుగా తంజావూరు రాజ్య చరిత్ర తెలుసుకోవాలి.

ఆంధ్ర రాజ్యమైన విజయనగర సామ్రాజ్యం 1565 లో ముక్కలయ్యింది. అంతకుముందు దక్షిణాన్నున్న చాలా రాజ్యాలు ముస్లిం రాజుల చేతులనుండి తప్పి విజయనగర రాజుల పాలన కిందకొచ్చాయి. దానికి ముందు ముస్లింలు చోళ రాజ్యలపై దండెత్తి వాటిని ఆక్రమించుకున్నారు. అవి తిరిగి హిందూ రాజుల ఆధీనమయ్యాయి. వాటిలో తంజావూరు, మదురై రాజ్యాలకి తెలుగు వారైన నాయక రాజులు సైన్యాధిపతులుగా ఉండేవారు. ఎప్పుడైతే విజయనగరం విరిగిపోయిందో అప్పుడే వీళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి కల రాజులుగా ప్రకటించుకున్నారు. ఆ విధంగా మధురై, తంజావూరు నాయక రాజుల పాలన కిందకొచ్చాయి.

తమిళం ప్రాథమిక జన జీవన భాషగా ఉన్నా, వీళ్ళు మాత్రం తెలుగు సంస్కృతి నే పోషించారు. తెలుగు భాషకి పట్టం కట్టారు. దాంతో ఈ రాజ్యాలకి తెలుగు నాట ఉన్న కవుల, కళాకారుల వలస మొదలయ్యింది.

తంజావూరిని అచ్యుతప్ప నాయకుడు 1565 నుండి 1614 వరకూ పాలించాడు. అతని తరువాత అతని కొడుకు, రఘునాధ నాయకుడుకి రాజ్యాధికారం వచ్చింది. ఇతను సాహితీ పిపాసీ, సంగీత ప్రియుడూ! ఇతని కాలంలో సంగీత సాహిత్యాలు ఓ వెలుగు వెలిగాయి. ముస్లిములతోనూ, ఫ్రెంచి వాళ్ళతోనూ, పొరుగున్న మధురై నాయక రాజులతోనూ తరచు యుద్ధాలు చేసినా, సంస్కృతీ, కళల్ని మాత్రం విడిచిపెట్టలేదు. నాటకాలూ, యక్షగానాలూ ఒకటేమిటి అని కళలూ విలసిల్లాయి. మామూలుగానే మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే మధుర నాయకులకీ, తంజావూరు నాయకులకీ 1673 లో అతి పెద్ద యుద్ధం జరిగింది. తంజావూరు తెలుగు నాయకులు ఓడిపోయారు. రాజ వంశీకులందరూ మరణించారు.

మధుర నాయకుల సమీప బంధువైన అళిగిరి తంజావూరు రాజయ్యాడు.

రాఘవ నాయకుడి వంశం మొత్తం పోయినా, అతని మనవడు చెంగమలదాసనే నాలుగేళ్ళ పిల్లాడు బ్రతికి బట్టకట్టాడు. వాణ్ణి ఓ దాసి రక్షించి రహస్యంగా నాగపట్ట ణం చేర్చింది. ఈ పిల్లాణ్ణి ఎలగైనా రాజ సింహాసనం ఎక్కించాలని, రాయసం వెంకన్న అనే ఉద్యోగి శత విధాలా ప్రయత్నించాడు. బీజాపూరు రాజైన ఆదిల్షాని శరణు వేడి, ఎలాగైనా ఈ తెలుగు బిడ్డని తంజావూరు గద్దెక్కించమని కోరాడు. ఆదిల్షా ఈ పనిని శాహాజీ అనే ఓ వజీరు కప్పగించాడు. ఈ శాహాజీ ఎవరో కాదు, ఛత్రపతి శివాజీ తండ్రే! శివాజీకీ ఏకోజీ అనే సవతి తమ్ముడున్నాడు. శాహాజీ ఈ పనిని ఏకోజీకి పురమాయించాడు. ఏకోజీ అళిగిరిని ఓడించి, చెంగమలదాసుని రాజు చేసాడు. అనూహ్య రాజకీయ పరిణామాలనంతరం, మరాఠీ వాడైన ఏకోజీ తంజావూరు గద్దెక్కి, తమిళనాట తెలుగు రాజ్యానికి రాజయ్యాడు.

ఈ విధంగా తంజావూరు మరాఠీ రాజుల పాలన కిందకొచ్చింది. పేరుకి మరాఠీ వాడయినా, ఏకోజీ సాంస్కృతిక జీవనాన్ని మార్చడానికి ప్రయత్నించలేదు. పూర్వపు రాజుల్లా తెలుగు సాహిత్యాన్నీ, సంగీతాన్ని ఎక్కువగానే పోషించాడు. ఏకోజీ తరువాత అతని పెద్ద కొడుకు రెండవ శాహాజీ గద్దెక్కాడు. తండ్రిలాగే ఇతనూ కళల్నీ, సాహిత్యాన్నీ పోషించాడు. చనిపోయే వరకూ శాహాజీ సాంస్కృతిక రక్షణ, సాహిత్య పోషణ వదల్లేదు. ఇతని కాలంలో లెక్కలేనంత తెలుగు సాహిత్యం వచ్చింది. రెండవ శాహాజీ తరువాత తుక్కోజీ, అతని తరువాత అతని కొడుకు ప్రతాప్ సింగ్ పాలించారు. ఇతని తరువాత తుల్జాజీ II తంజావూరిని దాదాపు రెండు దశాబ్దాలు పాలించాడు. తుల్జాజీ అప్రయోజకత్వం వల్ల, మైసూరు రాజు హైదరాలీ చేతిలో పావయ్యాడు. 1749 నాటికే వ్యాపారం పేరుతో వచ్చిన బ్రిటీషు వాళ్ళు, ఎలా తంజావూరుని కబళించాలా అని శత విధాలా ప్రయత్నించారు. అంతకు ముందొక సారి ప్రతాప్ సింగ్ పై పొరుగునున్న పుదుకొట్టయి రాజు దేవకొట్టయిని యుద్ధానికి ఉసిగొల్పినా, ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తరువాత మొగల్ నవాబులతోటీ, ఆర్కాట్ రాజులతోటీ చేతులు కలిపి మెల్ల మెల్లగా తంజావూరు పై పట్టు సాధించారు. 1780 నుండి 1800 కాలంలో తంజావూరిపై బ్రిటీషు వారి ఆధిపత్యం పెరిగింది. తుల్జాజీ-II కొడుకు శరభోజి-II, బ్రిటీషు వారి చెప్పు చేతల్లో నడుస్తూ తంజావూరికి నామ మాత్రపు రాజులా మిగిలాడు. ఆ తరువాత హైదరాలీ కొడుకు, టిప్పు సుల్తాన్, బ్రిటీష్ వాళ్ళ చేతిలో ఓడి పోడంతో తంజావూరు చుట్టుపక్కల రాజ్యాలన్నీ పోయి, ఇంగ్లీషు దొరల పాలన మొదలయ్యింది.

ఈ శరభోజి-II కాలంలోనే త్యాగరాజు తిరువైయ్యార్లో ఉన్నాడు. బ్రిటీషు వాళ్ళ ఆక్రమణ ముందూ, వెనుకా ప్రతీ సంఘటనకీ చారిత్రిక ఆధారాలున్నాయి. ప్రతీదీ లిఖిత పూర్వకంగా నమోదు చేయ బడింది. కాకపోతే, అందులో త్యాగరాజు పేరు మాత్రం “దక్షిణాదినున్న సంగీత వాగ్గేయకార సాధువుగా” ఒక్కసారి ప్రస్తావించ బడిందంతే!

త్యాగరాజు జననం - ఆయన పూర్వీకులు

త్యాగరాజు సర్వజిత్ నామ సంవత్సరంలో పుష్యమీ నక్షత్రాన, చైత్ర శుక్ల సప్తమి నాడు (మే 4, 1767) తిరువారూర్ లో జన్మించాడు (ఈ పుట్టిన తేదీ,సంవత్సరమూ తప్పనీ, త్యాగరాజు 1759 లో పుట్టాడనీ ఒక వర్గీయుల వాదన ఉంది. దీనికి తగినంత ఆధారం లేదు). ఇతని తండ్రి కాకర్ల (భరద్వాజ గోత్రం) రామబ్రహ్మం, తల్లి సీతమ్మ. వీళ్ళు స్మార్త వైదీక బ్రాహ్మణులు. (స్మార్తులంటే ఎవరో కాదు. శంకరాచార్య ప్రబోధించిన అద్వైతాన్ననుసరించే వాళ్ళు. వీరు శైవులూ కాదు, వైష్ణవులూ కాదు. స్మార్తులు ఇటు శివుణ్ణీ కొలుస్తారు, అటు విష్ణువునీ పూజిస్తారు). తంజావూరు రాజులు శైవ మతస్థులయినా అటు శైవాన్నీ, ఇటు వైష్ణవాన్నీ సమానంగా ఆదరించారు. వారికి రామాయణ, భారతాలు అత్యంత ప్రీతి. వైష్ణవ మతం ఉన్నా, మదురై, తంజావూరు చుట్టు పక్కల శైవ మతమే ఎక్కువగా ఉండేది. 1600 కాలంలో త్యాగరాజు పూర్వీకులు రాయల సీమలోని కర్నూలు నుండి తంజావూరు వలస వచ్చినట్లు చెప్పబడింది.

రామబ్రహ్మానికి ముగ్గురు కొడుకులు. పంచనద బ్రహ్మం, పంచాపకేశ బ్రహ్మం మొదటిద్దరూ. త్యాగరాజు మూడోవాడు.

రామబ్రహ్మం రామాయణ,భారత, భాగవతాలు బాగా అధ్యయనం చేసాడు. సంస్కృతాన్ని అభ్యసించాడు. అప్పట్లో తంజావూరు రాజైన తుల్జాజీ కొలువులో రామాయణం పఠనమూ, వ్యాఖ్యానమూ చేసేవాడు. ఇదే అతని జీవన భృతి. త్యాగరాజు తిరువారూర్ లో జన్మించాడు. కొంతకాలం తరువాత రామబ్రహ్మం తిరువైయ్యారు కి మారాడు. ఈ మార్పుకీ కారణాలు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా రాసారు.

“త్యాగరాజు అన్నలిద్దరూ (పంచనద బ్రహ్మం, పంచాపకేశ బ్రహ్మం) అల్లరి చిల్లరి పనులతో రామ బ్రహ్మానికి తిరువారూర్ లో తలవంపు తెచ్చేవారు. ఇద్దరికీ సరైన ప్రవర్తన లేదు. ఓ సారి రామబ్రహ్మం తన ముగ్గురు కొడుకులతోనూ కాశీ యాత్రకి బయల్దేరాడు. మధ్యలో అతనికొక కల వచ్చింది. అందులో తిరువారూర్ దైవం త్యాగరాజ స్వామి (నటరాజ రూపంలో నున్న శివుడు) కనిపించి, కాశీ ప్రయాణం రద్దు చేసుకోమనీ, తిరువైయ్యారు వెళ్ళి శైవ దర్శనం చేసుకోమనీ, ఆ తరువాత అక్కడే శేష జీవితం గడపమనీ చెప్పాడు. ఈ కలని మహారాజు తుల్జాజీకి చెప్పడంతో, ఆయన రామబ్రహ్మం ఉండడానికో ఇల్లూ, ఆరెకరాల పొలం ఇచ్చినట్లుగా” వెంకట రమణ భాగవతార్ రాసారు.

ఎం.ఎస్.రామస్వామి అయ్యర్ అనే విద్వాంసుడు ఇదే ఇంకో విధంగా జరిగి ఉండవచ్చని అభిప్రాయ పడ్డారు.

“కావేరీ నదీ తీరాన ఉన్న తిరువైయ్యార్ సంస్కృత విద్యా పీఠ క్షేత్రం. తంజావూరు రాజుల పోషణలో అక్కడి సంస్కృత విద్యాలయాలు ప్రసిద్ధి చెందాయి. ఎక్కడెక్కడినుండో వచ్చి అక్కడ విద్యా భ్యాసం చేసేవారు. చిన్న తనం నుండీ సంస్కృతం నేర్చుకోవడంలో త్యాగరాజు కనబర్చిన ఆసక్తి చూసి, మంచి చదువుకోసం రామబ్రహ్మం తిరువైయ్యార్ మకాం మార్చి ఉండ వచ్చుననీ” అభిప్రాయ పడ్డారు. ఇదే విషయాన్ని “త్యాగరాజు” అనే పుస్తకంలో రాసారు.

తుల్జాజీ రామబ్రహ్మానికి బహుమానంగా ఇచ్చిన ఇంట్లోనే త్యాగరాజు నివసించాడు. అక్కడే ఆయన జీవితం పూర్తిగా గడిచింది. తిరువైయ్యార్ లో తిరుమంజన వీధిలో ఇదే ఇల్లు ఇప్పటికీ ఉంది.

త్యాగరాజుకి తల్లితండ్రులు పెట్టిన పేరు త్యాగబ్రహ్మం. అది ఎలా త్యాగరాజు గా మారిందో తెలీదు. తిరువైయ్యారు దైవం త్యాగరాజ లింగేశ్వరుడు కావడంతో అలా పిలిచేవారో, లేక తాత గిరిరాజు పేరులో చివరి పదాన్ని త్యాగ బ్రహ్మం మధ్యలో తగిలించారో తెలీదు.

త్యాగరాజు తల్లి పేరు సీతమ్మ. ఈవిడ పేరు సీతమ్మ కాదనీ, శాంతమ్మనీ ఒక వివాదం ఉంది. త్యాగరాజు జీవిత చరిత్ర రాసిన వాళ్ళలో “నరసింహ టి భాగవతార్” అనే ఆయన “త్యాగరాజు తల్లి శాంతమ్మ” అని రాసారు. మిగతా వాళ్ళంతా సీతమ్మ అనే రాసారు. చాలా మంది సీతమ్మే సరైనదని నిర్థారించేసారు. దానికొక బలమైన కారణాన్ని కూడా చూపించారు. కారణం అనే కంటే కృతి అనడం మంచిది. “సీతమ్మ మాయమ్మ, శ్రీ రాముడు మాకు తండ్రి” అనే కృతిలో అన్యాపదేశంగా తల్లి తండ్రులనే త్యాగరాజు స్మరించాడు అంటూ వ్యాఖ్యానించారు.

సీతమ్మకి సంగీతంలో ప్రావీణ్యం ఉంది. మంచి గాయని కూడా. త్యాగరాజు చిన్నప్పటినుండే తల్లి వద్ద రామదాసు కీర్తనలూ, పురందరదాసు కీర్తనలూ అభ్యసించాడు. సీతమ్మ రామ భక్తురాలు అవడంతో “రామ భక్తి” బీజాన్ని చిన్నప్పుడే త్యాగరాజులో నాటింది.

తిరువైయ్యార్ సంస్కృత పాఠశాలలోనే త్యాగరాజు మొట్ట మొదట “రామాయణాన్ని” అభ్యసించాడని “వింజమూరి వరాహ నరసింహాచార్యులు” “త్యాగరాజ స్వామి చరిత్ర” లో ప్రస్తావించారు. త్యాగరాజు బాల్య విశేషాలు తెలుసుకునే ముందు ఆయన పూర్వీకులు గురించి చూద్దాం.

గిరిరాజ బ్రహ్మం (తండ్రి వైపు తాత)

రామబ్రహ్మం తండ్రి పేరు గిరిరాజ బ్రహ్మం. ఈయన కవీ, సంగీత విద్వాంసుడూ, సంస్కృత పండితుడూ. ఈయన దగ్గరే మొదట త్యాగరాజు సంగీతం నేర్చుకున్నట్లుగా ఉంది.

త్యాగరాజు తాతగారైన ఈ గిరిరాజ బ్రహ్మం గారి కుటుంబ వరసల మీద కూడా విభిన్న అభిప్రాయాలూ, వివాదాలూ వచ్చాయి. ఈ గిరిరాజ బ్రహ్మం త్యాగరాజు తల్లి సీతమ్మ గారి తండ్రి అనీ అందరూ అనుకున్నారు. అనుకోవడమే కాదు 1900 తరువాత త్యాగరాజు పై వచ్చిన ప్రతీ పుస్తకంలోనూ ఇలాగే ప్రస్తావించారు. దీనికి ఓ చక్కటి ఆధారం కూడా చూపారు. “గిరి రాజ సుత తనయ” అని ఒక ప్రసిద్ధమైన త్యాగరాజ కృతి ఉంది. ఇది తన తాత గారి గురించే త్యాగరాజు రాసారని కొందరి అభిప్రాయం. “గిరి రాజు” అంటే తాతగారి పేరు, సుత అంటే కుమార్తె (సీతమ్మ ఇక్కడ), తనయ అంటే ఆ సీతమ్మ కొడుకు. ఆ కొడుకెవరో కాదు త్యాగరాజేనని భాష్యం చెప్పారు. దీన్ని ఆధారం చేసుకొనే చాలా మంది రచనలు రాసారు. కానీ వాస్తవానికి గిరిరాజ సుత తనయ అంటే “గిరి రాజ సుత” అంటే గిరిరాజు కుమార్తె పార్వతనీ, తనయ అంటే పార్వతి కొడుకనీ (విఘ్నేశ్వరుడు) చెప్పుకోవాలి. అంటే గిరి రాజ సుత తనయ” కృతి వినాయకుడి మీద అని అర్థం చేసుకోవాలి కానీ, తాతగారి మీద త్యాగరాజు రాసిన కృతిగా భావించకూడదు. ఎందుకంటే సీతమ్మ గిరిరాజు కోడలు. కూతురు కాదు. ఇది గిరిరాజ కవి మీదొచ్చిన మొదటి వివాదం.

ఇది కాక ఇంకో అతి పెద్ద వివాదం ఉంది. దానిపై విజ్ఞులూ, పండితులూ అందరూ తప్పుగా అభిప్రాయ పడి చరిత్రని తప్పుగా నిర్ధారించేసారు.

1683 నుండి 1712 వరకూ తంజావూరిని పాలించిన శాహాజీ కొలువులో అనేక మంది తెలుగు కవులుండేవారు. శాహాజీ హయాంలో అనేక తెలుగు గ్రంధాలూ, కావ్యాలూ, నాటకాలూ, యక్షగాన రచనలూ వచ్చాయి. శాహాజీ చుట్టూ చాలా మంది తెలుగు కవులుండే వారు. వందలకు పైగా గ్రంధాలు రాసారు. ఆ కవుల్లో దర్భా సోదరుల్లో ఒకరైన గిరిరాజ కవనే ఒకాయన ఉండేవాడు. ఈయన అనేక ప్రసిద్ధమైన నాటకాలు రాసాడు.. పద్య కావ్యాలు రాయనప్పటికీ, లీలావతీ కళ్యాణం అనే నాటకంలో అనేక పద్య వృత్తాలూ, జాతులూ, ఉప జాతులూ వాడాడు. శ్రావ్యమైన పదాలు వాడాడు. ఈయన రచించిన పదాలలోని సంగీత శైలీ, కూర్పూ త్యాగరాజ కృతుల్లో ఉన్న శైలికీ, కూర్పుకీ సారూప్యం ఉందని విజ్ఞులు భావిం చారు. ఈ గిరిరాజ కవే త్యాగరాజు తాత గారని సంగీత పరిశోధకులు పొరబడ్డారు.

ఈ విషయాన్ని “ఆంధ్ర వాగ్గేయ కార చరిత్ర” అనే పుస్తకంలో బాలాంత్రపు రజనీకాంత రావు గారు ధృవీకరిస్తూ రాసారు. ఆయనే కాదు, ఇంకా కొంతమంది తమిళ రచయితలూ ఇలాగే అభిప్రాయ పడ్డారు. “ది స్పిరిట్యువల్ హెరిటేజ్ ఆఫ్ త్యాగరాజ ” అనే పుస్తకంలోనూ ఇదే విధంగా పొరబడి, గ్రంధస్తం చేసేసారు కూడా.

ఈ పుస్తకాలన్నీ 1950 కాలంలో వచ్చాయి. ఆ తరువాత కాలంలో వచ్చిన “సమగ్రాంధ్ర చరిత్ర” లో ఆరుద్ర ఈ విషయాన్ని ఖండిస్తూ ఈ అభిప్రాయం తప్పనీ, రజనీకాంత రావు గారు పొరబడ్డారనీ రాసారు. సమగ్రాంధ్ర చరిత్రలో ఆరుద్ర గారు ఈ విషయాన్ని ఇలా ప్రస్తావించారు.

” ఆంధ్ర వాగ్గేయ కారులలోనే కాక కర్ణాటక సంగీత మూర్తిత్రయంలోనూ త్యాగరాజ స్వామి సుప్రసిద్ధుడు. వారి తాత గారి పేరు గిరిరాజ బ్రహ్మం. ఆయన కూడా తంజావూరులో ఉండేవాడు. ఈ సామ్యాల వల్ల శాహాజీ ఆస్థానంలో ఉండే గిరి రాజే సాక్షాత్తూ త్యాగరాజస్వామి తాతగారని సంగీత పరిశోధకులు పొరబడ్డారు. ఈ అభిప్రాయాలను విశ్వసించి బాలాంత్రపు రజనీ కాంత రావు గారు గ్రంధస్థం చేసారు. యండమూరి సత్యనారాయణ రావు గారు ఈ పొరపాటును కూడా స్వీకరించారు.

వాస్తవానికి శాహాజీ కొలువులోని గిరి రాజూ, త్యాగరాజు తాతగారైన గిరి రాజూ విభిన్నులు. ఇంటిపేరూ, గోత్రాలూ వేరు వేరు. గిరిరాజ కవి ఇంటి పేరు దర్భావారు; త్యాగరాజ స్వామి ఇంటి పేరు కాకర్ల వారు. దర్భావారు లోహిత గోత్రీకులు, కాకర్ల వారు భారద్వాజస గోత్రీకులు. “

ఈ విధంగా చెబుతూ శాహాజీ కొలువులోని గిరిరాజుకూ, త్యాగరాజు తాతగారికీ సంబంధం లేదని నిరూపించవచ్చని రాసారు. గోత్రాధారాలే ఇచ్చారు తప్ప, రూఢిగా నిరూపించలేదు. ఇంతకుమించి అధారాలు చూపలేదు. పై కారణాలు చూపిస్తూ, గిరిరాజు రచించిన పదాలలోని సంగీత శైలీ, కూర్పూ త్యాగరాజ స్వామి కీర్తనలలో కూడా కనిపించడానికి తాత మనుమళ్ళ వరసే కారణం అని మిత్రులు రజనీ కాంతరావు గారు భావించారంటూ ఆరుద్ర రాసారు. కేవలం రచనల్లో పోలికలుండడం యాదృచ్చికం అంటూ ముగించారు. ఇంతకు మించి ముందుకు వెళ్ళలేదు.

రజనీ కాంత రావు గారిలాగే అనేకమంది సంగీత కారులు భావించారు. వి. రాఘవన్ మరియు పి. సాంబ మూర్తి గార్లు త్యాగరాజ చరిత్ర మీద రాసిన పుస్తకాల్లో (The Great Composers Vol I & II) ఇలాగే రాసారు.

కానీ, డా. ఎస్. సీత (Tanjore as a Seat of Music during the 17th, 18th, and 19th Centuries - S. Seetha - Oxford Music Journal) అనే మరో సంగీత పరిశోధకురాలు మాత్రం ఖచ్చితమైన ఆధారాలు చూపిస్తూ, సాంబమూర్తి, రాఘవన్ల అభిప్రాయాలు తప్పని నిరూపించారు. ఆరుద్ర లాగ ఇంటి పేరూ, గోత్రాలని పట్టించుకోకుండా, వారి వారి వంశ చరిత్రల ఆధారాన్ని చూపారు. గిరిరాజ కవి రాసిన రచనల్లోంచి అతని వంశ చరిత్ర అధారం చూపించడమే కాకుండా, వాళ్ళు శైవ మతస్థులనీ రూఢిగా నిరూపించారు. శాహాజీ కొలువులో ఉన్న గిరిరాజ కవి తండ్రి పేరు ఓబులన్న (వీళ్ళు పలనాడు వైపునుండి వలస వచ్చిన శైవ కుటుంబీకులు) అనీ రుజువు చేసి, త్యాగరాజు తాత గారైన గిరిరాజ బ్రహ్మం తండ్రి పేరు పంచనద బ్రహ్మం అనీ, తగినన్ని అధారాలు చూపించారు. గిరిరాజ బ్రహ్మం కొడుకు రామబ్రహ్మం అనీ, ఆయన కొడుకే త్యాగరాజనీ ధృవీకరించారు.

త్యాగరాజు తాతగారైన గిరిరాజ బ్రహ్మం సంస్కృత పండితుడూ, సంగీత శాస్త్రకారుడూనూ. గిరిరాజ బ్రహ్మం తండ్రి పేరు పంచనద బ్రహ్మం. ఆయనకి అయిదుగురు కొడుకులు. వాళ్ళు సదాశివ బ్రహ్మం, సదానంద బ్రహ్మం, సచ్చిదానంద బ్రహ్మం, బాల బ్రహ్మం మరియు గిరిరాజ బ్రహ్మం. అందరిలోకీ చిన్నవాడు గిరిరాజ బ్రహ్మం. గిరిరాజ బ్రహ్మం గురించి తప్ప మిగతా వారి వంశ చరిత్ర ఎవరికీ తెలీదు.

త్యాగరాజు వంశవృక్షం"&~~SPECIAL_REMOVE!#~~gt;

వీణ కాళహస్తయ్య (తల్లి వైపు తాత)

త్యాగరాజు తల్లి వైపు తాత గారి పేరు వీణ కాళహస్తయ్య. ఈయన వైణికుడు. త్యాగరాజు చిన్నతనంలో ఈయన వద్దే వీణ అభ్యసించారని కె కె రామస్వామి భాగవతార్ “ఇంట్రడక్షన్ టు శ్రీ త్యాగబ్రహ్మోపనిషత్” అనే పుస్తకంలో రాసారు. ఈ కె కె రామస్వామి ఎవరో కాదు, త్యాగరాజు అంత్యదశలో ఆయనతో రెండేళ్ళు గడిపిన కృష్ణ స్వామి భాగవతార్ సుపుత్రుడు (వెంకట రమణ భాగవతార్ మనవడు కూడా).

తంజావూరు రాజ్య ఆస్థాన వైణుకులుగా వీణ కాళహస్తయ్య ఉండే వారని మంచాళ జగన్నాధ రావు గారు (త్యాగరాజ కీర్తనలు పుస్తకం లో) రాసారు. కానీ ఈ విషయాన్ని వెంకట రమణ భాగవతార్ కానీ, ఆయన కొడుకు కృష్ణ భాగవతార్ కానీ, మనవడు కె కె రామస్వామి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. వీరేకాదు, తరువాత త్యాగరాజు జీవిత చరిత్ర రాసిన పి. సాంబమూర్తి గారు కూడా ఎక్కడా ఈ సంగతే రాయలేదు(The Great Composers Vol. I & II). కాబట్టి మంచాల జగన్నాధ రావు రాసిన దానికి ఆధారం ఏమిటో స్పష్టంగా తెలీదు. అది ఊహో లేక వాస్తవమో చెప్పలేం.

“నారదీయం” అనే తాళ పత్ర గ్రంధం త్యాగరాజుకి ఈ వీణ కాళహస్తయ్య చనిపోయినతరువాత ఆయన ఇంటిలో లభించిందని వెంకట రమణ భాగవతార్ రాసారు. ఇదే విషయాన్ని ఆయన కొడుకు కృష్ణస్వామి భాగవతార్ రాసినా, ఆయన ప్రస్తావించిన వేరే విషయానికీ దీనికీ పొంతన కుదరదు.

అది -

“త్యాగరాజు తల్లి తాతగారి పేరు గిరిరాజకవి. ఆయన “సంగీత రత్నాకరము” అనే గ్రంధమూ, మతృభుతేస్వర అనే సంగీత విద్వాంసుడి వద్ద తాతగారికి లభించిన “నారదీయం” అనే సంగీత శాస్త్ర గ్రంధమూ, గిరిరాజకవి మరణాంతరం ఇల్లు వెతుకుతుండగా త్యాగరాజుకి దొరికింది”. [14]

పై రెండూ చూస్తే ఏది సరైనదో చెప్పలేం. వీణ కాళ హస్తయ్య తండ్రి పేరూ గిరిరాజకవనీ చెప్పడానికెక్కడా ఆథారం లేదు. పైన రాసింది తప్ప.

గిరిరాజ బ్రహ్మం కొడుకు రామ బ్రహ్మం. ఆయన కొడుకే త్యాగరాజు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఒకే పేరు ఇద్దరు వ్యక్తులకి ఉండే ఆస్కారం ఉంది. కానీ ఇంత కాకతాళీయంగా ఉండడం నమ్మశక్యం కాదు. కాబట్టి కృష్ణస్వామి భాగవతార్ రాసిన దాంట్లో ఎంత కల్పితమో, ఎంత వాస్తవమో తెలీదు.

కానీ భాగవతార్ తండ్రీ కొడుకులిద్దరూ త్యాగరాజుతో కొంత కాలం గడిపారు. వెంకట రమణ భాగవతార్ చాలా కాలం త్యాగరాజు వద్ద సంగీతం నేర్చుకోడంవల్ల, తండ్రే ఎక్కువ కాలం గడిపాడనడానికి సందేహం లేదు. ఆయన చెప్పిన విషయాలే వాస్తవానికి దగ్గరగా ఉండే ఆస్కారం ఉంది.

ఇలా అక్కడక్కడ లభించిన సమాచారామే తప్ప, సరైన, స్పష్టమైన వివరాలు అంద లేదు. ఎవరికి తోచిందీ, విన్నదీ రాసేసారు.

పైన పేర్కొన్న విషయాలు పొందు పరిచిన పుస్తక ప్రతులు అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల కూడా కొన్ని కథలు పుక్కిట పురాణాల్లా పుట్టుకొచ్చాయి. ఈ ప్రతులు మదురై గ్రంధాలయంలో ఇప్పటికీ ఉన్నాయి. 1990 తరువాత మరలా కొన్ని పుస్తకాలు ప్రచురించారు.

“నారదీయం” అనే తాళ పత్ర గ్రంధ ప్రస్తావనలో తప్ప వీణ కాళహస్తయ్య పేరు ఎక్కడా ఎవరూ రాయలేదు. త్యాగరాజ కృతుల్లో కూడా ఈయన పేరు కనిపించదు.

త్యాగరాజు బాల్యం

చిన్నప్పట్నుండీ త్యాగరాజుకి సంగీతం అంటే ఇష్టం. వీణ కాళ హస్తయ్య దగ్గర వీణా, తల్లి దగ్గరా గాత్రమూ అభ్యసించాడు. అతి పిన్న వయసులోనే సంగీతంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు. తల్లి పాలు తాగేటప్పుడే సంగీతం వినిపిస్తే చాలు, తాగడం ఆపేసి, ఎంతో శ్రద్ధగా చెవులిక్కించి వినేవాడన్న ఈ విషయాన్ని, త్యాగరాజు జీవిత చరిత్ర రాసినందరూ (దాదాపు) మరింత అతిశయోక్తిగా చెప్పారు. సంగీత శబ్ద జ్ఞానానికి నెలలు పిల్లాడిగా ఉన్నప్పుడే అతివేగంగా స్పందించేవాడని చెప్పారు. ఇలాంటి విషయాలు తల్లి తండ్రులూ, బంధువుల ద్వారానే ఇతరులకి తెలిసే అవకాశం ఎక్కువ. త్యాగరాజు అసమాన్య ప్రతిభ చూసి అందరూ పొగుడుతుంటే తల్లితండ్రులే చెప్పుండచ్చు. ఇలాంటి విషయాలికెవరూ ఆధారం చూపలేరు. కాబట్టి అవుననుకొని ఒప్పుకోడానికి ఎవరికీ అభ్యంతరముండదు. ఈ విషయాన్ని కృష్ణ స్వామి భాగవతార్ రాసారు కానీ, ఆయన తండ్రి వెంకటరమణ భాగవతార్ ఎక్కడా ప్రస్తావించలేదు. తండ్రీకొడుకులిద్దరూ త్యాగరాజుతో గడిపారు కనుక ఇద్దరు రాసిందీ వాస్తవానికి దగ్గరగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇలాంటిదే ఇంకో విశేషం కూడా ఉంది. త్యాగరాజు చిన్నతనంలో ఒకసారి విపరీతమైన అనారోగ్యానికి గురయ్యాడట. ఓ సాధు పుంగవుడొచ్చి ఆశీర్వదించాక ఆరోగ్యం కుదట పడిందని రాసారు. ఆ తరువాత తన ముగ్గురు పిల్లల్నీ తీసుకొని రామబ్రహ్మం కాశీయాత్రకి బయల్దేరినప్పుడు, తిరువారూరు త్యాగరాజ స్వామి కలలో కనిపించి, కావేరీ నదీతీరానున్న పంచనదీ స్థలవిశేషమైన తిరువైయ్యార్లో శేష జీవితం గడపమని చెప్పాడట. ఈ సంఘటన తరువాతే రామబ్రహం తుల్జాజీ మహారాజుకి తన కలగురించి వివరిస్తే, ఆయన దయతో ఆరెకరాల పొలమూ, ఓ ఇల్లూ ఇచ్చాడని ఉంది. ఈ సంఘటన తిరువారూర్లో ఉండగా జరిగింది. కాబట్టి త్యాగరాజు తిరువైయ్యార్ వచ్చాక అంతా సవ్యంగానే సాగిందని చెప్పుకోవాలి. ఇది వెంకట రమణ భాగవతార్ రాసిన తాళ పత్ర గ్రంధంలో ఉంది. కృష్ణ స్వామి భాగవతార్ కూడా ఇలాగే రాసారు.

ఇంతకు ముందు చెప్పినట్లుగా రామబ్రహ్మం తిరువైయ్యార్ మకాం మార్చాక త్యాగరాజు అక్కడున్న సంస్కృత పాఠశాలో విద్యాభ్యాసం చేసాడు. మామూలుగా తోటి పిల్లలతో ఆట పాటల్లో అంతగా గడిపేవాడు కాదు. పేరుకు తగ్గట్లుగా తన దగ్గరున్నవన్నీ స్నేహితులకిచ్చేసేవాడు. త్యాగరాజు చిన్నతనంలోనే అంటే ఎనిమిదో ఏటే ఉపనయనం చేసాడు రామబ్రహ్మం. అప్పుడే రామ తారక మంత్రాన్ని జపించమని త్యాగరాజుకి మంత్రోపదేశం చేశాడని వెంకటరమణ భాగవతార్ రాసాడు. ఆ సమయంలోనే రామబ్రహ్మానికి రామనవమి ఆరాధనోత్సవాల్లో సహకరించడానికొచ్చిన శ్రీ రామకృష్ణానంద స్వామి “నమో నమో రాఘవాయ” అనే మంత్రాన్ని త్యాగరాజుకి ఉపదేశించారనీ రాసారు. దాదాపు ఇలాగే రాసినా, కృష్ణ స్వామి భాగవతారు రాసినదాంట్లో, శ్రీ రామకృష్ణానంద స్వామి ప్రస్తావనెక్కడా లేదు. సరిగ్గా అప్పుడే రామబ్రహ్మం తమ కుటుంబారాధ్య దైవమైన శ్రీరాముణ్ణి నిత్యమూ పూజించే బాధ్యత త్యాగరాజుకి అప్పగించాడు.

తిరువైయ్యారులో కానీ, తిరువారూరులో కానీ, ఆ చుట్టు పక్కల ఎక్కడా ఒక్క రామాలయం లేదు. ఉన్నవన్నీ శివాలయాలే. పేరుకి తగ్గట్టు రామబ్రహ్మం రామ భక్తుడు. అదే రామభక్తిని త్యాగరాజుకీ వారసత్వంగా అందించాడు. ప్రతీయేటా తప్పని సరిగా శ్రీరామ నవమి ఉత్సవాలు జరిపేవాడు రామబ్రహ్మం. ఈ రామనవమి ఉత్సవాలు అన్నది భద్రాచల రామనవమి ఉత్స్తవాల స్ఫూర్తి తోనే అప్పట్లో తెలుగునాట జరిపేవారు. ముఖ్యంగా తంజావూరు చుట్టుపక్కల ఈ రామనవమి ఉత్సవాలు అప్పట్లో జరిగేవి కావు. త్యాగరాజూ ఈ ఉత్సవాల్లో పాల్గొనేవాడు. ఉత్సవ సంప్రదాయ కీర్తనలు రాయడానికి ఇవే కారణం కావచ్చు.

తండ్రప్పగించిన రామ పూజని త్యాగరాజు నిత్యమూ ఎంతో శ్రద్ధతో చేసేవాడు. తను కాలం చేసే వరకూ త్యాగరాజు ఈ రామ విగ్రహానికి నిత్యారాధన జరిపేడు. (ఈ విగ్రహం మధ్యలో ఒకసారి పోయి దొరికింది. ఆ విషయం ముందు ముందు వస్తుంది.)

&~~SPECIAL_REMOVE!#~~lt;span title=


సీతారాముల విగ్రహం

ఈ విగ్రహం కూడా తంజావూరు మ్యూజియంలో ఉంది. ఈ విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, దీనికీ భధ్రాచల రామ విగ్రహానికీ చాలా దగ్గర పోలికలు కనిపిస్తాయి.

భధ్రాచల రామ విగ్రహానికొక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే - సీతమ్మ వారు రాముడి తొడపైన కూర్చొనుంటుంది. ఇదొక్క భద్రాచల విగ్రహంలోనే కనిపిస్తుంది. మిగతా దేవాలయాల్లో రాముడి పక్కనే సీతమ్మ వారు ఉంటుంది. రామబ్రహ్మం పూర్వీకుల ఆరాధ్య దైవం భద్రాచల రాముడే అయ్యుండచ్చని నా విశ్వాసం. రామ బ్రహ్మం పూర్వీకులు కర్నూలుండి తంజావూరు వలస వెళ్ళారని తెలుసు. భద్రాచల రామదాసు జీవిత కాలం 1620 - 1680 మధ్యన. ఆ తరువాతే విజయ నగర సామ్రాజ్య పతనమూ, కొంతకాలానికి తంజావూరు గద్దెపై మరాఠీ రాజుల పాలనా మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలోనే తెలుగుసీమ నుండి తంజావూరికి వలసలు మొదలయ్యాయి. అంతేకాకుండా త్యాగరాజు తల్లి దగ్గర రామ దాసు కీర్తనలన్నీ చిన్నతనంలో నేర్చుకున్నాడు. ఇవన్నీ చూస్తే త్యాగరాజు కుటుంబ దైవం భద్రాచల రాముడే అయ్యుండచ్చని నా నమ్మకం.

సంగీతంలో త్యాగరాజు అపార ప్రావీణ్యం చూసి రామబ్రహ్మం సంగీతంలో సులువులూ, మెలకువులూ తెలుసుకోమని శొంఠి వెంకట రమణయ్య అనే గురువు దగ్గరకి శిష్యుడిగా పంపించాడు. ఈ శొంఠి వెంకటరమణయ్య తుల్జాజీ మహారాజు కొలువులో ప్రధాన ఆస్థాన సంగీత విద్వాంసుడు. రామ బ్రహ్మమూ తుల్జాజీ కొలువులోనే ఉండడం వల్ల వెంకటరమణయ్య త్యాగరాజుని శిష్యుడిగా స్వీకరించడం సులువయ్యింది. కొంతకాలం ఆయన వద్ద సంగీతం నేర్చుకున్నాడు త్యాగరాజు. వి.రాఘవన్ అనే సంగీత శాస్త్ర కారుడి వద్ద 1800 కాలంలో సంగీతం సంబంధించి సంస్కృతంలో రాసిన కొన్ని ప్రతులుండేవి. అందులో ఈ శొంఠి సుబ్బయ్య కొడుకు వెంకటరమణయ్య అనే ఆయన వివిధ రకాల తాళ ప్రక్రియల్లో ప్రసిద్ధుడని ఉందనీ రాసారు. త్యాగరాజు గురువైన ఈ శొంఠి వెంకటరమణయ్య 1803 నుండి 1817 వరకూ మద్రాసు (చెన్నై) లో ఉండి ఉండవచ్చనీ రాఘవన్ అభిప్రాయపడ్డారు. త్యాగరాజు ఈయన వద్ద ఎంతో కాలం సంగీతం నేర్చుకోలేదు. “ప్రావీణ్యం సంపాదించడానికందరికీ కొన్ని సంవత్సరాలు పట్టే సంగీతాన్ని, త్యాగరాజు ఒక్క ఏడాదిలోపునే గ్రహించేసాడని ఆయన చరిత్ర రాసిన అనేకమంది చెప్పారు.

కొన్ని నెలల తరువాత త్యాగరాజు తల్లి వైపు తాత, వీణ కాళహస్తయ్య, చని పోయారు. అప్పుడు ఆయన దగ్గర “నారదీయం” అనే పేరుతో అనేక తాళ పత్ర గ్రంధాలు త్యాగరాజుకి లభించాయి. అవన్నీ క్షుణ్ణంగా చదివాడు. కానీ చాలా విషయాలు అవగతం కాలేదు. సరిగ్గా అప్పుడే అనుకోకుండా రామకృష్ణానంద స్వామిని కలవడం జరిగింది. త్యాగరాజు “నారదీయం” గ్రంధం గురించి చెప్పాడు. చాలా విషయాలు బోధ పడలేదనీ చెప్పాడు. అప్పుడా రామకృష్ణానంద స్వామి నారదోపాసన మంత్రం ఉపదేశించి, త్యాగరాజుని నారద మంత్ర జపం చేయమన్నాడు. త్యాగరాజు కొన్ని 96 కోట్ల సార్లు జపం చేసాడని వెంకట రమణ భాగవతారు రాసారు.

సరిగ్గా ఇక్కడే హరికథా భాగవతార్ల భక్తితో కూడిన ఊహజనిత మైన అల్లిక కనిపిస్తుంది. కొన్ని కోట్ల జపానంతరం నారదుడు త్యాగరాజుకి ప్రత్యక్ష మయ్యాడనీ, నారదుడు ప్రసన్నుడై “స్వరార్ణవం” అనే మరో సంగీత శాస్త్ర గ్రంధం కానుకగా ఇచ్చాడనీ రాసారు.

నారద సాక్షాత్కారం అయ్యాక, నారదుడి పై గురు భావంతో త్యాగరాజు “వరనారద” మరియు “శ్రీ నారద” అనే రెండు కృతులు స్వర పరిచాడనీ రాసారు.

ఇదే విషయం కృష్ణ బాగవతార్ వేరే రకంగా రాసారు. ఆయన నారదుడూ, ప్రత్యక్ష మవ్వడం ఇవేం రాయలేదు. కానీ త్యాగరాజు తల్లి తాతగారు గిరిరాజకవి చనిపోయినప్పుడు ఇంట్లో ఆయన వస్తువులన్నీ సర్దుతుండగా “సంగీత రత్నాకరం” అనే గ్రంధమూ, ఇంకా సంగీతానికి సంబంధించినవనేకం దొరికాయనీ రాసారు. ఈ సంగీత రత్నాకరం” మాతృభూతేశ్వర అనే ఆయన తల్లి తాతగారు గిరిరాజ కవికిచ్చినట్లుగా రాసారు. బహుశా ఈ మాతృభూతేశ్వరుడు 18వ శతాబ్దంలో తిరుచిరాపల్లి లో ఉన్న ఓ ప్రముఖ సంగీత విద్వాంసుడు కావచ్చని పి.సాంబమూర్తి గారు రాసారు. అదలా ఉంచితే, ఈ గిరిరాజ కవి త్యాగరాజు తల్లి తాతగారు. అంటే త్యాగరాజుకి ముత్తాత. ఈ కొత్త బంధుత్వం ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాదు. తండ్రివైపు తాత గిరిరాజ కవి అని తెలుసు. మరి ఈ ముత్తాత గారి పేరు కూడా గిరిరాజ కవేనా అన్నది రూఢిగా చెప్పడానికెక్కడా ఆధారాలు లేవు. ఈ రెండు విషయాలూ చదువర్లని అయోమయంలో పడేస్తాయనడానికి మాత్రం సందేహించనవసరం లేదు.

ఈ సంగీత రత్నాకరంలో 72 మేళ కర్త రాగాల గురించీ, వివిధరకాలైన తాళాల గురించీ, 22 శ్రుతులూ, వాటిననుసరించే అను శ్రుతుల ప్రాధాన్యత గురించీ, 10 రకాలైన గమకాల వివరాలూ, ఔడవ రాగాల ప్రశస్తీ, ఇలా ఎన్నో విషయాలున్న గ్రంధమది. వి.రాఘవన్ అనే ఆయన “స్వరార్ణవం” అనే గ్రంధాన్ని మిగతా సంగీత గ్రంధాలతో (The Music Academy Journal) కలిపి పొందుపరచనట్లుగా ఉంది.

నారద మంత్రమే కాకుండా రామ తారక మంత్రాన్నీ కూడా కొన్ని కోట్ల సార్లు జపించాడాని రాసారు. ఎన్ని సార్లు జపించినా రాముడు ప్రత్యక్షం కాలేదు. ఎన్నో సార్లు కనిపించీ కనిపించనట్లుగా త్యాగరాజుకి భ్రమ కలిగేది. అప్పుడే “ఏల నీ దయా రాదూ” అనే కృతిని రచించాడనీ చెబుతారు.

త్యాగరాజు రచించిన కృతులని ఏ సందర్భంలో పాడాడూ, ఎప్పుడు రాసాడూ అన్న దానికి సరైన ఆధారాలు లేవు. ఏ ప్రతిలోనూ తేదీ కానీ, సంవత్సరం కానీ లేవు. అందువల్ల ప్రజలకు లభ్యమైన కృతుల సాహిత్యం బట్టీ, త్యాగరాజు జీవితంలో జరిగినట్లనిపించిన సంఘటనలకి ముడివేయడం ప్రారంభించారు. ఏ కృతి చూసినా ఫలానా సందర్భంలో చెప్పి ఉండచ్చు అనే ఊహాగానంతోనే చెప్పారనుకోవాలి తప్ప, సరైన ఆధారాలు లేవు. కొన్ని కృతులకి మాత్రం ఎక్కడ పాడారో చెప్పారు. తేదీలు లేకపోయినా ప్రదేశాన్ని బట్టీ, సందర్భాన్ని బట్టీ, ఏ దైవాన్నుద్దేశించి రాసిన దాన్నిబట్టీ చెప్పడం జరిగింది. కోవూరు కీర్తనలూ, తిరుపతి వెంకటేశ్వర స్వామి పై రాసినవీ ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

పంచనదయ్య త్యాగరాజు పెద్దన్నయ్య. అతను పెళ్ళి చేసుకొని మామూలు సంసారిక జీవితాన్ని గడిపేవాడు. ఈయన్నే “జప్యేశ” అని కొంత మంది సంబోధించారు. త్యాగరాజు చిన్నన్నయ్య పేరు పంచాపకేశ బ్రహ్మం. అతను త్యాగరాజుకి వివాహం కాకమునుపే అనారోగ్యంతో పోయాడు. అతను అనారోగ్యంతో మంచానున్నప్పుడు “అన్యాయము సేయకురా” అనే కృతిని త్యాగరాజు పాడినట్లుగా వెంకటరమణ, కృష్ణస్వామి భాగవతార్లిద్దరూ రాసారు.

త్యాగరాజు రాసిన మొదటి కృతి ఏదీ? ఎన్నో ఏట రాసాడూ? అన్న వివరాలు ఇదమిత్థంగా తెలీవు. కొంతమంది “గిరిరాజ సుత తనయ” అనే కృతే మొట్టమొదటి రచన అని నమ్ముతారు. అది కాదు “నమో నమో రాఘవాయ” (దేశి తోడి రాగం) మొట్ట మొదటి కృతి అని వాదిస్తారు. మొదటిది తెలుగులో రాసింది. నమో నమో రాఘవాయ మాత్రం సంస్కృత రచన.

ఇదే మొదటి కృతి అని చెప్పడానికి రెండు ఆధారాలు కూడా చూపించారు. త్యాగరాజు సంస్కృత విద్యా నిమిత్తమై తిరువైయ్యరు వచ్చాడు. ఎవరికైనా విద్యా ప్రభావం చిన్న తనంలో ఉంటుంది. గురువులైన సంస్కృతం పండితుల ప్రభావం ఉండే అవకాశాలు ఎక్కువ. బహుశా అదే ప్రభావంతో త్యాగరాజు సంస్కృతంలో రాసుండచ్చని వాదించారు. ఈ రచన త్యాగరాజు 13 నుంది 15 ఏళ్ళ వయసులో జరిగుండవచ్చనీ చెప్పారు. ఈ కృతి పూర్తిగా సంస్కృతంలోనే ఉంటుంది. త్యాగరాజు సంస్కృతంలో రాసిన కృతుల్లో ఇదే మొదటి కృతిగా చెప్పుకోవాలి. ఆ తరువాత రాసినవాటిలో ఎక్కువ భాగం అచ్చ తెలుగులోనే ఉన్నాయి. ఇదే విషయం విలియం జాక్సన్ (త్యాగరాజ: లైఫ్ అండ్ లిరిక్స్) లో ప్రస్తావించాడు. అతనే దీనికంటే మరో బలమైన కారణం చూపింఛాడు.

త్యాగరాజు చిన్నతనంలో అంటే, 1780 నుండి 1783 మధ్యన తంజావూరికి విపరీతమైన కరువొచ్చింది. మైసూరు రాజైన హైదరాలీ సైన్యం తంజావూరు చుట్టు పక్కల గ్రామాలనన్నీ మట్టుపెట్టాయి. పల్లెల్లో వున్న పంటకాల్వల్నీ, వ్యవసాయ భూముల్నీ చింద్రం చేసేసారు. భయంతో ప్రజలు దగ్గరున్న పట్టణాలికి పరిగెత్తారు. ప్రతీ గ్రామంలోనూ నీటికీ, తిండికీ ఎద్దడొచ్చింది. గోరుచుట్టుపై రోకలి పోటులా ఓ రెండేళ్ళ పాటు రుతుపవనాలు రాలేదు. వర్షాల్లేవు. పొలాలన్నీ బీడు భూముల్లా తయారయ్యాయి. ఇది జరిగినప్పుడు త్యాగరాజుకి సుమారు 13 నుండి 15 ఏళ్ళ వయసుండుంటుంది. ఇది చూసి చలించి, ఓ జానపద గీతంలా రాముణ్ణి వేడుకుంటూ త్యాగరాజు రాసాడనీ అన్నారు. ఆ కృతిలో - రాముడే రక్షిస్తాడనీ, సకల లోక రక్షకుడనీ, దుష్ట శిక్షకుడనీ కీర్తిస్తూ, పేదవారి కష్టాలని దాటించే దయాశీలనీ చెప్తాడు. తనని నమ్ముకున్న భక్తులకి రాముడెన్నడూ అన్యాయం చేయడనీ అంటాడు. తన చుట్టూ ఉన్న దయార్ద్ర స్థితిని చూసి దైవ భక్తి ద్వారా ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి త్యాగరాజు ప్రయత్నించాడని జాక్సన్ అభిప్రాయపడ్డాడు. ఇదే త్యాగరాజు మొదటి రచన అయ్యుండచ్చనీ చెప్పాడు. ఇందులో ఎక్కడా హైదరాలీ సైన్యం అకృత్యాలు కానీ, నిస్సహాయ రాజుల గురించి కానీ ఎక్కడా ప్రస్తావించ లేదు.

త్యాగరాజు జీవిత చరిత్ర రాసిన ఇద్దరూ (వెంకట రమణ భాగవతార్, ఆయన కొడుకు కృష్ణస్వామి బాగవతార్ కానీ) 1781 సంవత్సరంలో తంజావూరు రాజ్యంలో వచ్చిన కరువు గురించి కానీ, హైదరాలీ అకృత్యాల గురించి కానీ రాయలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అప్పటికి పుట్ట లేదు. ఒకవేళ పుట్టినా ఈ విషయాలు రాసుండేవారు కారనీ విలియం జాక్సన్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే వీళ్ళు త్యాగరాజుని దేవుని అవతారంగా భావించి రాసారు. పురాణ పురుషుడిగా భావించారు. త్యాగరాజు కూడా తన రచనల్లో ఎక్కడా ఈ కరువు ప్రస్తావన తీసుకు రాలేదు. అదీకాక హిందువులకి పురాణా కథలమీదున్న భక్తీ, ఆసక్తీ, చరిత్ర మీద లేదని పండితుల అభిప్రాయంగా విలియం జాక్సన్ రాసాడు.

“గిరిరాజ సుత తనయే” మొదటి కృతని సుబ్బరామ దీక్షితార్ (1839 - 1906) అనే ఆయన రాసారు. ఈ సుబ్బరామ దీక్షితార్ చిన్నతనంలో త్యాగరాజుని కలిసారు. ఈయన ముత్తుస్వామి దీక్షితార్ వంశీకుడు. ఈయన సంగీతానికి సంబంధించిన చాలా గ్రంధాలు సేకరించాడు. సంగీత సంప్రదాయ ప్రదర్శిని (Exposition of the Tradition of Music) అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఇందులో దక్షిణ భారత దేశంలోని వాగ్గేయ కారుల జీవిత చరిత్రలు రాశాడు. త్యాగరాజు గురించీ కొద్దిగా రాసాడు. తిరువారూర్ త్యాగరాజ స్వామి అవతారమే ఈ త్యాగరాజనీ కీర్తించాడు. త్యాగరాజు జీవితం గురించి వివరాలెక్కువ దొరకలేదనీ విచారించాడు.

ఇలా ఎవరికి ఏ విషయం తెలిస్తే దాన్ని వాళ్ళు రాసారు. ఇందులో స్తవమెంత, వాస్తవమెంత అన్నది తెలీదు. శాస్త్రీయంగా ఆధారాలు చూపించినప్పుడే ఇదీ సరైన చరిత్ర అని చెప్పగలం.

త్యాగరాజుకి 18వ ఏట (1785 లో) పార్వతనే అమ్మాయినిచ్చి వివాహం చేసారు. త్యాగరాజు 20 వ ఏట తండ్రి రామబ్రహ్మం కాలం చేసాడు. (త్యాగరాజుకి 15 ఏళ్ళ వయసులోనే మాతా పిత్రు వియోగం కలిగిందనీ సుబ్బరామ దీక్షితార్ రాసారు. దీనికి ఆధారాలెక్కడివో తెలీవు. )

సరిగ్గా తండ్రి పోయిన మూడేళ్ళకి త్యాగరాజు భార్య పార్వతి మరణించింది. ఆ తరువాత రెండేళ్ళకి పార్వతి చెల్లెలు కమలాంబని త్యాగరాజు రెండో పెళ్ళి చేసుకున్నాడు.

ఇక్కడి వరకే వెంకటరమణ భాగవతార్ రాసిన తాళ పత్ర గ్రంధం ఉంది. మిగతా జీవిత విశేషాలు ఎందుకు పొందుపరచలేదో తెలీదు. అలా అర్థాంతరంగా ముగించడానిగ్గల వివరాలెవ్వరికీ తెలీదు. అందువల్ల తరువాతాయన కొడుకు కృష్ణస్వామి రాసిన త్యాగరాజు జీవిత చరిత్రే అందరికీ ఆధారమయ్యింది. అందులోంచే మిగతా విశేషాలు తెలిసాయి.

No comments:

Post a Comment